Skip to main content

సామాజిక దృష్టితో రాజ్యాంగంపై అవగాహన

భారత రాజ్యాంగం.. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. దేశ సుపరిపాలన దృష్ట్యా రాజ్యాంగ పరమైన దృష్టి కోణంలో అభ్యర్థులు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ప్రభుత్వ సర్వీసుల ద్వారా ప్రజా సేవకులుగా బాధ్యతలు నిర్వహించనున్న గ్రూప్స్ పరీక్షల అభ్యర్థులకు రాజ్యాంగం, రాజ్యాంగ న్యాయాలపై లోతైన అవగాహన ఉండాలి. ఇది కేవలం పరీక్షలో విజయానికే కాకుండా.. భవిష్యత్తులో విధులు సమర్థంగా నిర్వహించేందుకు కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యురాలు, ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయం నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్.వాసంతి. సమాజంలోని భిన్న వర్గాల స్థితిగతులపై ఎన్నో పరిశోధనలు చేసిన ప్రొఫెసర్ ఎన్.వాసంతి.. భారత రాజ్యాంగంపై గ్రూప్స్ పరీక్షల అభ్యర్థులు అవగాహన పెంచుకోవాల్సిన తీరుతెన్నులపై అందిస్తున్న విశ్లేషణాత్మక వ్యాసం..
భారత రాజ్యాంగం ప్రాథమికంగా ఒక సామాజిక పత్రం(సోషల్ డాక్యుమెంట్)- భారత రాజ్యాంగంపై పరిశోధన చేసిన బ్రిటన్‌కు చెందిన ప్రముఖ విద్యావేత్త, గ్రాన్‌విల్లే ఆస్టిన్ చేసిన ఈ వ్యాఖ్యానం.. భారత రాజ్యాంగంలో సామాజిక భావన, అభివృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఉద్ఘాటిస్తోంది. కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వ సర్వీసుల్లో చేరి ప్రజలకు సేవలందించాలనుకునే వారు రాజ్యాంగాన్ని విభిన్న శైలిలో అవగాహన చేసుకోవాలి. రాజ్యాంగాన్ని అధికారాలు, బాధ్యతలతో కూడిన ఒక డాక్యుమెంట్‌లా భావించకుండా.. ఇందులో సామాజిక అభివృద్ధి దిశగా ఉన్న అంశాలను స్పృశించాలి.

రాజ్యం అంటే..
రాజ్యాంగంలో ప్రథమంగా అర్థం చేసుకోవాల్సింది ‘రాజ్యం’ అనే పదానికి నిర్వచనం. రాజ్యాంగంలోని 12వ అధికరణం ప్రకారం- సమాజాభివృద్ధికి అవసరమైన అన్ని విభాగాలకు సంబంధించిన విధులను సమర్థంగా నిర్వహించడమే రాజ్యం ప్రధాన కర్తవ్యం. వీటిలో విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం వంటి వాటితోపాటు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే పోలీస్, రక్షణ విభాగాలు సైతం ముఖ్యమైనవి. ఈ క్రమంలో రాజ్యం తన అధికారాలను నిర్వర్తించే విధంగా ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలను రూపొందించారు.

ప్రజాస్వామ్యం, లౌకికత్వం, న్యాయ నియమాలు, న్యాయ సమీక్ష, సామాజిక న్యాయం అనేవి భారత రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంలో అత్యంత ముఖ్యమైన అంశాలు. రాజ్యాంగ విధానం ప్రకారం - ఆధునిక సమాజంలో అన్ని వర్గాలను సామాజిక సమ్మిళిత వృద్ధి విధానాల ద్వారా ప్రగతి పథంలో నడిపించడమే రాజ్యానికున్న ప్రధాన పాత్ర. వ్యక్తిగత హక్కులు, స్వేచ్ఛలను గౌరవిస్తూనే సామాజిక సమ్మిళిత వృద్ధి పెంపొందించడానికి కృషి చేయాలి.

రాజ్యాంగ పరమైన నైతికత
భారత రాజ్యాంగంలో మరో ముఖ్య అంశం.. రాజ్యాంగ పరమైన నైతికత. రాజ్యాంగ పరమైన నైతికత అనేది చట్టం ఆధారంగా చర్చించదగిన సాంఘిక అధికారాలను నిర్వర్తించేటప్పుడు బహిర్గతమవుతుంది. భారత రాజ్యాంగం ఫార్మల్ ఈక్వాలిటీ అనే దశను దాటి దృఢ సమానత్వం దిశగా రూపొందింది. సామాజికంగా వెనుకబడిన వర్గాలు, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు, మహిళలు, చిన్నారులు.. ఇలా సమాజంలో భిన్న వర్గాల అభ్యున్నతికి రూపొందించిన ప్రత్యేక విధానాల్లో ఇది ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగంలోని మరో క్రియాశీలక అంశం.. రాజ్యాంగంలో రాజ్యం హక్కులను మాత్రమే కాకుండా వ్యక్తిగత హక్కుల గురించి ప్రత్యేకంగా పేర్కొనడం. అంటరానితనం, బహిరంగ ప్రదేశాల్లో వివక్షపై నిషేధం వంటి వాటిపై ప్రత్యేక దృష్టితో మన రాజ్యాంగం వ్యవహరించింది.

సమానత్వం దిశగా రిజర్వేషన్లు
దృఢ సమానత్వం దిశగా విద్య, ఉపాధి అవకాశాలతోపాటు పరిపాలన భాగాలైన మున్సిపాలిటీలు, పంచాయతీల్లో అణగారిన, వెనుకబడిన వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చే విధంగా రిజర్వేషన్ విధానాలు రూపొందాయి.

ఈ విధానాలను సమానత్వ సిద్ధాంతానికి కొనసాగింపుగా చూడాలే తప్ప, అసమానతలను తొలగించే క్రమంలో సమానత్వాన్ని పెంపొందించడానికి రూపొందించిన చర్యలుగా భావించకూడదు. రాజ్యాంగం ప్రకారం- ప్రజాస్వామ్య దేశంలో అన్ని వర్గాల ప్రజలు పబ్లిక్ పాలసీ రూపకల్పన, పరిపాలనలో సమానంగా పాల్పంచుకోవాలి. రాజ్యాంగంలో సర్వవ్యాప్తంగా ఉన్న ‘సామాజిక న్యాయం’ అనే సిద్ధాంతాన్ని సమర్థంగా అమలు చేయడం కోసం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు ఎన్నో సవరణలు జరిగాయి. రాజ్యాంగంలో కల్పించిన సవరణలు చేసే అధికారం ద్వారా ఇవి సాధ్యమయ్యాయి.

న్యాయ వ్యవస్థపై అవగాహన
భారత రాజ్యాంగంతోపాటు రాజ్యాంగంలో ప్రధాన భాగమైన న్యాయ వ్యవస్థపై ప్రత్యేక అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం. రాజ్యంలో ప్రజలకు సంక్రమించిన హక్కులు, అధికారాల పర్యవేక్షణ, అమలు, ప్రభుత్వాల విధుల సక్రమ అమలు విషయంలో న్యాయ వ్యవస్థది కీలక పాత్ర. అదేవిధంగా హక్కులను అతిక్రమించే సందర్భాల్లో ప్రభుత్వానికి ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారం దిశగా హైకోర్టులు, సుప్రీంకోర్టుల ఆదేశాలు, ఉత్తర్వులపై ప్రధానంగా దృష్టి పెట్టాలి.

వివక్షతలు.. చట్టాలు
అభ్యర్థులు రాజ్యాంగ దృక్కోణాన్ని అలవర్చుకునే క్రమంలో సమాజంలో నెలకొన్న వివక్షతలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. కుల, మత, లింగ, వికలాంగుల పట్ల చూపుతున్న వివక్ష, వీటి పరిష్కారం కోసం రూపొందించిన చట్టాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఇందులో ముఖ్యమైనది వికలాంగుల పట్ల వివక్షతను తొలగించేందుకు రూపొందించిన పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ (సమాన అవకాశాలు, హక్కుల సంరక్షణ, పూర్తి భాగస్వామ్యం) యాక్ట్-1995. వాస్తవానికి భారత రాజ్యాంగంలో అంగ వికలురు-వివక్షపై ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ సమానత్వం, అభేదత్వం, సమాన అవకాశాలు కల్పించడం వంటివి పేర్కొనడం జరిగింది. దాంతో అంగవికలుర పట్ల చూపుతున్న వివక్షతను తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం కలిగింది. ఇదే విధంగా లింగ వివక్ష కూడా. ముఖ్యంగా ఇటీవల కాలంలో ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ పట్ల వివక్షతను రూపుమాపే దిశగా తీసుకుంటున్న చర్యలు కూడా రాజ్యాంగంలో పేర్కొన్న అభేదత్వం తొలగింపు సిద్ధాంతాల ఆధారంగానే అని తెలుసుకోవాలి.

కాన్‌స్టిట్యూషనల్ లా ప్రత్యేకం
రాజ్యాంగం, సుపరిపాలన, సమానత్వం తదితర కోణాల్లో మరో ముఖ్యమైన అంశం.. కాన్‌స్టిట్యూషనల్ లా. ఈ కాన్‌స్టిట్యూషనల్ లా అనేది కేవలం పరిపాలన స్వరూపాలకు సంబంధించినదే కాదు. సామాజిక తత్వానికి సంబంధించింది కూడా. దీన్నే డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కాన్‌స్టిట్యూషనల్ మొరాలిటీగా పేర్కొన్నారు. ఇలా.. కాన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అందులోని అంశాలను ప్రాథమిక స్వరూపం నుంచి సామాజిక ప్రగతి సూచికల కోణంలో చదివితేనే ఈ విభాగంలో పరిపూర్ణత లభిస్తుంది!!

అభ్యర్థులకు సూచనలు
  • రాజ్యాంగాన్ని ఒక పాఠ్యాంశంగా చదవొద్దు. సామాజిక దృక్పథం అలవర్చుకొని అధ్యయనం చేయాలి.
  • రాజ్యాంగంలో పేర్కొన్న అధికరణలు, ప్రకరణలు, సవరణలకే పరిమితం కాకుండా.. వాటి ద్వారా సాధించిన సామాజిక ప్రగతిపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.
  • రాజ్యాంగంలో అంతర్భాగంగా ఉన్న కాన్‌స్టిట్యూషనల్ లా, కాన్‌స్టిట్యూషనల్ మొరాలిటీ, రాజ్యాంగ బద్ధత గురించి తెలుసుకోవాలి. వీటి మధ్య వ్యత్యాసాలపై అవగాహన పెంచుకోవాలి.
  • రాజ్యాంగానికి ఎదురైన సవాళ్ల గురించి తెలుసుకోవాలి. వీటి పరిష్కారం దిశగా న్యాయస్థానాల చొరవపై అవగాహన ఏర్పరచుకోవాలి.
  • ప్రజా సంక్షేమం దిశగా ప్రాథమిక హక్కులు, శాసనాధికారాలు, కార్యనిర్వహణ విధుల గురించి క్షుణ్నంగా, లోతుగా అధ్యయనం చేయాలి.
  • విభిన్న వర్గాల సమానత్వం దిశగా తీసుకున్న చర్యలపై అవగాహన లేకపోతే రాజ్యాంగం, దాని భావనను అర్థం చేసుకోవడం కష్టం.
  • రాజ్యం అధికారాలతోపాటు బాధ్యతలు, విధుల గురించి అవగాహన ఉండాలి. వీటన్నిటినీ రాజ్యాంగంలో అంతర్భాగంగా రూపొందించారు.

చదవాల్సిన పుస్తకాలు
  • ముందుగా భారత రాజ్యాంగానికి సంబంధించి ప్రాథమిక సమాచారం ఉన్న పుస్తకాలను చదవాలి (తెలుగు అకాడెమీ బుక్స్).
  • రాజ్యాంగానికి సంబంధించి ముఖ్యమైన కేస్ లాస్ గురించి తెలుసుకోవాలి.
  • డి.డి.బసు, వి.ఎన్.శుక్లా రాసిన కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకాలు చదివితే సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది.
Published date : 01 Oct 2015 11:49AM

Photo Stories