Skip to main content

TSPSC: లీకేజీ ఎలా చేశారు? పేపర్లు ఎవరెవరికి అమ్మారు?

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. పేపర్‌ లీకేజీ నిందితులు, పేపర్లు కొనుగోలు చేసిన వారి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల మూలాలపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు.
TSPSC
లీకేజీ ఎలా చేశారు? పేపర్లు ఎవరెవరికి అమ్మారు?

ఇప్పటికే సిట్‌ కేసు వివరాల ఆధారంగా ఈసీఐఆర్‌(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌) నమోదు చేసిన ఈడీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్‌కుమార్‌ , రాజశేఖర్‌రెడ్డిలను కోర్టు అనుమతితో ఏప్రిల్‌ 17న నలుగురు సభ్యుల ఈడీ అధికారుల బృందం ప్రశ్నించింది. ఏప్రిల్‌ 17 ఉదయం 11–45 గంటల సమయంలో ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్లు సుమిత్‌ గోయల్, దేవేందర్‌సింగ్‌ల నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం చంచల్‌గూడ జైలుకు చేరుకుంది. 

చదవండి: TSPSC Paper Leak: ‘ఆడి’ కారు అమ్మి.. అడ్వాన్సు ఇచ్చి పేపర్‌ ఖరీదు.. ఈమె కోసమే..

జైలు లోపలే వేర్వేరుగా విచారణ 

జైలు లోపలే ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిలను వేర్వేరుగా ప్రశ్నించారు. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ఈ దర్యాప్తులో ఇద్దరి తరఫు న్యాయవాదుల సమక్షంలోనే ఈడీ అధికారులు ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిల స్టేట్‌మెంట్లను రికార్డు చేసినట్టు తెలిసింది. తొలి రోజు విచారణలో ప్రధానంగా ఇద్దరి కుటుంబ నేపథ్యాలు. బ్యాంకు లావాదేవీలు, టీఎస్‌పీఎస్సీలో ఇతర అధికారులు, సిబ్బందితో పరిచయాలు, పేపర్‌ లీకేజీకి ఎలా పాల్పడ్డారు..అనంతరం ఎవరెవరితో పేపర్‌ విక్రయానికి సంబంధించి సంప్రదింపులు జరిపారు..అన్న అంశాలపై లోతుగా ఆరా తీసినట్టు తెలిసింది. 

చదవండి: TSPSC Paper Leak Case: తండ్రి ఉద్యోగం రాక‌పోవ‌డంతో... పేప‌ర్ల‌ను లీక్ చేసి సొమ్ముచేసుకోవాల‌ని చూసిన ప్రవీణ్‌

మధ్యవర్తులుగా ఎవరెవరున్నారు? 

టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ నుంచి దొంగిలించిన పేపర్లు కొనుగోలుకు మధ్యవర్తులుగా ఎవరెవరు ఉన్నారు? వారితో ఎలా పరిచయం...? పేపర్ల కొనుగోలు చేసేందుకు ఎవరెవరు ఎలా సంప్రదించారన్న ప్రాథమిక అంశాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. వాస్తవానికి ఈ కేసులో ఆర్థిక అంశాలపైనే ఈడీ ఫోకస్‌ పెట్టినప్పటికీ, అందుకు ఎలా మార్గాలు ఏర్పడ్డాయన్నది సైతం ఈడీ అధికారులు కూలంకషంగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈడీ అధికారులు టీఎస్‌పీఎస్సీ కాని్ఫడెన్షియల్‌ సెక్షన్‌ అధికారి శంకరమ్మ, మరో అధికారి సత్యనారాయణలను సైతం ఏప్రిల్‌ 13న ప్రశ్నించిన విషయం తెలిసిందే. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కూడా కొన్ని ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. ఏప్రిల్‌ 17న  మరోమారు ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిలను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.  

చదవండి: TSPSC: బాధితుల కోసం వాట్సాప్‌ నంబర్‌

Published date : 18 Apr 2023 02:54PM

Photo Stories