TSPSC: ఓటీఆర్ చేయాల్సిందే..! ఎడిట్ చేసుకోకుంటే కష్టమే..
ఒన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్).. ఇది లేనిదే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెబ్సైట్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తు చేసుకునే వీలే లేదు. ప్రస్తుతం గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ.. త్వరలో గ్రూప్–2, 3, 4 ఉద్యోగ ప్రకటనలను సైతం జారీ చేయనుంది. ఈ క్రమంలో గ్రూప్స్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులంతా కచి్చతంగా ఓటీఆర్ నమోదుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. కానీ మెజార్టీ అభ్యర్థులు ఓటీఆర్పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొత్తగా ఓటీఆర్ నమోదు సంగతి అటుంచితే... ఇప్పటికే నమోదు చేసుకున్న అభ్యర్థులు నూతన జోనల్ విధానానికి అనుగుణంగా సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈమేరకు టీఎస్పీఎస్సీ ఎడిట్ (సవరణ) ఆప్షన్ ఇచ్చినప్పటికీ స్పందన అంతంతమాత్రంగానే ఉంది.
చదవండి:
TSPSC గ్రూప్–1 నోటిఫికేషన్.. శాఖలవారీగా పోస్టులు.. వయోపరిమితి సడలింపు!
స్థానికత నిబంధనల మార్పులతో...
టీఎస్పీఎస్సీ ఓటీఆర్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చే నాటికి 25 లక్షల మంది నమోదు చేసుకున్నారు. పాత జోనల్ విధానం ప్రకారం 4 నుంచి పదో తరగతి వరకు గరిష్టంగా ఎక్కడ చదివితే ఆ ప్రాంతాన్ని స్థానికత కింద పరిగణనలోకి తీసుకునేవారు. ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు చేరింది. ఈ క్రమంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త జోనల్ విధానం రావడంతో స్థానికత నిబంధనల్లో మార్పులు జరిగాయి. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కువ కాలం చదివిన ప్రాంతాన్ని స్థానికతగా పరిగణిస్తారు. ఈక్రమంలో ఇదివరకు ఓటీఆర్ నమోదు చేసుకున్న అభ్యర్థులంతా ఎడిట్ ఆప్షన్ ను ఉపయోగించుకుని ఒకటి నుంచి ఏడో తరగతి వివరాలను అప్లోడ్ చేయాల్సిందే. అప్పుడే ఓటీఆర్ ప్రక్రియ పూర్తవుతుందని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఎడిట్ ఆప్షన్ ఇచ్చి నెల కావస్తున్నప్పటికీ 1,62,040 మంది మాత్రమే సవరణ చేసుకున్నారు. ఇంకా ఎడిట్ చేసుకోవాల్సిన అభ్యర్థులు 23.5 లక్షలున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.