TSLPRB: దళారులను నమ్మి మోసపోవద్దు
కోర్టు ఆదేశాల మేరకు అదనపు మార్కులతో అర్హులైన అభ్యర్థులకు రెండో దశ దేహదారుఢ్య పరీక్షలను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) అధికారులు నిర్వహిస్తున్నారు. మార్చి నెలలో తుది రాత పరీక్షకు బోర్డు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ దశలో పోలీస్ ఉద్యోగార్థులను మభ్యపెట్టి, ఉద్యోగాలు ఇప్పిస్తామని పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసే దళారులు పెరుగుతున్నారు.
చదవండి: TSLPRB: చిన్న ఐడియా.. 670 కొలువులు!
ఎట్టిపరిస్థితుల్లో దళారులను నమ్మవద్దని టీఎస్ఎల్పీఆర్బీ అధికారులు హెచ్చరిస్తున్నారు. పోలీస్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చేసే వాగ్దానాలు, వారు చూపించే నకిలీ పత్రాలను చూసి మోసపోవద్దని సూచిస్తున్నారు. రిక్రూట్మెంట్ బోర్డు పేరిట వారు పంపే నకిలీ ఈమెయిల్స్, లెటర్లను నమ్మవద్దని చెబుతున్నారు. దళారుల సమాచారం ఉంటే టీఎస్ఎల్పీఆర్బీ అధికారుల దృష్టికి తేవాలని, సమాచారం ఇచ్చే వాళ్ల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
చదవండి: TSPLRB: పోలీసు ఉద్యోగాల భర్తీలో గర్భిణులకు మరో అవకాశం
కొనసాగుతున్న రెండో దశ ఫిజికల్ ఈవెంట్స్
ప్రాథమిక రాత పరీక్షల్లో బహుళ సమాధాన ప్రశ్నలకు అదనపు మార్కులు కలవడంతో అర్హత సాధించిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు హైకోర్టు ఆదేశాల మేరకు రెండో దశ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 15 నుంచి హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్లగొండ, ఆదిలాబాద్ కేంద్రాల్లో ఈ ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 25 వరకు దేహదారుఢ్య పరీక్షలను పూర్తి చేసే ప్రణాళికతో అధికారులు ఉన్నారు.