Skip to main content

Telangana: పాఠశాలల అభివృద్ధికి ‘శాలసిద్ధి’

కరీంనగర్‌: పాఠశాలల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులు, ప్రమాణాలు, ఇతర సమస్యలు.. ఒక్కో పాఠశాల స్వరూపం తెలుసుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో శాలసిద్ధి వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
Shalasiddhi for the development of schools
విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు

పాఠశాలలకు సంబంధించిన అన్ని వివరాలను అధికారులు ఒక్క క్లిక్‌తో తెలుసుకునేందుకు వెబ్‌సైట్‌ను వినియోగించుకోనున్నారు. గతంలో పాఠశాలలు పునఃప్రారంభం కాగానే ఉపాధ్యాయుల సహకారంతో ఏడు కేటగిరీల్లో 46 రకాల అంశాలపై సమాచారాన్ని ప్రభుత్వ అధికారులకు పంపేవారు. కొన్నేళ్లుగా ఏటా పాఠశాలల నమోదు ప్రక్రియ చేపడుతున్నా ఆశించిన స్థాయిలో పూర్తి సమాచారం రావడంలేదు.

వివరాలు పూర్తి చేయడంలో ఉపాధ్యాయులు జాప్యం చేస్తున్నారు. దీంతో ఈ విద్యా సంవత్సరం వెబ్‌సైట్‌లో కొన్ని మార్పులతో వందశాతం నమోదు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసింది. పైల ట్‌ ప్రాజెక్టుగా జిల్లా నుంచి 31 పాఠశాలలను ఎంపిక చేసింది. కాగా దీని కోసం ఇప్పటికే ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి శిక్షణ ఇచ్చారు. జిల్లాస్థాయిలో రెండు రోజుల పాటు సెయింట్‌ అల్ఫోన్స్‌ పాఠశాలలో 31 మంది హెచ్‌ఎంలు, 42 మంది ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తయింది.

చదవండి: Social Welfare Department: గురుకుల పాఠశాల, కళాశాల భవనాలు ప్రారంభం

పైలెట్‌ ప్రాజెక్టుగా 31 స్కూళ్ల ఎంపిక, వాటిలో అవసరమైన వసతుల కల్పన, నిధుల మంజూరుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ప్లానింగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ద్వారా వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. శాలసిద్ధిలో పాఠశాలల ప్రమాణాలు, మూల్యాంకనం నమోదు చేయాల్సి ఉంటుంది. పాఠశాలల స్వరూపం, బలాలు, బలహీనతలు వెల్లడించే సమగ్ర దర్పణంగా దీన్ని పరిగణిస్తారు. ఈ విద్యాసంవత్సరం టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ అనుసంధానంగా నమోదు చేపట్టనున్నారు.

పైలెట్‌ ప్రాజెక్టుగా జిల్లాలోని కరీంనగర్‌ అర్బన్‌, రూరల్‌, కొత్తపల్లి, తిమ్మాపూర్‌, రామడుగు, మానకొండూర్‌ మండలాల్లోని 31 స్కూళ్లలో మొదటి విడతగా ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందులో 15 ప్రాథమిక పాఠశాలలు, 5 యూపీఎస్‌, 11 హైస్కూళ్లలో నమోదు ప్రక్రియ జరగనుంది. ఇది విజయవంతమైతే జిల్లా వ్యాప్తంగా 651 ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్నారు.

చదవండి: School Education Department: క్లాస్‌ బేస్డ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు తేదీలు ఇవే

సేకరించే అంశాలు..

  • ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు యూడైస్‌ కోడ్‌ ఆధారంగా శాలసిద్ధి వెబ్‌సైట్‌ వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది.
  • ప్రధానంగా 46 ఉప అంశాలు ఏడు కేటగిరీల్లో పొందుపరుస్తారు. వనరులు, అవసరాల వినియోగం బోధన అభ్యాసన మదింపు, విద్యార్థుల ప్రగతి, వారి సాధన, పాఠశాల నాయకత్వం, సమ్మిళిత విద్య, ఆరోగ్యం తదితర అంశాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
  •  ఈ ఏడింటిలో కలిపి 46 రకాల ఉప అంశాల వివరాలు నమోదు చేస్తారు. దీని ఆధారంగా జాతీయస్థాయిలో పాఠశాలల వివరాలు ఒక క్లిక్‌తో తెలుసుకునే వీలుంటుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
  •  ఇందు కోసం జిల్లాస్థాయిలో రెండు రోజుల పాటు ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తయింది. సంబంధిత ఉపాధ్యాయులు సేకరించిన వివరాలను ఆగస్టు 31లోపు శాలసిద్ధి వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు.
  • ప్రస్తుతం పాఠశాల ఏ స్థాయిలో ఉంది, అత్యున్నత స్థాయికి వెళ్లాలంటే ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలనేది నిర్ధారించుకోవాలి. దీనికి గాను పాఠశాల సిబ్బంది ఒక విజిన్‌ స్టేట్‌మెంట్స్‌ తయారు చేసుకొని దాన్ని సాధించడానికి మిషన్‌ స్టేట్‌మెంట్స్‌ తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అన్ని రకాల ప్రధాన అంశాలపై సమగ్ర అవగాహన పెంచుకొని పాఠశాలల సమగ్రాభివృద్ధి ప్రణాళిక చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని సెక్టోరియల్‌ అధికారులు పర్యవేక్షిస్తారు.
  • పైల ట్‌ ప్రాజెక్టుగా జిల్లాలోని 31 స్కూళ్లు ఎంపిక 46 అంశాలపై పరిశీలన ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిన కేంద్ర ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించాలి

పాఠశాలల సమగ్రాభివృద్ధికి శాలసిద్ధి దోహదపడే కార్యక్రమం. ఎంపికై న పాఠశాలల నుంచి ప్రధానోపాధ్యాయులు నిజమైన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. హెచ్‌ఎంలు సరైన అవగాహనతో ఉంటూ శాలసిద్ధిని పకడ్బందీగా నిర్వహించాలి. ఈ కార్యక్రమంలో ప్రతి ఉపాధ్యాయుడు పాలుపంచుకొని భాగస్వాములు కావాలి.
– జనార్దన్‌రావు, డీఈవో

Published date : 31 Jul 2023 02:58PM

Photo Stories