సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసిన అనంతరం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ను జారీ చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
Sabitha Indra Reddy
ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ మార్చి చివరి కల్లా పూర్తి కానుందన్నారు. అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుందన్నారు. బదిలీల తర్వాత ఎక్కడెక్కడ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి..? అన్నది తేలుతుందన్నారు. దాదాపు 20వేల ఖాళీలతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోందని మంత్రి తెలిపారు.
కొత్త టీచర్లు వచ్చే వరకు..
ఒకవేళ పాఠశాలల్లో పూర్తిస్థాయి ఉపాధ్యాయులకు స్థానచలనం జరిగి, కొత్త టీచర్లు రాని పరిస్థితి ఉన్నప్పుడు బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయబోమని, కొత్త టీచర్లు వచ్చే వరకు అక్కడే కొనసాగాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా టీచర్ లేని పాఠశాలలు ఉండకూడదనేది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని వివరించారు.