School Students Summer Vaction: వేసవి సెలవుల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం..మార్గదర్శకాలు విడుదల
![School Students Summer Vacation program Commissioner S. Suresh Kumar discussing 'Selavullo Najak-2024' program during a video conference](/sites/default/files/images/2024/04/20/kids-1713589486.jpg)
సాక్షి, అమరావతి: వేసవి సెలవుల్లో విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ‘సెలవుల్లో సరదాగా–2024’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆర్జేడీలు, డీఈవోలు, సమగ్ర శిక్షా ఏపీసీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా తరగతుల వారీగా అమలు చేయాల్సిన కార్యక్రమాల మార్గదర్శకాలను విడుదల చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో కొత్త నైపుణ్యాలు, విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు క్రీడలు, వృత్తి నైపుణ్యం, సృజనాత్మక కళలపై దృష్టి సారించేలా ప్రోత్సహించాలని సూచించారు.
విద్యార్థుల కోసం వేసవి కోచింగ్ క్యాంపులు నిర్వహించాలని పీఈటీలను కోరారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడానికి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, డైట్ ప్రిన్సిపాళ్లతో ‘వుయ్ లవ్ రీడింగ్’ పోటీలను నిర్వహించాలన్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, స్థానిక కమ్యూనిటీ సంస్థల సహకారంతో ఈ వేసవి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.