Govt Blind Ashram School: ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు..
![Applications for admission in Govt Blind Ashram School Apply now for admission to Blind Ashram School in Parigi](/sites/default/files/images/2024/05/02/govt-blind-aashram-school-1714627749.jpg)
పరిగి: మండలంలోని సేవామందిరం బాల, బాలికల ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అంధుల ఆశ్రమ పాఠశాలలో 2024–25 విద్యా సంవత్సరానికి గానూ ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉన్న ఖాళీల ఆధారంగా సీట్లు భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని తరగతులకూ 150 సీట్లు ఉండగా.. ప్రస్తుతం 52 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు.
Degree Supplementary Results: డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల..
మిగిలిన 98 సీట్లలో ఆయా తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. 5 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగి, కనీసం 40 శాతం అంధత్వం కలిగిన బాలబాలికలు తమ దరఖాస్తులను పాఠశాల కార్యాలయంలో అందించాలని కోరారు. ఇక్కడ ఉచిత విద్యతో పాటు భోజన వసతి, వైద్య సదుపాయం, విద్యా శాఖ ద్వారా అందించే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేస్తామని తెలిపారు. బ్రెయిలీ లిపి ద్వారా బోధన, కంప్యూటర్ శిక్షణ ఉంటుందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హత ధ్రువపత్రాలను తప్పకుండా కార్యాలయంలో అందజేయాలని సూచించారు.