Skip to main content

సివిల్ సర్వీసెస్...సంస్కరణల బాట !

సివిల్ సర్వీసెస్.. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక సర్వీసులు! ఈ సివిల్ సర్వీస్‌లో చేరాలని కలలు కనే అభ్యర్థులు లక్షల్లోనే!! యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూడంచెల విధానంలో ఏటా నిర్వహించే సివిల్స్ ఎంపిక ప్రక్రియ అత్యంత క్లిష్టమైంది. ఇలాంటి అత్యున్నత పరీక్షకు సంబంధించి వయోపరిమితి, అటెంప్ట్‌ల సంఖ్య, విద్యార్హతలు, పరీక్ష విధానంలో మార్పులు జరిగే అవకాశముందనే వార్తలపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొద్దిరోజుల క్రితం ‘స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా’ పేరుతో నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో.. 2022 నాటికి సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో మార్పులు తేవాలని సూచించింది. తాజాగా సివిల్స్ పరీక్షకు దరఖాస్తు చేసినా అటెంప్ట్‌గానే పరిగణించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో సంస్కరణలు, ఆయా కమిటీల సిఫార్సులు, తాజాగా తెరపైకి వచ్చిన ప్రతిపాదనలు, అభ్యర్థులపై పడే ప్రభావం గురించి నిపుణుల విశ్లేషణ...
సిఫార్సులపై చర్చ
  • ఏడాది క్రితం.. బస్వాన్ కమిటీ సిఫార్సుల మేరకు.. సివిల్ సర్వీసెస్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిని 26 ఏళ్లకు తగ్గిస్తారని, అకడమిక్‌గా డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులుండాలనే వార్తలు.
  • ఆ తర్వాత జోనల్ విధానం అమలు. దేశంలోని రాష్ట్రాలను అయిదు జోన్లుగా విభజించడం. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తాము ఏ జోన్‌లో పనిచేయాలనుకుంటున్నారో చెప్పాలనే విధానం.
  • ఏడాది క్రితం జాయింట్ సెక్రటరీ స్థాయిలో లేటరల్ ఎంట్రీ పేరుతో ఆయా రంగాల్లోని నిపుణులను నేరుగా సివిల్ సర్వీసెస్‌లోకి నియమించేందుకు చర్యలు చేపట్టడం.
  • కొద్ది రోజుల క్రితం నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు సివిల్స్ వయోపరిమితిని 27 ఏళ్లకు తగ్గించనున్నారనే వార్తలు.
తాజాగా.. సివిల్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకొని... పరీక్షకు హాజరైనా కాకున్నా అటెంప్ట్‌గానే పరిగణించాలని కోరుతూ యూపీఎస్సీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వార్తలు. ఇప్పటివరకూ పరీక్షకు హాజరైతేనే అటెంప్ట్‌గా పరిగణిస్తున్నారు.

ప్రస్తుతానికి వాయిదా వేసినా..
గత రెండేళ్లుగా సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో పలు మార్పులు జరుగుతాయని.. అందుకు ఆయా కమిటీల సిఫార్సులే నిదర్శనమనే వార్తలతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వయోపరిమితి, అటెంప్ట్‌ల విషయంలో ఈ ఆందోళన మరింత ఎక్కువగా కనిపిస్తోంది. బస్వాన్ కమిటీ సిఫార్సులు, నీతి ఆయోగ్ ప్రతిపాదనలను ప్రస్తుతానికి వాయిదా వేసినా.. భవిష్యత్తులో వీటిని అమలుచేసే ఆస్కారముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా తెరపైకి వచ్చిన ‘దరఖాస్తు చేసుకున్నా అటెంప్ట్‌గానే పరిగణించాలనే’ ప్రతిపాదనను కూడా ప్రస్తుతానికి వాయిదావేస్తారని.. కానీ, భవిష్యత్తులో అమలుచేసే ఆస్కారముందంటున్నారు.

బస్వాన్ కమిటీతో మొదలు..
సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో సంస్కరణలపై మాజీ ఐఏఎస్ అధికారి బి.ఎస్.బస్వాన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని 2017లోయూపీఎస్సీ నియమించింది. ఈ కమిటీ పలు అంశాలను అధ్యయనం చేసి.. కీలకమైన సిఫార్సులు చేసింది. జనరల్ కేటగిరీలో వయోపరిమితిని 26 ఏళ్లు లేదా 28 ఏళ్లకు తగ్గించాలని సూచించింది. ప్రస్తుతం ఇది 32 ఏళ్లుగా ఉంది. దాంతోపాటు ప్రస్తుతం ఆరుగా ఉన్న అటెంప్ట్‌ల సంఖ్యను నాలుగుకే పరిమితం చేయాలని సూచించింది. అదేవిధంగా విద్యార్హతల పరంగా బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు ఉండాలని పేర్కొంది. అంతేకాకుండా మెయిన్ పరీక్షలో ఆప్షనల్ పేపర్‌కు పూర్తిగా స్వస్తి పలకాలని కూడా బస్వాన్ కమిటీ సిఫార్సు చేసింది. కొన్ని ప్రత్యేక సర్వీసులకు సంబంధిత అకడమిక్ అర్హతలను తప్పనిసరి చేయాలని.. ఆ సర్వీసులను ప్రాథమ్యంగా ఎంచుకుంటే.. అలాంటి అభ్యర్థులు సదరు సబ్జెక్ట్‌లో ప్రత్యేక పేపర్లతో పరీక్ష రాయాలని పేర్కొంది. సివిల్స్ ఇంటర్వ్యూలను డిఫెన్స్ సర్వీసుల ఎంపిక ప్రక్రియకు అనుసరించే ఎస్‌ఎస్‌బీ తరహా విధానాన్ని అమలు చేయాలని సలహా ఇచ్చింది. ఈ సిఫార్సులు వెలుగులోకి రావడంతో గతేడాది అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వాటిని ప్రస్తుతానికి అమలుచేసే యోచన లేదని అధికార వర్గాలు చెప్పడంతో ఊరట చెందారు.

నీతి ఆయోగ్ సిఫార్సులు:
‘స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా’ పేరుతో ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో.. 2022 నాటికి సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో మార్పులు తేవాలని సూచించింది. 2022 నాటికి దశల వారీగా జనరల్ కేటగిరీలో అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 27 ఏళ్లకు తగ్గించాలని పేర్కొంది. దాంతోపాటు ప్రస్తుతం దేశంలో ఆయా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో వేర్వేరుగా 60కు పైగా ఉన్న సివిల్ సర్వీసుల సంఖ్యను కుదించాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. పోస్ట్‌ల భర్తీకి జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష నిర్వహించాలని, అందులో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా వారికి సరితూగే సర్వీస్‌ను కేటాయిస్తే బాగుంటుందని సూచించింది. ఈ ప్రతిపాదన అమలైతే రాష్ట్రాల పరిధిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పాత్ర నామమాత్రం అవుతుందనే వాదన వినిపిస్తోంది. గరిష్ట వయోపరిమితిని 27 ఏళ్లకు కుదించాలనే సిఫార్సుపై వ్యతిరేకత రావడంతో.. అలాంటి ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 27 ఏళ్ల నిబంధన ప్రస్తుతానికి లేదని చెప్పినా.. భవిష్యత్తులో అమలు చేసే ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

దరఖాస్తు చేసినా అటెంప్ట్‌గానే !
సివిల్స్‌కు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు 32 ఏళ్ల వయసులోపు ఆరుసార్లు మాత్రమే పరీక్ష రాసే వీలుంది. ఓబీసీలకు అందుబాటులో ఉన్న అటెంప్ట్‌ల సంఖ్య 9. ప్రస్తుత నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలో ఒక పేపర్‌కు హాజరై, రెండో పేపర్ రాయకపోయినా.. దాన్ని ఒక అటెంప్ట్‌గా పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే చాలు.. అటెంప్ట్‌గానే పరిగణించాలనే ప్రతిపాదన అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజా ప్రతిపాదన అమలైతే.. అభ్యర్థులు పరీక్ష సమయానికి పూర్తిస్థాయి సన్నద్ధత సాధించలేదని భావించిపరీక్షకు గైర్హాజరైతే.. అందుబాటులో ఉన్న విలువైన అటెంప్ట్‌ల సంఖ్యలో ఒక అటెంప్ట్‌ను కోల్పోతారు. ఏటా దాదాపు తొమ్మిది నుంచి పది లక్షల వరకు అభ్యర్థులు సివిల్స్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ.. పరీక్షకు హాజరు శాతం మాత్రం 50 శాతం లోపే ఉంటోంది. దాంతో కమిషన్‌కు పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల పరంగా ప్రయాస తగ్గించడంతోపాటు అభ్యర్థుల్లోనూ సీరియస్‌నెస్ పెంచాలనే ఉద్దేశంతోనే ‘దరఖాస్తు చేసుకున్నా అటెంప్ట్ ఇచ్చినట్లే..!’ అనే ప్రతిపాదన తెరపైకి తెచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అభ్యర్థుల ఆలోచన మరోలా..
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో సగానికి సగం మంది గైర్హాజరుపై నిపుణుల విశ్లేషణ భిన్నంగా ఉంది. చాలామంది అభ్యర్థులు సివిల్ సర్వీసుల పట్ల నెలకొన్న క్రేజ్ కారణంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. పరీక్ష రోజు వరకు ప్రిపరేషన్ కూడా సాగిస్తున్నారు. కానీ, పరీక్ష సమయానికి వచ్చేసరికి అప్పటికే ఒకట్రెండుసార్లు పరీక్ష రాసిన అభ్యర్థులను చూసి.. తొలి ప్రయత్నంలో విజయం కష్టమనే ఆలోచనతో ఆగిపోతున్నారు. పరీక్షకు హాజరై అనవసరంగా ఒక అటెంప్ట్ వృథా చేసుకోవడం ఎందుకు? అనే ఆలోచనతో పరీక్షకు హాజరుకావడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి ధోరణి ఆయా కోర్సుల చివరి సంవత్సరం చదువుతూ సివిల్స్‌కు తొలిసారి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రిలిమ్స్ పరీక్ష సమయానికి వారు తమ అకడమిక్ కోర్సుల చివరి అంకంలో ఉంటారు. దీంతో అకడమిక్ పరీక్షలకే ప్రాధాన్యమివ్వక తప్పదు. ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకున్నా.. ప్రిపరేషన్‌కు సరైన సమయం కేటాయించలేరు. ఇలాంటి అభ్యర్థులు దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఉంటున్నారు. వీరందరిపైనా తాజా ప్రతిపాదన(దరఖాస్తు కూడా అటెంప్ట్‌గానే) ప్రభావం చూపనుంది.

ఆ రెండూ.. అమలైతే
సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో మార్పుల పరంగా అటెంప్ట్‌ల సంఖ్యను, గరిష్ట వయోపరిమితిని తగ్గించడం అభ్యర్థులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. యూపీఎస్సీ గణాంకాల ప్రకారం గత నాలుగేళ్లలో తుది జాబితాలో నిలిచిన అభ్యర్థుల్లో పీజీ పూర్తిచేసిన వారు, మూడో అటెంప్ట్‌లో విజయం సాధించిన అభ్యర్థుల సంఖ్య 50 శాతం వరకు ఉంది. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతోనే తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన అభ్యర్థుల సంఖ్య పది శాతంలోపే ఉంది. పీజీ పూర్తిచేసే సమయానికి ఒక అభ్యర్థి వయసు 23 లేదా 24 ఏళ్లు ఉంటుంది. అప్పటినుంచి ప్రయత్నించి రెండో అటెంప్ట్‌లోనో లేదా మూడో అటెంప్ట్‌లోనో విజయం సాధించే సమయానికి 25 లేదా 26 ఏళ్ల వయసుకు చేరుకుంటారు. వీటిని చూస్తే 26 ఏళ్ల నిబంధనతో ఇబ్బంది ఏంటి? అనే వాదన సహజం. 32 ఏళ్ల గరిష్ట వయో పరిమితిని, ఆరుసార్లు అటెంప్ట్‌ల అవకాశాన్ని దృష్టిలోపెట్టుకుని అభ్యర్థులు దీర్ఘకాలిక ప్రిపరేషన్ సాగించే వీలుంది. ఇందుకు భిన్నంగా 26 ఏళ్లలోపు నాలుగు అటెంప్ట్‌లలోనే విజయం సాధించాలని ప్రయత్నించడంలో మానసిక ఆందోళన అధికంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అటెంప్ట్‌ల సంఖ్య తగ్గిపోతున్నకొద్దీ ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లుతుందని చెబుతున్నారు.

గ్రామీణ, డిగ్రీ అభ్యర్థులకు ప్రతికూలం..
సివిల్స్ ఎంపిక ప్రక్రియలో మార్పుల పరంగా గ్రామీణ అభ్యర్థులు, సంప్రదాయ డిగ్రీ కోర్సుల అభ్యర్థులు మరింత ఆందోళనకు గురయ్యే ఆస్కారముంది. ఎందుకంటే.. ఇటీవల కాలంలో సివిల్స్ విజేతల నేపథ్యాలను పరిశీలిస్తే.. టెక్నికల్, మేనేజ్‌మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేసిన వారి సంఖ్య 60 శాతం మేర ఉంటోంది. మిగతా వారిలో 10 శాతం ఎంబీబీఎస్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చేసిన అభ్యర్థులు ఉంటున్నారు. మొత్తంగా చూస్తే సంప్రదాయ డిగ్రీ కోర్సులు (హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ తదితర)తో విజయం సాధించిన వారి సంఖ్య 25 నుంచి 30 శాతం లోపే! తాజా నిబంధనలతో వీరంతా ఆందోళనకు గురవుతున్నారు. ఒకవైపు తరుముకొచ్చే వయోపరిమితి నిబంధన.. మరోవైపు పరీక్ష క్లిష్టత వంటి అంశాలు ప్రిపరేషన్‌పై ప్రభావం చూపుతాయి.

లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్‌కు స్వస్తి ?
వాస్తవానికి యూపీఎస్సీ.. అన్ని నేపథ్యాల వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్‌కు ఆస్కారం కల్పించే విధంగా 2011 నుంచి సీశాట్ (సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్) పేరుతో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ప్రిలిమ్స్‌లో ఆప్షనల్ విధానానికి స్వస్తి పలికింది. కానీ.. ఇది కూడా అన్ని నేపథ్యాల విద్యార్థులకు అనుకూలంగా లేదని.. ముఖ్యంగా ఆప్టిట్యూడ్ టెస్ట్ పేరుతో నిర్వహించే రెండో పేపర్ పూర్తిగా ఇంగ్లిష్ మీడియం, టెక్నికల్, మ్యాథమెటికల్ నైపుణ్యాలున్న వారికే అనుకూలంగా ఉందనే వాదన వినిపిస్తోంది. అదే విధంగా 2013లో మెయిన్ ఎగ్జామినేషన్‌లోనూ మార్పులు చేసి.. రెండు ఆప్షనల్ సబ్జెక్టుల విధానానికి స్వస్తి పలికి కేవలం ఒకే ఆప్షనల్ విధానాన్ని రూపొందించారు. ఇలా ఒకే ఆప్షనల్ సబ్జెక్ట్ కింద అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరు కావాలి. మిగతా అయిదు పేపర్లు అన్ని నేపథ్యాల విద్యార్థులకు అనుకూలంగా ఉంటాయని అప్పట్లో ప్రకటించారు. దీనివల్ల ఏమేరకు ప్రయోజనం జరిగిందో స్పష్టతలేదు!!

గత కొన్నేళ్లలో జరిగిన కీలక మార్పులు..
  • 2011 ప్రిలిమినరీ పరీక్షలో ఆప్షనల్ తొలగింపు. దాని స్థానంలో సీశాట్.
  • 2012 మెయిన్ ఎగ్జామ్ సిలబస్‌లో మార్పులు
  • 2013 మెయిన్‌లో సమూల మార్పులు. రెండు ఆప్షనల్స్ స్థానంలో ఒకే ఆప్షనల్ సబ్జెక్ట్. అదే విధంగా జనరల్ స్టడీస్‌కు ప్రాధాన్యం పెంచారు.
  • 2015 సీశాట్‌ను కేవలం అర్హత పరీక్షగానే నిర్ణయిస్తూ ప్రకటన.
  • 2018 సివిల్ సర్వీసెస్ కేడర్ కేటాయింపులో జోనల్ విధానం అమలు.
  • 2018 లేటరల్ ఎంట్రీ పేరుతో జాయింట్ సెక్రటరీ స్థాయిలో నేరుగా నియామకాలు.

ఏడాది ముందుగా చెప్పాలి...
Career Guidance ఎంపిక ప్రక్రియలో ఏవైనా మార్పులు చేసే ముందు కనీసం ఒక ఏడాది ముందుగా చెప్పాలి. ప్రస్తుతం ప్రధానంగా ఆందోళనకు గురిచేస్తున్న అంశాలు వయో పరిమితి, అటెంప్ట్‌ల సంఖ్య తగ్గింపు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి. ప్రస్తుతం వయో పరిమితి తగ్గించే యోచన లేదని పేర్కొన్నారు కాబట్టి ఈ విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందక్కర్లేదు. నిపుణుల కమిటీలను నియమించి సిఫార్సులు కోరినప్పుడు దాదాపుగా వాటికే మొగ్గుచూపే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే సివిల్స్ ప్రిపరేషన్ సాగించాలి.
Published date : 09 Jan 2019 05:46PM

Photo Stories