Andhra Pradesh Jobs: ఆలయ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు
ద్వారకాతిరుమల: రాష్ట్ర దేవదాయశాఖ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎంఎస్ నం.389 ద్వారా ప్రిలిమినరీ నోటిఫికేషన్ను బుధవారం జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఈ ఏడాది జులై 12 నుంచి అమలులోకి వస్తాయని అందులో పేర్కొన్నారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రధానమైన ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం, విజయవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, పెనుగంచిప్రోలు, కాణిపాకం తదితర ఆలయాల్లో పనిచేసే పలువురు ఉద్యోగులు ఇటీవల పదవీ విరమణ పొందారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే తమ పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 389 జీఓను జారీ చేసింది. ఈ ఏడాది జూలై 12 నుంచి పదవీ విరమణ పొందిన వారికి మాత్రమే ఈ రెండేళ్ల పెంపును వర్తింపజేస్తున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. దీనిపై ఏమైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే 30 రోజుల్లోపు తెలపాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికల్ వలవెన్ సూచించారు.
1.55 lakh posts vacant: త్రివిధ దళాల్లో 1.55 లక్షల ఖాళీలను భర్తీ చేయండి