Skip to main content

కులం - కులతత్వం

కులం అనే పదం 'Caste' అనే పోర్చుగీస్ పదం నుంచి ఉద్భవించింది. కాస్ట్ అంటే.. 1) వారసత్వం, 2) వంశ పారంపర్యంగా కలిగేది అనే అర్థాలున్నాయి.
కుల వ్యవస్థ భారతీయ సామాజిక వ్యవస్థకు ఒక ‘మూలస్తంభం’గా ఉంది. హిందూ సమాజం మినహాయించి మరే ఇతర సమాజంలోనూ కులాలు కనిపించవు. వివిధ పరిశోధకులు కులానికి సంబంధించి భిన్న రకాల నిర్వచనాలు ఇచ్చారు.
‘కొన్ని సమూహాలు లేదా కుటుంబాలు కలిసి ఒకే పేరుతో, ఒకే విధమైన వంశానుక్రమంతో ఉండి వంశపారంపర్యంగా ఒకే విధమైన పేరుతో గుర్తింపు పొందడాన్ని కులం అంటారు’ - హెర్బర్‌‌ట రిస్లీ
‘కులం అంటే ఒక పరధీకృతమైన సమూహం (Closed Group)’  - టి.ఎన్. మదన్, డి.ఎన్. మజుందార్
‘ఒక వర్గం (Single Group) కచ్చితంగా వారసత్వాన్ని పాటించినప్పుడు దాన్ని కులంగా పేర్కొనవచ్చు’ - సి.హెచ్. కూలే

ఎమ్.ఎన్. శ్రీనివాసన్, హట్టన్ కులం ఆవిర్భావం గురించి పేర్కొన్నారు.
కులం ఆవిర్భావం
భారతదేశంలో సాహిత్య రచన ఆర్యుల కాలంలో (క్రీ.పూ. 1500 నుంచి క్రీ.పూ. 500 మధ్య) జరిగింది. ఈ సాహిత్యాన్ని ప్రధానంగా 8 రకాలుగా గుర్తించవచ్చు. అవి:
1) వేదాలు
2) బ్రాహ్మణాలు
3) అరణ్యకాలు
4) ఉపనిషత్తులు
5) వేదాంగాలు
6) పురాణాలు
7) ఉపవేదాలు
8) ఇతిహాసాలు
వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులను ‘శృతి సాహిత్యం’ అంటారు. అంటే ‘అతి పవిత్రమైనవి’ అని అర్థం. వీటినే ‘ఆపౌషీయాలు’గా పేర్కొంటారు. అంటే దేవతలు రాసి ప్రజలకు ఇచ్చారు అని అర్థం.
వేదం అంటే ‘నాలెడ్జ్ ’ అని అర్థం. వేదాలు నాలుగు. అవి:
1) రుగ్వేదం
2) యజుర్వేదం
3) సామవేదం
4) అధర్వణ వేదం
రుగ్వేదంలో పదో అధ్యాయంలో 1028 శ్లోకాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలోనే ‘పురుష సూక్తం’ గురించి ఉంది. సమాజాన్ని వర్ణం ఆధారంగా బ్రహ్మ నాలుగు రకాలుగా సృష్టించాడని ‘పురుష సూక్తం’లో పేర్కొన్నారు.
వర్ణం అంటే రంగు అని అర్థం. వర్ణం ఆధారంగా బ్రహ్మ కింద పేర్కొన్న సామాజిక వర్గాలను సృష్టించాడని రుగ్వేదంలో తెలిపారు.
1) బ్రాహ్మణులు (తెలుపు)
2) క్షత్రియులు (ఎరుపు)
3) వైశ్యులు (పసుపు)
4) శూద్రులు (నలుపు)
ఈ వర్గీకరణలో మొదటి 3 వర్ణాలకు చెందినవారిని ‘ద్విజులు’ అంటారు. అంటే రెండు సార్లు (తల్లి గర్భం నుంచి, ఉపనయనం నుంచి) జన్మించినవారని అర్థం. శూద్రులకు ఉపనయనం లేదు. వీరికి కర్మకాండలు చేసే అర్హత కూడా లేదు.
ఆర్యుల సాహిత్యంలోని వేదాంగాలను ఆరు రకాలుగా వర్గీకరించవచ్చు.
అవి: 1) శిక్ష, 2) నిరుక్త, 3) వ్యాకరణం, 4) జ్యోతిషం, 5) ఛందస్సు, 6) కల్ప
‘కల్ప’ అనేది యజ్ఞయాగాదుల గురించి తెలుపుతుంది. ఇందులో మూడు రకాల సూత్రాలు ఉన్నాయి. వీటిలో గృహ సూత్రం ప్రధానమైంది.
గృహ సూత్రం: రాజు మోక్షం సాధించడానికి చేయాల్సిన 16 పౌరుశ కర్మల గురించి పేర్కొంటుంది. వీటిలో 11వ కర్మ ‘ఉపనయనం’ గురించి వివరిస్తుంది. ఈ కర్మ నిర్వహిస్తే మోక్షం పొందొచ్చని భావిస్తారు.
- శూద్రులతో పాటు స్త్రీలకు కూడా ఉపనయనం లేదు.
వర్ణ వ్యవస్థ నిర్మితి, ఆచరణ, వివరణ అంతా సమాజంలో సామరస్యం సాధించడానికే ఏర్పాటైంది. కానీ చాతుర్వర్ణ వ్యవస్థలో పైవర్ణంవారు కింది వర్ణం అయిన శూద్రులను ‘దాసులు’గా చూడటం ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా వివిధ వృత్తులు ఏర్పడ్డాయి.
కాలక్రమేణా బౌద్ధ, జైన మతాల అవిర్భావంతో సమాజంలో అనేక మార్పులు సంభవించాయి. అంతర్వర్ణ వివాహాలను అంగీకరించారు. అనులోమ, ప్రతిలోమ వివాహాలు కూడా జరిగాయి.
ఉన్నత వర్ణాలకు చెందిన పురుషుడు తక్కువ వర్ణాలకు చెందిన యువతిని వివాహం చేసుకోవడం ‘అనులోమ వివాహం’. తక్కువ వర్ణంలోని పురుషుడు ఉన్నత వర్ణానికి చెందిన స్త్రీని వివాహం చేసుకోవడం ‘ప్రతిలోమ (విలోమ) వివాహం’. ఈ విధంగా జరిగిన వివిధ రకాల వివాహాల కారణంగా ‘వర్ణ సంకరం’ ఏర్పడింది.
వర్ణ వ్యవస్థ పరివర్తన చెంది విస్తృతమవడం వల్ల జాతులు ఆవిర్భవించాయి. కాలక్రమేణా ఇవి కులాలుగా ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడ్డ కులం తదనంతర కాలంలో అనేక ఉపకులాలుగా విభజితమైంది. ఈ విధంగా ‘వర్ణ వ్యవస్థ’ నుంచి ‘కుల వ్యవస్థ’ ఏర్పడింది.

కులం ఆవిర్భావ సిద్ధాంతాలు
హిందూ సమాజంలో కుల వ్యవస్థ ఒక ప్రత్యేక లక్షణం. ఇది ఎప్పుడు, ఏవిధంగా ప్రారంభమైందో స్పష్టంగా చెప్పలేనప్పటికీ కొంత మంది సామాజిక శాస్త్రవేత్తలు దీని పుట్టుక గురించి కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించారు.
దైవాంశ సంభూత సిద్ధాంతం: దీని ప్రకారం కులవ్యవస్థ దైవాంశమైంది. హిందువులకు ప్రమాణం ‘వేదం’. రుగ్వేదంలోని పురుష సూక్తంలో బ్రహ్మదేవుడు నాలుగు వర్ణాలను సృష్టించాడని పేర్కొన్నారు. భగవద్గీత కూడా అత్యంత ప్రాచీన గ్రంథం. హిందువులకు ప్రామాణికం. ఇందులో కృష్ణుడు తన వల్లే నాలుగు వర్ణాలు ఉద్భవించాయని చెప్పినట్లు పేర్కొన్నారు. విష్ణు పురాణం, వేదాల్లోనూ ఈ సిద్ధాంతం ప్రస్తావన ఉంది. దీన్ని శాస్త్రీయంగా అంగీకరించడానికి ఆధారాలు లేవు.
జాతి సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని హెర్బర్ట్ రిస్లీ అభివృద్ధి చేశాడు. ఇతడి ప్రకారం.. ఆర్యులు, ద్రావిడులు, మంగోలియన్ లాంటి వివిధ తెగల మధ్య సంఘర్షణలు తలెత్తినప్పుడు ప్రతి తెగ ప్రత్యేక లక్షణాలను కాపాడుకునే ఉద్దేశంతో ఒక సమూహంగా ఏర్పడి తర్వాత ఆ సమూహం ‘కులం’గా మారింది. తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి సమూహంలోని సభ్యులందరూ కట్టుబడి ఉండాల్సిన కొన్ని నియమాలను ఏర్పరచుకున్నారు. ఈ విధంగా అనేక కులాలు ఆవిర్భవించాయి.
వృత్తి సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని నెస్‌ఫీల్డ్ తెలిపాడు. ఇతడు కులం ఆవిర్భావానికి కారణం వృత్తి అని పేర్కొన్నాడు. వ్యవసాయం, పరిశ్రమల వల్ల జీవన క్రమంలో వచ్చిన మార్పుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయని ఈ సిద్ధాంతం వివరిస్తోంది. వ్యక్తులు నిర్వహించే వృత్తి ఆధారంగా ఒక స్థితి, ఒక ప్రత్యేకత ఏర్పడ్డాయి. లోహాల వినియోగం కంటే ముందు ఉన్న కులాలకు తక్కువ స్థాయి; లోహాలు, పరిశ్రమల ఆవిర్భావం తర్వాత ఉన్న వృత్తులకు ‘ఉన్నత స్థాయి’ ఉందని ఇతడు పేర్కొన్నాడు.
సంస్కార సిద్ధాంతం: దీన్ని ఎ.ఎం. హోకర్ట్ ప్రతిపాదించాడు. ‘భారతదేశంలో మత సంస్కారాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇందులో భాగంగా మంత్రాలు చదవడం, ప్రదేశాన్ని శుభ్రం చేయడం, అలంకరించడం, మేళతాళాలు వాయించడం మొదలైన వాటి వల్ల కులాలు ఏర్పడ్డాయి’ అని ఇతడు వివరించాడు.
భౌగోళిక సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని గిల్బర్ట్ ప్రతిపాదించాడు. దీని ప్రకారం.. భారతదేశం సువిశాలమైంది. వివిధ రకాల వాతావరణ పరిస్థితులు, వనరులను, సముద్ర తీర ప్రాంతాలు, నదీ మైదానాలు, మెట్ట ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు లాంటివి ఉన్నాయి. ఇక్కడ నివసించే ప్రజలు ఆయా ప్రదేశాల్లోని పరిస్థితులకు అనుగుణంగా తమ జీవన విధానాన్ని సర్దుబాటు చేసుకొని జీవిస్తారు. వ్యవసాయం, పశుపోషణ, చేపలు పట్టడం ఈ విధంగానే ఏర్పడ్డాయి. ఇలాంటి జన సమూహాలే ‘కులాలు’గా ఆవిర్భవించాయి.
సాంస్కృతిక సిద్ధాంతం: దీన్ని ఎస్.పి. రాయ్, అతడి అనుచరులు ప్రతిపాదించారు. దీని ప్రకారం సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఒక సమూహంలోని ప్రజలు ఆ సమూహాన్ని ‘కులం’గా రూపొందించుకున్నారు.

మాదిరి ప్రశ్నలు

1. ‘కులం’ అనేది ఏ భాషా పదం నుంచి ఆవిర్భవించింది?
ఎ) ఫ్రెంచ్
బి) లాటిన్
సి) పోర్చుగీస్
డి) అరబిక్

Published date : 24 Oct 2015 05:57PM

Photo Stories