Skip to main content

Turkey Earthquake: మూత్రం తాగుతూ... ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. క్షణం ఒక యుగంలా....

టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం పెను విధ్వంసాన్నే సృష్టించింది. భూకంపం వచ్చి ఇప్పటికి వారం గడుస్తున్నా ఇంకా పరిస్థితులు కుదుటపడలేదు. ఎక్కడ చూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. శిథిలాలు తొలగించేకొద్దీ మృతుల సంఖ్య పెరిగిపోతూ ఉంది.
Turkey earthquake

ఇప్పటివరకు టర్కీ, సిరియాలో మృతుల సంఖ్య 24,000 దాటింది. సహాయక చర్యలతోపాటు శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. టర్కీలో శిథిలాలను తొలగిస్తుండగా శుక్రవారం ఒక్కరోజే 100 మంది ప్రాణాలలో బయటపడ్డారు.
మూత్రంతాగి ప్రాణాలు కాపాడుకుంటూ....
తీవ్రమైన చలిలో ఆకలి బాధలతో ప్రాణాలు నిలుపుకొనేందుకు వారుపడిన కష్టాలు వర్ణనాతీతం. శిథిలాల కింద ఇరుక్కుపోయి, బయటపడే మార్గం లేక కేవలం మూత్రం తాగి ఆకలిదప్పులు తీర్చుకున్నామని బాధితులు చెబుతుండడం కన్నీరు పెట్టిస్తోంది. టర్కీలో అంత్యక్రియల కోసం తీసుకొస్తున్న మృతదేహాలతో ఇప్పటికే శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయి. చాలా సమయం వేచి చూడాల్సి వస్తోందని మృతుల బంధువులు చెబుతున్నారు.

earthquake


తొలిసారి బయటికి వచ్చిన బషర్‌...
ఈ భూకంపం ‘ఈ శతాబ్దపు విపత్తు’ అని టర్కీ అధ్యక్షుడు తయీఫ్‌ ఎర్డోగాన్‌ వ్యాఖ్యానించారు. భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన టర్కీకి దాదాపు 95 దేశాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. సిరియా అధ్యక్షుడు బషర్‌ అసద్, ఆయన భార్య అస్మా శుక్రవారం అలెప్పో యూనివర్సిటీ ఆసుపత్రిలో భూకంప మృతులను చూసి, వారి బంధువులను పరామర్శించారు. భూకంపం సంభవించినప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి.

చ‌ద‌వండి: దేశాన్నే పక్కకి జరిపిన భూకంపం... ఏకంగా 5 మీటర్లు జరిగిన టర్కీ
టర్కీలో 19 వేలు... సిరియాలో 4 వేల మంది....
భూకంపం వల్ల టర్కీలో ఇప్పటిదాకా 18,900 మంది మరణించారని, దాదాపు 75,000 మంది గాయపడ్డారని ఆ దేశ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ వెల్లడించింది. ఇళ్లు కూలిపోవడంతో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. సిరియాలో భూకంపంధాటికి 3,300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం చెబుతోంది. రెండు దేశాల్లో కలిపి ఇప్పటివరకు 24,000 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. 

చ‌ద‌వండి:​​​​​​​ శిథిలాల కిందే చిన్నారికి జననం..కన్నబిడ్డను కనులారా చూడకుండానే
పూర్తి అండగా ఉంటాం: మోదీ
‘ఆపరేషన్‌ దోస్త్‌’లో భాగంగా టర్కీలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మన దేశ సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం తెలిపారు. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రాణాలను, ఆస్తులను కాపాడడానికి మన బృందాలు కృషి చేస్తూనే ఉంటాయని ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ సంక్షోభ సమయంలో ఆ దేశ ప్రజలకు భారత్‌ పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు.

Published date : 11 Feb 2023 01:23PM

Photo Stories