Skip to main content

Bathukamma : బతుకమ్మ పండుగ నేపథ్యం ఏమిటి..? ఏఏ రోజు ఎలా జ‌రుపుకుంటాంటే..?

పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆడపడుచులంతా ఒక్కచోట చేరి తమ అనుభవాలనే పాటలుగా మలిచి.. చప్పట్లతో గౌరమ్మను కొలిచే వేడుక.
bathukamma
Bathukamma Festival

ప్రకృతిని ఆరాధిస్తూ.. పుడమి తల్లి గొప్పదనాన్ని కీర్తిస్తూ మురిసిపోయే క్షణాలకు వేదిక. తెలంగాణ అస్తిత్వానికి.. సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. బతుకమ్మ సంబరాలు ఏటా పెతర అమావాస్య రోజున ఎంగిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈసారి అక్టోబ‌ర్ 14వ తేదీ నుంచి(ఎంగిలిపూల బతుకమ్మ)న ఈ సంబరాలు మొదలు అయ్యాయి. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ నేపథ్యం గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

సహజసిద్ధంగా లభించే పూలతో..

bathukamma festival flower


ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే పూలతో కూడిన అమరిక బతుకమ్మ. సాధారణంగా గునుగు, గుమ్మడి, తంగేడు, కట్ల పూలు, గోరంట్ల పూలు పట్టుకుచ్చులు(సీతజడ పూలు) స్థూపాకారంలో వరుసలుగా పేర్చి.. పైభాగం మధ్యలో ‘గౌరమ్మ’ను పెడతారు.

చ‌ద‌వండి : Sammakka Sarakka Jatara : నాలుగు రోజులు.. 4 ఘట్టాలు.. మహాజాతర చరిత్ర ఇలా..

ఊరంతా ఒక్కచోట చేరి.. 
గుమ్మడి పువ్వు మధ్య భాగాన్ని గౌరమ్మగా పిలుస్తారు. పువ్వులతో పాటు.. పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. దుర్గరూపంగా.. బొడ్డెమ్మగా అమ్మవారిని కొలుస్తారు. ఇక పండుగ వేళ ఊరంతా ఒక్కచోట చేరి బతుకమ్మా(జీవించు అని అర్థం).. మాకు బతుకునీయవమ్మా(మమ్మల్ని చల్లగా చూడు తల్లీ) అని పాటలతో అమ్మను వేడుకుంటారు.

బతుకమ్మ పండుగ నేపథ్యం ఇలా..

bathukamma festival history in telugu

బతుకమ్మ నేపథ్యానికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. బతుకమ్మ సంబరాల్లో భాగంగా పాడుకునే పాట ప్రకారం.. ధర్మాంగధుడు అనే రాజుకు వంద మంది కుమారులు పుట్టి చనిపోయారు.

దుఃఖంలో మునిగిపోయిన దంపతులు తమ కడుపున ఆ లక్ష్మీదేవి పుట్టాలని ప్రార్థిస్తారు. వారి మొరను ఆలకించిన ఆ తల్లి ఆ దంపతులకు జన్మిస్తుంది. ఆమెను దీవించేందుకు రాజు నివాసానికి వచ్చిన మునులు ‘నువ్వు ఎల్లకాలం బతుకమ్మ’ అని ఆమెను దీవించినట్టు కథ ప్రచారంలో ఉంది.

మ‌రో కథ ఇలా..

bathukamma festival history

ఇక బతుకమ్మ చుట్టూ చేరి.. పండుగకు కారణమైన కథను గానం చేసే పల్లె ప్రజల పదాల ఆధారంగా.. బతుకమ్మ నేపథ్యానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యం పొందింది. 

దాని ప్రకారం.. అనగనగా ఓ రాజు. ఆ రాజుకు ఓ చిన్న కోడలు. వారి ఊరికి జీవనాధారం చెరువు. ఎంతో విశాలమైన ఆ చెరువు వానలు బాగా పడటంతో మత్తడి దుంకుతుంది. ఎడతెరిపి లేని వానల వల్ల చెరువు నిండి కట్టకు గండిపడుతుంది.గండిని పూడ్చేందుకు ఊరంతా ప్రయత్నించినా ఫలితం ఉండదు. అయితే, చెరువు కట్ట అంటే అక్కడ మైసమ్మ(గ్రామ దేవత) కొలువు ఉంటుందని చాలా మంది నమ్మకం. ఆమే చెరువుకు రక్షణగా ఉంటుందని భావిస్తారు.

అందుకే కట్ట నిలవాలంటే మైసమ్మను శాంతింపచేయాలని రాజు, ప్రజలు భావిస్తారు. కట్టను నిలిపేందుకు తన బర్రెల మందను ఇస్తానని రాజు మైసమ్మను వేడుకుంటాడు. ఇందుకు బదులుగా మైసమ్మ తల్లి తనకు కూడా బర్రెల మంద ఉందని సమాధానమిస్తుంది. ఆవుల మంద, గొర్రెల మంద, మేకల మంద.. ఇలా ఏది ఇస్తానన్నా అవన్నీ తన దగ్గర కూడా ఉన్నాయని చెబుతుంది. దీంతో ఆ రాజు.. తమ ఊరి బాగు కోసం తన కుటుంబ సభ్యులను అర్పిస్తానని ఆమెకు చెబుతాడు. కానీ.. ఆ గ్రామ దేవత శాంతించదు. ఎటూపాలుపోని స్థితిలో ఆ రాజు చిన్న కోడల్నిస్త ఉయ్యాలో.. కట్ట నిలుపే మైసు ఉయ్యాలో అని రాగం అందుకోగానే మైసమ్మ సంతృప్తి పడుతుంది. కట్ట తెగకుండా ఆపుతుంది.

bathukamma in water

ఇక అన్న మాట ప్రకారం రాజు ఇంటికెళ్లి తన చిన్న కోడలిని చెరువు దగ్గరకు తీసుకువచ్చేందుకు పూనుకుంటాడు. కానీ.. ఆమెకు తను చేయాల్సిన త్యాగం గురించి చెప్పడు. అయితే, చిన్న కోడలి పసిపాపాయి గురించి వివరాలు అడుగుతూ.. అన్ని పనులు పూర్తయ్యాయని ఆమె చెప్పగానే చెరువుకు పోయి నీళ్లు తెమ్మని చెబుతాడు.మామ మాటను గౌరవించి ఆ చిన్న కోడలు బిందె పట్టుకుని చెరువు దగ్గరకు వెళ్తుంది. అయితే, ఎంత ముంచినా బిందె మునగదు. నడుము లోతు వరకు వెళ్లినా అదే పరిస్థితి. అంతలో ఆ రాజు కల్పించుకుని ఇంకొంచెం లోపలికి పొయ్యి నీళ్లు తే అని చెబుతాడు.

అలా మరింత లోతుకు వెళ్లిన ఆమె బిందెతో పాటు చెరువులో మునిగిపోతుంది. తన పరిస్థితి ఏమిటో తెలుసుకున్న ఆ తల్లి.. తన తల్లిదండ్రులకు బిడ్డ లేదని, త బిడ్డకు తల్లి లేదని చెప్పమంటూ పాటు పాడుతూ పూర్తిగా మునిగిపోతుంది. బొడ్డెమ్మనై.. మళ్లీ వస్తానంటూ శాశ్వతంగా సెలవు తీసుకుంటుంది. అయితే, ఎక్కడైతే ఆ రాజు చిన్న కోడలు మునిగిందో అక్కడ పూలన్నీ నీళ్లలో తేలతాయి. ఊరి కోసం ప్రాణాలు అర్పించిన ఆ ఆడబిడ్డ తాగ్యాన్ని గుర్తు చేసుకుంటూ.. బతుకమ్మ రూపంలో ఆమె కలకాలం తమతోనే ఉంటుందని.. పూలతో ఆమెను పూజించుకుంటామని ఊరి వాళ్లంతా చెప్పినట్టు కథ సాగుతుంది. ఇవేగాక మరెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.

Telangana: ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర ఏది?

బతుకమ్మ.. తొమ్మిది రోజులు.. తొమ్మిది నైవేద్యాలు ఇలా..

bathukamma nine days food

☛ మొదటి రోజు- ఎంగిలిపూల బతుకమ్మ
☛ రెండో రోజు- అటుకుల బతుకమ్మ
☛ మూడో రోజు- ముద్దపప్పు బతుకమ్మ
☛నాలుగో రోజు- నానే బియ్యం బతుకమ్మ
☛ ఐదో రోజు-  అట్ల బతుకమ్మ
☛ ఆరవ రోజు- అలిగిన బతుకమ్మ
☛ ఏడో రోజు- వేపకాయల బతుకమ్మ
☛ఎనిమిదవ రోజు- వెన్నముద్దల బతుకమ్మ
☛ తొమ్మిదో రోజు- సద్దుల బతుకమ్మ

ముఖ్యంగా పల్లెల్లో అయితే పోటా పోటీగా భిన్న రుచులను తయారు చేసి మరీ వడ్డిస్తారు. ఇంట్లో చేసుకున్న ఏ వంటకమయినా.. మరో నలుగురికి పంచి వారితో తినిపించడం బతుకమ్మ పండుగలో కనిపించే సంతోషకరమైన సన్నివేశం. తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరంలో కనిపించే ముఖ్యమైన ప్రసాదాలు ఇవి.

మొదటి రోజు : ఎంగిలిపూల బతుకమ్మ..
బతుకమ్మ మొదటి రోజు పెతర అమావాస్య నాడు జరుపుకొంటారు. ఆరోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయని తలచి మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా వ్యవహరిస్తారు. ఆరోజు నువ్వుల సద్దిని అందరితో పంచుకుంటారు.

రెండో రోజు : అటుకుల బతుకమ్మ..
రెండో రోజు అటుకుల ప్రసాదం చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు కలిపి అమ్మవారికి ఇష్టంగా వడ్డించే నైవేద్యం ఇది. 

మూడో రోజు : ముద్దపప్పు బతుకమ్మ..
మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్ద పప్పు, పాలు, బెల్లంతో వేడివేడిగా నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

నాలుగో రోజు : నానబియ్యం బతుకమ్మ..

bathukamma 4th day

నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ.  నాన బెట్టిన బియ్యంను పాలు, బెల్లంతో కలిపి ఉడికింది ప్రసాదంగా తయారు చేస్తారు.

ఐదో రోజు : అట్ల బతుకమ్మ..
ఐదోరోజు అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశలను అమ్మవారికి నైవేద్యంగా వడ్డిస్తారు.

ఆరవ రోజు : అలిగిన బతుకమ్మ
ఆరో రోజు అలిగిన బతుకమ్మగా జరుపుకొంటారు. ఆరోజు అమ్మవారికి అలకగా చెప్పుకుంటారు. ఉపవాసం పాటిస్తారు

ఏడో రోజు : వేపకాయల బతుకమ్మ.. 
ఏడోరోజు వేపకాయల బతుకమ్మ. బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

ఎనిమిదవ రోజు : వెన్నెముద్దల బతుకమ్మ..
ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి వెన్నముద్దల నైవేద్యంగా వడ్డిస్తారు.

తొమ్మిదో రోజు : సద్దుల బతుకమ్మ..

బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజును సద్దుల బతుకమ్మగా జరుపుకొంటారు. తొమ్మిదోరోజు పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు.

Published date : 16 Oct 2023 01:52PM

Photo Stories