Skip to main content

నల్లధనం గుట్టు... ఏనాటికి ఆటకట్టు

చట్టబద్ధంకాని మాదకద్రవ్యాల ఒప్పందం (Drug dealing), పైరసీలు బ్లాక్ మార్కెట్ వ్యవస్థలో భాగాలు. బ్లాక్ మార్కెట్‌ను అండర్ గ్రౌండ్ (Under Ground), లేదా బ్లాక్ ఎకానమీ (Black Economy) అని కూడా అంటారు.
బ్లాక్ ఎకానమీలోని అంతర్భాగమే నల్లధనం (Block Money). ఆర్థిక వేత్తల మాటల్లో చెప్పాలంటే... 1950లలో భారత్‌లో నల్లధనం వృద్ధి 3 శాతం. కాగా ప్రస్తుతం అది 50 శాతానికి పెరిగింది. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ 2001-10 ప్రకారం 150 నల్లధనం దేశాల జాబితాలో భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది.

ఇల్లిసిట్ నివేదిక-ముఖ్యాంశాలు
illicit financial flows from Developing Countries 2002-11 నివేదిక ప్రకారం....2002-11 మధ్యలో భారత్ నుంచి బయటి దేశాలకు తరలిన మొత్తం నల్లధనం 343 బిలియన్ డాలర్లు అంటే రూ. 21 లక్షల కోట్లు. 2011లో 84.93 బిలియన్ డాలర్లు అంటే రూ. 5 లక్షల కోట్లని లెక్క తేల్చింది. చట్టబద్ధం కాని ద్రవ్యం ఎగుమతిలో భారత్‌ను ఐదో అతిపెద్ద ఎగుమతిదారుగా పేర్కొంది. నేరాలు, మితిమీరిన అవినీతి, పన్నుల ఎగవేత కారణంగా 2011లో అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి 946.7 బిలియన్ డాలర్లు అంటే రూ. 57 లక్షల కోట్లు విదేశాలకు మళ్లిందని స్పష్టం చేసింది. 2011లో ఇల్లిసిట్ క్యాపిటల్ ఎగుమతికి సంబంధించి మొదటి 15 అతిపెద్ద ఎగుమతి దారుల్లో ఆసియా దేశాలే మొదటి ఆరు స్థానాల్లో నిలవడం ఆశ్చర్యకరం. వీటిలో చైనా, మలేసియా, భారత్, ఇండోనేసియా, థాయ్‌లాండ్, ఫిలిప్పైన్స్ ఉన్నాయి. గత పదేళ్లలో అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి చట్టబద్ధం కాని మూల ధన ప్రవాహ (illicit out flows) వృద్ధి 10.2 శాతం. ఆయా దేశాల జీడీపీ వృద్ధి సగటు కంటే చట్టబద్ధం కాని మూల ధన ప్రవాహమే అధికం. వివిధ రంగాల మధ్య సరిగా లేని వనరుల పంపిణీ, సమర్థత లోపించిన సర్కారు వ్యయం, ప్రభుత్వ విధానాల వైఫల్యంతో బ్లాక్ ఎకానమీ ఏర్పడిందని నివేదిక వివరించింది.

భారత్‌లో నల్లధనం పుట్టుకకు మూలాలు
  1. భారత్‌లో ఎఫ్‌ఎంసీజీ (F.M.C.G: Fast Moving Consumer Goods)- రంగంలో ఏటా రూ. 7వేల కోట్ల చట్ట బద్ధం కాని దిగుమతులు జరుగుతున్నాయి. ఏటా ఎక్సైజ్ పన్నుకు సంబంధించి రూ. 500 కోట్లు పన్ను ఎగవేత ఈ రంగంలో నమోదవుతోంది.
  2. ఆటో మొబైల్ రంగంలో విడిభాగాల (Spare parts) తయారీ సంస్థలు తమ మొత్తం ఉత్పత్తిలో 40 శాతాన్ని రికార్డులలో నమోదు చేయకుండా విక్రయిస్తున్నాయి. తద్వారా ఈ రంగంలో తయారీ ఉత్పత్తి విలువ ప్రతి సంవత్సరం రూ. 4,500 కోట్లు నమోదవడం లేదు.
  3. సంగీత పరికరాల వార్షిక మార్కెట్ రూ. 700 కోట్లు కాగా ఈ రంగంలో పైరసీ ప్రధాన సమస్యగా మారింది. దీని వార్షిక టర్నోవర్ 2000లో రూ. 1200 కోట్లు. ప్రస్తుతం అది రూ. 600 కోట్లకు పడిపోయింది.
  4. స్థిరాస్తి వ్యాపారం (రియల్ ఎస్టేట్) మార్కెట్ వార్షిక పరిమాణం 16 బిలియన్ డాలర్లు . ఈ మొత్తంలో 60 నుంచి 70 శాతం నగదు రూపంలో లావాదేవీలు జరగడం వల్ల నల్లధన పరిమాణం పెరుగుతోంది.
  5. పన్నుల నిర్మాణాలు, ప్రోత్సాహకాల విషయంలో పలు దేశాల విధానాలు భారత్‌లో నల్లధనం పెరగడానికి కారణాలవుతున్నాయి.
  6. ఎన్నికైన ప్రభుత్వాల ద్వారా అనేక ప్రయోజనాలను ఆశించే పారిశ్రామిక వేత్తలు రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో ఇచ్చే మొత్తంలో అధిక భాగానికి లెక్కలు చూపడం లేదు. దీంతో ప్రభు త్వానికి పన్ను రాబడి తగ్గుతోంది.
  7. బంగారం కొనుగోలుకు వినియోగదారులు వెచ్చించే పెట్టుబడులు కూడా దేశంలో నల్లధన ప్రవాహం పెరగడానికి కారణం. బంగారంపై పెట్టుబడులు, పొదుపు కారణంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం 1990కి ముందు బంగారం ఎగుమతి, దిగుమతులపై నియంత్రణ విధించింది. ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉండే విదేశీ మారక ద్రవ్య నిల్వలు వ్యాపార చెల్లింపుల శేషం స్థితి మెరుగవడానికి దోహదపడవు. ఈ క్రమంలో బంగారం స్మగ్లింగ్ పెరిగింది. ప్రజలు పన్ను చెల్లించని ఆదాయాన్ని బంగారంపై పెట్టుబడులు పెట్టారు. దిగుమతిదారులు, స్మగ్లర్ల ద్వారా ఈ ద్రవ్యం బయటి దేశాలకు తరలివెళ్లింది.
  8. సేవా రంగంలో అధిక వృద్ధితో నల్లధనం విస్తరించింది. ఈ రంగానికి సంబంధించిన కార్య కలాపాలలో వాస్తవ విలువను లెక్కించడంలో చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో ప్రభుత్వానికి పన్ను చెల్లించని ఆదాయం పెరిగింది. మరోవైపు సేవా రంగంలో అసంఘటిత రంగ కార్యకలాపాలు అధికమయ్యాయి. ఉత్పత్తి పెరుగుదలతో పాటు ప్రత్యేకీకరణ, ప్రకటనలు, ప్రచారాలపై అధిక వ్యయాలతో పలు సేవా రంగ కార్యకలాపాలకు డిమాండ్ పెరుగుతోంది.
నల్లధనం- అంచనాలు
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (National Institute of Public Finance and Policy) డాక్టర్.ఎస్.ఆచార్య మార్గదర్శకంలో " Black Economy in india"ైెప అధ్యయనాన్ని నిర్వహించింది. దీనిప్రకారం 1975-76లో భారత్ లోని మొత్తం నల్లధనం సుమారు 11,870 కోట్లు. జీడీపీలో దీని వాటా 15 -18 శాతం. 1983-1984లో నల్లధనం రూ. 36, 784 కోట్లు. జీడీపీలో దీని వాటా 21 శాతానికి సమానమని నివేదిక తెలిపింది.

పలు అధ్యయనాల ప్రకారం 1999-2000 లో నల్లధనం రూ. 4.1 లక్షల కోట్లు కాగా 2006-07 నాటికి 9.6 లక్షల కోట్లకు, ప్రస్తుతం 1.5 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఉన్న భారత్ నల్లధనం అంచనాలను ఈ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గత ఐదేళ్ల కాలంలో సుమారు రూ. 50 లక్షల కోట్లు దేశ సరిహద్దులు దాటిందని అంచనా. ఈ మొత్తంలో రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, ఇతర ప్రజా ప్రతినిధులదే అగ్రభాగం. గత రెండేళ్లలో దేశం నుంచి బయటికి వెళ్లిన నల్లధనం మనకున్న అప్పు కంటే 13 రెట్లు ఎక్కువని విశ్లేషకుల అభిప్రాయం. అరుణ్‌కుమార్ అనే పరిశీలకుని అభిప్రాయంలో జీడీపీలో నల్లధనం వాటా 40 శాతం. నల్లధనాన్ని చట్టబద్ధంగా ప్రకటించి ప్రభుత్వ రికార్డులలో నమోదు చేసి దానిపై 30 శాతం పన్ను విధిస్తే ఏటా సర్కారుకు రూ. 7,50,000 కోట్లు ఆదాయం సమకూరుతుంది.

ఆర్థిక వ్యవస్థపై నల్లధనం ప్రభావం
  1. ఆదాయానికి సంబంధించి ప్రభుత్వానికి పన్ను చెల్లించకపోతే నల్లధనం ప్రవాహం పెరుగుతుంది. తద్వారా పన్నురాబడి తగ్గుతుంది. రెవెన్యూ రాబడికి పన్నుల ద్వారా సమకూరిన ఆదాయమే ప్రధాన వనరు. పన్ను రాబడి తగ్గితే పన్ను-జీడీపీ నిష్పత్తిలో క్షీణత ఏర్పడుతుంది. పన్ను-జీడీపీ నిష్పత్తి పెంచే క్రమంలో ప్రభుత్వం పరోక్ష పన్నులపై ఆధారపడితే లక్షిత వర్గాల జీవన ప్రమాణం కుంటుపడుతుంది.
  2. నల్లధనం మితిమీరితే ఆదాయ పంపిణీలో అసమానతలు తలెత్తుతాయి. ప్రస్తుతం ఈ పరిస్థితికి నల్లధనమే ప్రధాన భూతం. దేశంలోని ఆదాయ అసమానతలను పేదరిక తీవ్రత ద్వారా తెలుసు కోవచ్చు. ఇటీవల పేదరికంపై అంచనా వేసేందుకు ప్రణాళికా సంఘం ఏర్పాటు చేసిన రంగరాజన్ కమిటీ ప్రకారం దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న పేదల శాతం 21.9.
  3. నల్లధనంతో చట్టబద్ధం కాని కార్యకలాపాలు పెచ్చరిల్లుతాయి. శాంతి భద్రతల సమస్య జటిలమవుతుంది. సాధారణ ఆదాయ స్థాయి కంటే తక్కువ ఆదాయ వర్గ ప్రజల శాతం ఎక్కువయితే జీడీపీ అల్ప అంచనాకు లోనవుతుంది.
  4. అధిక ద్రవ్య చెలామణీలో ఉన్నప్పుడు ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి. ఫలితంగా ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించుకుంటే...అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాల అమలుపై రుణాత్మక ప్రభావం ఏర్పడుతుంది.
  5. ఉత్పాదక రంగాలపై పెట్టుబడులు తగ్గి, అనుత్పాదక రంగాలపై పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. తద్వారా ఉత్పాదక రంగాలలో ఉత్పత్తి, ఉత్పాదకత క్షీణిస్తుంది.
  6. పన్ను చెల్లించని నల్లధనం మొత్తాన్ని ఖర్చు పెట్టనపుడు దేశంలో పొదుపు రేటు పెరిగి, ఆర్థిక వ్యవస్థలో చెలామణీలో ఉన్న ద్రవ్య పరిమాణం తగ్గుతుంది. ఈ స్థితి దేశంలో వృద్ధి రేటు తగ్గుదలకు, నిరుద్యోగిత రేటు పెరుగుదలకు దారి తీస్తుంది.
  7. ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది. శాసన, న్యాయ, పోలీస్, బ్యూరోక్రసీ, ప్రసార మాధ్యమాలు తమ విధులను సక్రమంగా నిర్వహించలేవు.
ఇటీవల పరిణామాలు
నల్లధనాన్ని అరికట్టే విషయంలో భారత్ 13 దేశాలతో ట్యాక్స్ ఇన్‌ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ (Tax information Exchange) ఒప్పందాలను కుదుర్చుకుంది. ఏప్రిల్ 1, 2011 నుంచి భారతీయులకు సంబంధించిన బ్యాంకింగ్ సమాచారాన్ని స్విట్జర్లాండ్ నుంచి పొందేందుకు వీలుగా ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే 82 దేశాలతో డబుల్ ట్యాక్స్ అవాయ్‌డెన్స్ (Double Tax Avoidance) ఒప్పందం చేసుకుంది. వీటిలో ప్రముఖ ట్యాక్స్ హేవెన్ (Tax haven) దేశాలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి వేరే దేశంలో నల్లధనాన్ని దాచినట్లయితే ఒక దేశం తరపున మరో దేశం పన్ను వసూలు చేసే విధంగా భారత్ రెండు దేశాలతో ఒప్పందాలను విస్తరించుకొంది. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన జి-20 సదస్సు ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ (Automatic Exchange of Information)కు సంబంధించి ప్రోటోకాల్ రూపొందించింది. దీని ప్రకారం దేశాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలి. అలాగే భారతీయులకు సంబంధించిన బ్యాంక్ వివరాలను ఆయా దేశాలకు అందించాలి. ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ తో పన్ను ఎగవేతను అరికట్టవచ్చు. 2018 చివరి నాటికి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభమైతే పన్ను ఎగవేతదారులకు సురక్షిత మార్గమైన మనీ లాండరింగ్‌ను పూర్తిగా అరికట్టవచ్చు.

దేశంలో ఎలాంటి సంస్కరణలు చేపట్టకుండా నల్లధనాన్ని నిర్మూలించడం కష్టం. స్విస్ బ్యాంకులలో లెక్కచూపని నగదు కలిగిన భారతీయుల పేర్లు వెల్లడించాల్సిందిగా ఈ ఏడాది జూన్‌లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్విస్ ప్రభుత్వాన్ని కోరారు. భారత రెవెన్యూ కార్యదర్శి శక్తి కాంత దాస్ , స్విస్ సెక్రటరీ ఫర్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ జాక్వెస్ డి వాల్టా విల్లే మధ్య జరిగిన అత్యున్నత సమావేశంలో నల్లధనానికి సంబంధించి నిర్దేశిత కాల ప్రాతిపదికన భారత్‌కు సమాచారాన్ని ఇవ్వడానికి స్విస్ అంగీకరించింది.

స్విస్ నేషనల్ బ్యాంక్ ఇటీవల గణాంకాల ప్రకారం స్విస్ బ్యాంకులలో భారతీయులు దాచిన మొత్తం డిసెంబర్ 2013 చివరి నాటికి రూ. 14వేల కోట్లు. గతేడాదితో పోల్చిచూస్తే ఇది 42 శాతం పెరిగిందని తెలిపింది. నిఘా సంస్థలు సేకరించిన భారతీయ విదేశీ ఖాతాలకు సంబంధించి సమాచారం నిజమైందో? కాదో? చెప్పేందుకు కూడా స్విస్ అంగీకరించింది.

తెల్లధనంగా మార్చితే తేజోమయమే
  1. 12వ ప్రణాళికలో 9 శాతం జీడీపీని సాధించవచ్చు.
  2. విద్యుత్‌బోర్డులను సమర్థంగా తీర్చిదిద్ది శక్తి సంక్షోభం నివారించవచ్చు.
  3. 10 కోట్ల ప్రజలకు పక్కా గృహాలను నిర్మించవచ్చు.
  4. వ్యవసాయరంగంలో మేలు రకపు వంగడాల కోసం పరిశోధనలకు అధిక నిధుల కేటాయింపు
  5. నిరుపేదల జీవన ప్రమాణాల పెంపునకు సంక్షేమ కార్యక్రమాల అమలు
  6. ప్రభుత్వం రుణ భారాన్ని తగ్గించుకోవచ్చు
  7. వెనకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేయవచ్చు.
  8. చిన్న, సన్న కారు రైతులకు సంబంధించి వ్యవసాయ రుణాల మాఫీ సాధ్యమవుతుంది.
  9. నిరుద్యోగం, పేదరికాన్ని పూర్తిగా అరికట్టి, ప్రపంచ దేశాలకే దిక్సూచిగా మార్చవచ్చు.
ఏదీ చిత్తశుద్ధి?
ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు నల్లధనంపై ఘోషించిన పాలక పెద్దలు...అధికార పీఠమెక్కాక నోరుమెదపడం లేదు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలూ ఉదాసీన వైఖరినే అవలంబిస్తుండటం విచారకరం. నల్లధనం విషయంలో ఏదో పురోగతి సాధిస్తుందనుకున్న ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం అదే బాటలో నడుస్తుంది. ఒప్పందం కుదుర్చుకున్న దేశాలు రెండు సార్లు భారతీయుల ఖాతాల వివరాలను అందించినా బిహ ర్గతం చేయకపోవడం వెనుక అసలు రహస్యమేంటో మోదీ సర్కారుకే తెలియాలి. విదేశాల్లో మూలుగుతున్న మన వాళ్ల నల్లధనాన్ని రప్పించి తెల్లధనంగా మార్చితే అమెరికానే తలదన్నవచ్చన్నది అక్షర సత్యం. కానీ ఆ దిశగా అడుగులు వేసే వారెవరు?

గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ 2001-10 ప్రకారం నల్లధనం జాబితాలో 10 అగ్ర దేశాలు.

 

దేశం

విలువ (బిలియన్ డాలర్లలో)

1.

చైనా

2,740

2.

మెక్సికో

476

3.

మలేసియా

285

4.

సౌదీ అరేబియా

210

5.

రష్యా

152

6.

ఫిలిప్పీన్స్

138

7.

నైజీరియా

129

8.

ఇండియా

123

9.

ఇండోనేసియా

109

10.

యూఏఈ

107

Published date : 30 Oct 2014 02:04PM

Photo Stories