Skip to main content

World Population: గణనీయంగా పెరగనున్న ప్రపంచ జనాభా..

సగం గ్లాసు నీటి దృష్టాంతం మాదిరిగానే, ప్రపంచ జనాభా పెరుగుదల గురించి ఆలోచించే విధానం మన దృక్పథాన్ని బట్టి మారుతుంది.
UN says World Population is projected to peak at 10.3 billion in the 2080s

ఐక్యరాజ్యసమితి (ఐరాస) విడుదల చేసిన 'ప్రపంచ జనాభా దృశ్యం' (డబ్ల్యూపీపీ) నివేదిక ఈ అంశంపై చర్చలకు దారితీసింది.

ప్రాథమికంగా ఈ నివేదిక ప్రపంచ జనసంఖ్య ఎలా మారనున్నదీ అంచనా వేసి, వివిధ ప్రాంతాలు, దేశాలపై దాని ప్రభావం ఎలా ఉండనుందో భవిష్యత్‌ దర్శనం చేస్తోంది. ప్రపంచ జనాభా గణనీయంగా పెరిగి, 2080ల నాటికి 1000 కోట్లు దాటుతుందనీ నివేదిక అంచనా వేస్తోంది. ఆ తరువాత జనాభా క్రమంగా తగ్గుతుందట. ఇప్పటికే అత్యధిక జనాభా గల దేశంగా భారతదేశం ఈ నివేదికలో కీలక అంచనాలను కట్టింది. ఈ నివేదిక ఆసక్తి రేపి, ఆలోచనలు పెంచుతోంది.

భారతదేశంలో 2011 తరువాత అధికారిక జనగణన జరగనే లేదు. దశాబ్దానికి ఒకసారి జరిపే ఈ కీలక ప్రక్రియ నిజానికి 2021లోనే జరగాల్సి ఉంది. కరోనా కాలంలో ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వం పక్కనపెట్టింది. ఆ మహమ్మారి ముగిసిన తరువాత కూడా దానికి మోక్షం కలగనే లేదు. జనాభా స్థితిగతులపై స్పష్టమైన అవగాహన కల్పించే జనగణనపై ప్రభుత్వం ఉదాసీనత చూపుతోంది.

ఈ పరిస్థితుల్లో ఐరాస వెలువరించిన ప్రతిష్ఠాత్మక డబ్ల్యూపీపీ నివేదిక మనకు మార్గదర్శి. లింగ, వయో భేదాల వారీగా వచ్చే 2100 వరకు భారత జనాభా ఎలా ఉండవచ్చనే అంచనాలను ఈ నివేదిక వివరంగా పేర్కొంది. జనసంఖ్యా సంబంధమైన సమాచారంలో ఈ ఐరాస నివేదిక ప్రామాణికమైనది కాబట్టి, భవిష్యత్‌ వ్యూహ రచన విషయంలో మన పాలకులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

India's Population: 170 కోట్లు చేరుకోనున్న భారతదేశ జనాభా.. ఎప్పటిలోపు అంటే..?!

మన దేశ జనాభా 145 కోట్లు..
2023 జనవరి – జూలై నెలల మధ్యలో భారత్‌ అత్యధిక జనాభా గల దేశంగా అవతరించినట్టు వార్తలొచ్చాయి. ఐరాస లెక్కల ప్రకారం, ప్రస్తుతం మన దేశ జనాభా 145 కోట్లు. సమీప భవిష్యత్తులోనూ జనసంఖ్య విషయంలో భారత్‌ చైనా కన్నా ముందుండనుంది. 2060లలో కానీ భారత జనాభాలో తగ్గుదల మొదలుకాదు. పెరుగుతున్న ఈ జనాభా తీరుతెన్నులు, మంచీచెడుల పట్ల రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

జనాభాతో పాటు పెరిగే కనీస అవసరాలను తీర్చడం అంత సులభమేమీ కాదన్నది నిజం. అయితే అధిక జనాభా అన్ని విధాలా నష్టమని భయపడాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న మానవ వనరులను సవ్యంగా వినియోగించగలిగితే, ఏ దేశానికైనా జనసంఖ్య అయాచిత వరమే అవుతుంది. ఐరాస నివేదిక ప్రకారం 2060ల వరకు భారత్‌కు అధిక జనాభా తప్పదు. దాన్ని సానుకూలంగా మార్చుకొని, దేశాభివృద్ధికి ఎలా సాధనంచేసుకోవాలన్నది కీలకం.

పనిచేసే వయసు జనాభా భారత్‌లో ప్రస్తుతం 86 కోట్లుంది. 2049 వరకు ఈ సంఖ్య పెరిగి, వంద కోట్లు దాటుతుందట. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని సంకల్పం చెబుతున్న మన పాలకులు నివేదికలోని ఈ అంచనాపై లోతుగా దృష్టి పెట్టాలి. పనిచేసే వయసులోని ఈ వంద కోట్ల మందిని నిపుణులుగా తీర్చిదిద్దడంపై దేశ పురోగతి ఆధారపడి ఉంటుంది.

Aditya-L1: సూర్యుడి రహస్యాలను అన్వేషించే భారతీయ అంతరిక్ష నౌక ఇదే..

దేశంలో నిరుద్యోగ తీవ్రతకు..
ఇటీవల గుజరాత్‌లో 10 ఉద్యోగాలకు 1,800 మంది – ముంబైలో 2 వేల ఉద్యోగాలకు 22 వేల మంది హాజరుకావడం, తొక్కిసలాట జరగడం దేశంలో నిరుద్యోగ తీవ్రతకు మచ్చుతునక. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సమకాలీన అవసరాలకు తగ్గ నైపుణ్యాభివృద్ధిని కల్పించి, యువజనులను సరైన ఉపాధి మార్గంలో నడపడం ముఖ్యం. అలా చేయగలిగితే ఆర్థిక ముఖచిత్రమే మారిపోతుంది. లేకపోతే ఇదే జనశక్తి ఆర్థిక, రాజకీయ అస్థిరతకు కారణమవుతుంది.

ప్రపంచం సంగతికొస్తే రాగల దశాబ్దాల్లో సోమాలియా, రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో సహా ప్రధానంగా ఆఫ్రికా ప్రాంతంలో జనాభా పెరుగనుంది. విలువైన సహజ వనరులకు అవి నెలవైనందున భౌగోళిక రాజకీయ ప్రాబల్యం కోసం ఘర్షణలు తలెత్తవచ్చు. పాకిస్తాన్‌ దాదాపు 39 కోట్ల జనాభాతో అమెరికాను దాటి, ప్రపంచ జనాభాలో మూడో స్థానంతో కీలకంగా మారనుంది.

ఐరాస నివేదికలో మరో కీలకాంశం – 2060ల నుంచి భారత జనాభా తగ్గడం మొదలుపెడుతుంది. అదే సమయంలో పనిచేసే వయసులోని వారి సంఖ్య 2050 నుంచే తగ్గిపోనుంది. పనిచేసే వయసు (15 నుంచి 65 ఏళ్లు) కన్నా తక్కువ గానీ, ఎక్కువ గానీ ఉంటూ ఇతరులపై ఆధారపడేవారి నిష్పత్తి 2040 నుంచే పెరగనుంది.

అంటే, నేటి యువశక్తిని నైపుణ్యాలనూ, ఆర్జన మార్గాలనూ భవిష్యత్‌ అవసరాలకు సరిపడేలా తీర్చిదిద్దడం ముఖ్యం. వృత్తివిద్యా శిక్షణ, అప్రెంటిస్‌ షిప్‌లతో మన చదువులను కొంత పుంతలు తొక్కించాలి. లేకపోతే, ఆధారపడేవారి సంఖ్య పెరిగాక చిక్కులు తప్పవు. రాగల మూడు దశాబ్దాలు జనశక్తి, శ్రమయుక్తితో సంఖ్యాపరమైన సానుకూలత మనదే. వాటితో ముడిపడ్డ చిక్కులను ఎదుర్కొంటూ, ఈ శక్తిని సమర్థంగా వినియోగించుకోవడమే సవాలు. అందులో తడబడితే.. అక్షరాలా ‘అమృతకాలం’ దాటిపోయినట్టే!

Blue Hole: సముద్ర గర్భంలో ఉండే లోతైన నీలి రంధ్రం బిలాలు ఇవే..

Published date : 19 Jul 2024 03:30PM

Photo Stories