Skip to main content

ఈ జాగ్రత్తలు పాటిస్తే.. దిగ్గజ కంపెనీల్లో జాబ్ మీదే..!

ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగంలో చేరాలనుకునే విద్యార్థులకు అందుబాటులో ఉన్న అద్భుత అవకాశం.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్. యూనివర్సిటీ కళాశాలలతోపాటు పేరున్న కాలేజీల్లో కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా నియామకాలు చేపడుతుంటాయి.
కోర్సు పూర్తికాకముందే కొలువునందించే  ఈ ప్లేస్‌మెంట్స్‌కు విద్యార్థులు తొలి నుంచే సన్నద్ధమవుతారు. అయితే ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్లేస్‌మెంట్లకు బ్రేక్ పడింది. కొన్ని కంపెనీలు ఆన్‌లైన్‌లో ఎంపిక ప్రక్రియలు నిర్వహిస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయి రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో.. ఇంజనీరింగ్ ప్లేస్‌మెంట్స్ తాజా పరిస్థితి... దీర్ఘకాలిక లక్ష్యాలపై నిపుణుల సూచనలు...
 
 ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా దేశంలో క్యాంపస్ నియామకాలకు అంతరాయం ఏర్పడింది. చాలా కంపెనీలు తమ ప్లేస్‌మెంట్ ప్రక్రియను నిలిపివేశాయి. ఇంజనీరింగ్ కళాశాలలు ఏటా డిసెంబర్, ఏప్రిల్ మధ్య క్యాంపస్ నియామకాలను నిర్వహిస్తారుు. ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా ఈ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ ఆలస్యమవుతుందని అంతా భావించారు. కాని ప్రస్తుత పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఎందుకంటే.. ‘కరోనా’ సంక్షోభం నేపథ్యంలో కొత్త నియామకాలకు చాలా కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే పలు కంపెనీలు ప్లేస్‌మెంట్స్‌లో విద్యార్థులను ఎంపిక చేసుకున్నప్పటికీ.. వాటిలో కొన్ని కంపెనీలు జాబ్ ఆఫర్లను వాయిదా వేస్తుంటే.. మరికొన్ని కంపెనీలు ఆఫర్లను ఉపసంహరించుకుంటున్నాయి.
 
 ఇంటర్వూకి వెళ్లే రోజు ఏం చేయాలంటే..!
  
 దిగ్గజాల్లో ఓకే..
 టెక్నాలజీ దిగ్గజ సంస్థలైన టీసీఎస్, గూగుల్, విప్రో, కాప్‌జెమినీ, టెక్ మహీంద్రా, యాక్సెంచర్ వంటి పెద్ద కంపెనీలు మాత్రమే క్యాంపస్ నియామకాల్లో ఇచ్చిన ఉద్యోగ ఆఫర్లకు కట్టుబడుతున్నాయి. ‘కరోనా’ సంక్షోభం ఇప్పట్లో ముగిసే అవకాశం లేనందున కొన్ని కంపెనీలు వర్చువల్ ఆన్ బోర్డింగ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. టెలిప్రజెన్స్, వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఉద్యోగులు ఎక్కడినుంచైనా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అటువంటి సంస్థలు ప్లేస్‌మెంట్స్‌లో ఎంపికైన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తూ వర్క్ ఫ్రం హోం చేసేందుకు ప్రోత్సహిస్తున్నాయి.
 
 మందగించే అవకాశం..
 జాబ్ మార్కెట్‌లో మార్పులు, ‘కరోనా’ సంక్షోభం కారణంగా భవిష్యత్తులోనూ విద్యార్థులు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఫైనాన్షియల్, హెల్త్‌కేర్ సంబంధిత, వాటి అనుబంధ రంగాల్లో అవకాశాలు ఉన్నప్పటికీ.. ఇతర రంగాల్లో నియామకాలు మందగించే అవకాశం ఉంది. కాబట్టి కంపెనీలు విభిన్నమైన స్కిల్స్ ఉంటేనే కొలువులను ఆఫర్ చేసే అవకాశం ఉంది.
 
 సెల్ఫ్ ఇంట్రాడక్షన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు- సూచనలు
  
 ఆ స్కిల్స్ ఉంటేనే..
 భవిషత్‌‌తలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఎంపిక ప్రక్రియ మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంటుంది. అభ్యర్థుల ప్రాథమిక పరిజ్ఞానంతోపాటు ప్రాక్టికల్‌నాలెడ్‌‌జ, సాఫ్ట్‌స్కిల్స్.. ఇలా అన్ని కోణాల్లో పరీక్షిస్తాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో లెర్నింగ్ దృక్పథం, తమ అవసరాలకు తగ్గ నైపుణ్యాలున్న విద్యార్థులకే ఆఫర్లు ఇస్తాయి. ముఖ్యంగా ఎక్కడినుంచైనా పనిచేసే నైపుణ్యాలు ఉన్నవారికే కంపెనీలు ప్రాధాన్యతనిస్తాయి. కాబట్టి మారిన టెక్నాలజీ యుగంలో ప్రాక్టికల్ నాలెడ్‌‌జ పెంచుకోవడంతోపాటు, కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు మెరుగుపరచుకునేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులు నిరంతరం కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
 
 ఇంటర్వూలో మెరవాలంటే.. ఇవిగో మార్గాలు
 
  లెర్నింగ్ ముఖ్యం..
 నేటి పోటీ ప్రపంచంలో ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం సాధించాలన్నా.. కెరీర్‌లో మనుగడ సాగించాలన్నా.. నిరంతరం నాలెడ్జ్‌ను పెంపొందించుకోవడం ముఖ్యం. అందుకోసం మూక్స్, ఆన్‌లైన్ మార్గాల్లో లేటెస్ట్ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి. ‘కరోనా’ కారణంగా వచ్చిన ఈ విరామ సమయాన్ని కూడా జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగించుకోవాలి. నియామకాల సమయంలో కంపెనీలు అభ్యర్థిలో జ్ఞానాన్ని పెంపొందించుకునే దృక్పథాన్ని కూడా ప్రధానంగా పరిశీలిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు తమ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులు, అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీ గురించి నిరంతరం తెలుసుకోవాలి.
 
 ఇంటర్న్‌షిప్ మార్గం..

 బేసిక్ నైపుణ్యాలను, లేటెస్ట్ స్కిల్స్‌తో పదును పెట్టుకోవాలి. తద్వారా సంక్షోభం ముగిసిన తర్వాత పరిస్థితులు సరిదిద్దుకున్నాక త్వరగా కొలువు సాధించేందుకు వీలవుతుంది. ప్రస్తుతం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు బ్రేక్ పడినప్పటికీ.. చాలా కంపెనీలు ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పిస్తున్నాయి. వాటిని అందిపుచ్చుకుని రియల్ టైం అనుభవం, నాలెడ్జ్ అప్‌డేషన్, స్కిల్స్ అడాప్టబిలిటీ, ప్రాక్టికల్ ఓరియెంటేషన్ నైపుణ్యాలను పెంచుకోవాలి. సంస్థలోని వాస్తవ పనివాతావరణంపై పూర్తి స్థాయి పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. సంబంధిత రంగంలో కొత్త టెక్నాలజీలు, వ్యూహాలపైనా అవగాహన పెంచుకోవాలి.
 
 కరెక్టు బాడీలాంగ్వేజ్‌తో ఇంటర్వూలో విజయం సాధించే మార్గాలు

  నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి!
 కోవిడ్ 19 మహమ్మారి కారణంగా కళాశాలలు మూతపడటం, పరీక్షల నిర్వహణపై సందిగ్ధతతోపాటు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లకూ అంతరాయం ఏర్పడింది. కొన్ని కంపెనీలు ఆన్‌లైన్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తున్నాయి. విద్యార్థుల డేటాను రూపొందిస్తూ కంపెనీలకు క్యాంపస్ ప్లేస్‌మెంట్లు నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులకు కంపెనీలు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చి వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. భవిష్యత్తులో ప్లేస్‌మెంట్స్‌పై కరోనా ప్రభావం ఏ మేరకు ఉంటుందో అంచనా వేయలేం. కానీ సంస్థల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటే.. తప్పకుండా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
 - ప్రొఫెసర్ జె.సురేశ్ కుమార్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్, జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, హైదరాబాద్
 
 సమయాన్ని వృథా చేయొద్దు!
 కోవిడ్ 19 మహమ్మారి ఇంజనీరింగ్‌తోపాటు అన్ని ర కాల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఫలితంగా డిసెంబర్ నుంచి జరగాల్సిన క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో కొన్ని మాత్రమే జరిగాయి. మిగిలినవి ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌పై మాత్రమే ఆధారపడకుండా.. అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని కంపెనీలు ఆన్‌లైన్ టెస్టింగ్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. మొదటిసారి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు గతంలో మాదిరి శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూడొద్దు. ప్రస్తుత తరుణంలో ఏదైనా సంస్థలో ఉద్యోగం ఆశించడం కంటే ప్రాజెక్టు కోసం ప్రయత్నిస్తే ప్రయోజనం ఉంటుంది. భవిష్యత్తులో ప్రాజెక్టు లేదా నైపుణ్య ఆధారిత ఉద్యోగితకే ప్రాధాన్యత పెరగనుంది. కాబట్టి ఇప్పటినుంచే అందుకు తగిన సామర్థ్యాలను పెంపొందించుకునే దిశగా విద్యార్థులు ప్రయత్నించాలి. కంపెనీలు రిమోట్ ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందిస్తున్నాయి. వాటిని అందిపుచ్చుకుంటే విద్యార్థులు భవిష్యత్తు ఉద్యోగాలపై అవగాహన ఏర్పరచుకోవచ్చు. సొంతంగా నేర్చుకోవడం, నేర్చుకున్న అంశాలను సొంతంగా ఎగ్జిక్యూట్ చేయడంపై ఎక్కువ దృష్టి సారించాలి. ఫ్రెషర్స్ తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా రిమోట్‌గా పనిచేసేలా తమ దృక్పథాన్ని మలచుకోవాలి. అందుకు తగిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి.
 -జి.ఆర్.రెడ్డి, ఫౌండర్, హ్యూసిస్ కన్సల్టెన్సీ
Published date : 01 Jul 2020 01:32PM

Photo Stories