Skip to main content

Campus Selections: క్యాంపస్‌ సెలక్షన్స్‌లో వరంగల్‌ నిట్‌ విద్యార్థుల జోరు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ఆకర్షణీయ వేతనాలతో కొలువులు సాధిస్తున్న విద్యార్థులకు వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (ఎన్‌ఐటీ) అడ్డా గా మారింది.
Warangal NIT Students in Campus Selections

నిట్‌ వరంగల్‌లో సీటు వచ్చిందంటే ఉద్యోగంతోనే బయటకి అడుగుపెడుతామన్న భరోసా విద్యార్థుల్లో కనిపిస్తోంది. ఇక్కడి విద్యార్థి అన్ని రంగాల్లో అత్యుత్తమంగా రాణిస్తారనే భావనతో ప్రభుత్వ రంగం సంస్థలు, ప్రైవేట్‌ కంపెనీలు ఎన్‌ఐటీలో క్యాంపస్‌ సెలక్షన్స్‌ నిర్వహించేందుకు, రిక్రూట్‌మెంట్‌ చేసుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయి. 

క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ‘నిట్‌’ విద్యార్థుల జోరు 

  • నిట్‌ వరంగల్‌లోని బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ విద్యార్థులు క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ప్రతీ ఏడాది జోరు కొనసాగిస్తున్నారు.  
  • ఈ ఏడాది బీటెక్‌లో 82 శాతం, ఎంటెక్‌ 62.3 శాతం, ఎంసీఏ 82.6 శాతం, ఎమ్మెస్సీ 80 శాతం, ఎంబీఏలో 76 శాతం విద్యార్థులు క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు సాధించారు.  
  • మొత్తంగా 1,483 మంది ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్లో 1,128 మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయి.  
  • నాలుగేళ్లలో జరిగిన క్యాంపస్‌ సెలక్షన్స్‌ను పరిశీలీస్తే ఏటేటా కొలువులు పొందుతున్న సంఖ్య పెరుగుతోంది.  
  • 2020–21లో క్యాంపస్‌ సెలక్షన్స్‌ కోసం 186 కంపెనీలు పాల్గొంటే.. 815 మంది విద్యార్థులు ఎంపిక కాగా, అత్యధికంగా రూ.52లక్షల ప్యాకేజీ వచ్చింది.  
  • 2021–22లో 1,108, 2022–23లో 1,404 మంది విద్యార్థులు ఎంపిక కాగా.. ఈ ఏడాది 1,128 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. అత్యధికంగా రూ.88 లక్షల ప్యాకేజీ లభించింది. 

ప్లేస్‌మెంట్స్, ప్యాకేజీలలో తగ్గేదేలే.. 

ప్రస్తుత తరుణంలో ఐటీ రంగం సంక్షోభంలో కూరుకుపోయి ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుండగా సంక్షోభాన్ని తలదన్ని తమ ప్రత్యేకతను చాటుకుని క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు సాధించారు నిట్‌ విద్యార్థులు.

చదవండి: Indian Navy Recruitment: ఇంటర్‌ పాసయ్యారా? నాలుగేళ్ల బీటెక్‌ డిగ్రీతో పాటు నేవీలో ఉద్యోగం

గతేడాది సీఎస్‌ఈ విభాగానికి చెందిన ఆదిత్య సింగ్‌ రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీని అత్యధికంగా సాధించగా, ఈ ఏడాది ఈసీఈ విద్యార్థి రవీషా తన సత్తాను చాటి రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీ ఆనవాయితీని కొనసాగించాడు. అదే విధంగా 12 మంది రూ.68 లక్షల వార్షిక ప్యాకేజీ, తక్కువలో తక్కువగా రూ.15.6 లక్షల వార్షిక ప్యాకేజీని మిగతా విద్యార్థులు సాధించారు. 

గతేడాది 250..ఇప్పుడు 278..

నిట్‌ క్యాంపస్‌లో క్యాంపస్‌ సెలక్షన్స్‌ నిర్వహించేందుకు గతేడాది 250కి పైగా కంపెనీలు రాగా ఈ ఏడాది 278 ప్రైవేట్‌తోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు క్యాంపస్‌ సెలక్షన్స్‌ నిర్వహించేందుకు ఆసక్తి కనబరిచాయి.

ఇక్కడి విద్యార్థులను ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్, డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, ప్రాడక్ట్స్‌ అనాలిసిస్, ప్రొడక్ట్‌ ఇంజనీరింగ్, కన్సల్టెంట్, మేనేజ్‌మెంట్‌ వంటి రంగాల్లో ఎంపిక చేశారు.

ఉత్తమ బోధనతోనే.. 
నిట్‌ వరంగల్‌లోని అధ్యాపకుల అత్యుత్తమ బోధనతోనే క్యాంపస్‌ సెలక్షన్స్‌లో యూఎస్‌కు చెందిన సోర్బ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీని
సాధించా. మాది పంజాబ్‌లోని లూథియానా.. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి నిట్‌ వరంగల్‌లో సీటు సాధించి, ఉన్నత ఉద్యోగానికి ఎంపిక కావడం ఆనందంగా ఉంది. 
– రవిషా, ఈసీఈ, రూ.88 లక్షల ప్యాకేజీ 

ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉద్యోగావకాశాలు కల్పిస్తా..
మాది మహారాష్ట్ర. వరంగల్‌లో నిట్‌లో సీటు వచ్చినప్పుడు ఎంతో భయంగా ఉండేది. ఇక్కడి అధ్యాపకుల ప్రోత్సాహం, విద్యార్థుల సహకారంతో బీటెక్‌లో ఈసీఈ పూర్తి చేసి క్యాంపస్‌ సెలక్షన్స్‌లో హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో రూ.64లక్షల వార్షిక ప్యాకేజీ సాధించాను. ఎంబీఏ చేసి ఎంటర్‌పెన్యూర్‌గా ఓ పరిశ్రమను స్ధాపించి నా తోటి వారికి ఉద్యోగావకాశాలు కల్పించడమే నా లక్ష్యం.
– మీత్‌ పోపాట్, ఈసీఈ, రూ.64లక్షల ప్యాకేజీ  

Published date : 12 Jul 2024 10:04AM

Photo Stories