Skip to main content

APPSC Jobs‌: రెవెన్యూ, దేవాదాయ శాఖలో.. కొలువు సాధించండి.. ఇలా!

appsc recruitment
appsc recruitment

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ).. ఒకేసారి ఏడు వందలకు పైగా పోస్ట్‌లతో నోటిఫికేషన్‌లు వెలువరించడంతో.. ఉద్యోగార్థులకు సంక్రాంతి పండగ ముందే వచ్చినట్లయింది. గత కొంత కాలంగా క్రమం తప్పకుండా పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌లను విడుదల చేస్తున్న ఏపీపీఎస్సీ.. తాజాగా మరో రెండు నోటిఫికేషన్లతో అభ్యర్థుల ముందుకొచ్చింది. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లు, దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3 పోస్ట్‌లకు.. ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో..ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

  • రెండు శాఖల్లో కలిపి 730 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌
  • రూ.16,400–రూ.48,870 శ్రేణిలో ప్రారంభ వేతనం
  • రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక
  • దరఖాస్తుల సంఖ్య ఆధారంగా స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించే అవకాశం
  • సిలబస్‌పై సంపూర్ణ అవగాహనతో విజయం సాధించొచ్చు

ఏపీపీఎస్సీ ఇటీవల 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు.. అభ్యర్థులు ఇప్పటి నుంచే కృషి చేయాలి. ఇందుకోసం ఆయా నోటిఫికేషన్లలో పేర్కొన్న సిలబస్‌కు అనుగుణంగా ప్రిపరేషన్‌ సాగిస్తే.. విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

రెండు శాఖలు, 730 పోస్ట్‌లు

  • ఏపీపీఎస్సీ రెండు శాఖల్లో మొత్తం 730 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. అవి..
  • ఏపీ రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టులు–670.
  • దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3–పోస్టులు– 60.
  • అభ్యర్థులు ఈ రెండు నోటిఫికేషన్లకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
  • బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతగా పేర్కొన్న ఈ రెండు రకాల పోస్ట్‌ల భర్తీకి ఏపీపీఎస్సీ వేర్వేరుగా ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది.


చ‌ద‌వండి: Guidance

రాత పరీక్షలో మెరిట్‌

ఏపీపీఎస్సీ నిర్వహించే రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగానే ఈ పోస్టుల భర్తీ చేపడతారు. ఈ రెండు పోస్ట్‌లకు సంబంధించిన రాత పరీక్షలో ఒక పేపర్‌ జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ ఉంటుంది. రెండో పేపర్‌ మాత్రం జూనియర్‌ అసిస్టెంట్స్‌ పోస్ట్‌లకు,ఎండోమెంట్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు వేర్వేరుగా ఉంటుంది. దీంతో..బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులు సమయ పాలన, నిర్దిష్ట వ్యూహంతో..ప్రిపరేషన్‌ సాగిస్తే.. ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధమై.. రెండు పోస్ట్‌లకు పోటీ పడే అవకాశం ఉంది.

దరఖాస్తుల సంఖ్య ఆధారంగా

  • ఒక్కో పోస్ట్‌కు దరఖాస్తుల సంఖ్య 200 దాటితే.. ముందుగా స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. స్క్రీనింగ్‌ టెస్ట్‌లో ప్రతిభ చూపిన వారిని తదుపరి దశలో మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. 
  • ఒక్కో పోస్ట్‌కు నిర్దిష్ట నిష్పత్తిలో మెయిన్‌ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొంది. మెయిన్‌ పరీక్షలో పొందిన మెరిట్‌ ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేయనున్నారు.

చ‌ద‌వండి: appsc-previous-papers

స్క్రీనింగ్‌ టెస్ట్‌లు ఇలా

  • రెవెన్యూ శాఖలోని జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్, దేవాదాయ శాఖలోని ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు సంబంధించి స్క్రీనింగ్‌ పరీక్ష విధానాలు..
  • జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌‡స్క్రీనింగ్‌ టెస్ట్‌: ఈ పరీక్ష రెండు విభాగాలుగా రెండు సబ్జెక్ట్‌లలో 150 మార్కులకు జరగనుంది.
    విభాగం సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు సమయం
    జీఎస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 100 100 100ని
    బి జనరల్‌ ఇంగ్లిష్‌ అండ్‌ జనరల్‌ తెలుగు 50 50 50ని

ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3 స్క్రీనింగ్‌ టెస్ట్‌:

  • ఈ పరీక్ష కూడా రెండు విభాగాలుగా 150 మార్కులకు జరుగనుంది. వివరాలు..
    విభాగం సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు సమయం
    జీఎస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 50 50 50 ని
    బి హిందూ తత్వం దేవాలయ వ్యవస్థ 100 100 100 ని
  • రెండు పోస్ట్‌లకు నిర్వహించే స్క్రీనింగ్‌ పరీక్ష పూర్తిగా పెన్‌ పేపర్‌ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు ఓఎంఆర్‌ షీట్‌పై సమాధానాలు నింపాలి.
  • నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 1/3 మార్కులు తగ్గిస్తారు. 
  • రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లకు నిర్వహించే పార్ట్‌–బి పేపర్‌లో.. జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి 25 ప్రశ్నలు, జనరల్‌ తెలుగు నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు.

మెయిన్‌ పరీక్ష

స్క్రీనింగ్‌ టెస్ట్‌లో నిర్దేశిత కటాఫ్‌ మార్కులు పొందిన వారికి తదుపరి దశలో మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఇది కంప్యూటర్‌ బేస్డ్‌(ఆన్‌లైన్‌) టెస్ట్‌గా ఉంటుంది.

  • జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ మెయిన్‌: ఈ పరీక్ష రెండు పేపర్లుగా మొత్తం 300 మార్కులకు జరగనుంది. పూర్తిగా ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. వివరాలు..
    పేపర్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు
    పేపర్‌–1 జీఎస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 150 150
    పేపర్‌–2 జనరల్‌ ఇంగ్లిష్‌ అండ్‌ జనరల్‌ తెలుగు 150 150
  • పేపర్‌–2లో జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి 75 ప్రశ్నలు, జనరల్‌ తెలుగు నుంచి 75 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు. 
  • ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3 (ఎండోమెంట్‌ సబ్‌ సర్వీస్‌) మెయిన్‌: ఈ పరీక్ష కూడా రెండు పేపర్లుగా 300 మార్కులకు జరగనుంది. వివరాలు..
    పేపర్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు
    పేపర్‌–1 జీఎస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 150 150
    పేపర్‌–2 హిందూ తత్వం దేవాలయ వ్యవస్థ 150 150
  • ఈ పరీక్ష కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటుంది.
  • ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు.

ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3 (ఏపీ ఎండోమెంట్స్‌ సబ్‌ సర్వీస్‌)

  • మొత్తం పోస్టుల సంఖ్య: 60
  • వేతన శ్రేణి: రూ.16,400 – రూ.49,870
  • అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి
  • వయో పరిమితి: జూలై 1, 2021 నాటికి 18–42 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 29.01.2022
  • వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in

జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌(రెవెన్యూ శాఖ) (గ్రూప్‌–4 సర్వీసెస్‌)

  • మొత్తం పోస్టుల సంఖ్య: 670
  • ప్రారంభ వేతన శ్రేణి: రూ.16,400 –రూ.49,870.
  • అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. తుది ఎంపికకు షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
  • వయో పరిమితి: జూలై 1, 2021 నాటికి 18–42 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ,ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది. 
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేది: 29.01.2022
  • వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in

నిర్దిష్ట ప్రణాళికతో.. విజయం దిశగా

  • రెండు శాఖల్లోని పోస్టులకు కూడా స్క్రీనింగ్‌ టెస్ట్‌లో పేర్కొన్న సబ్జెక్ట్‌లనే మెయిన్‌ పరీక్షలోనూ పేర్కొన్నారు. 
  • స్క్రీనింగ్, మెయిన్‌లకు ఒకే సిలబస్‌ అంశాలను పేపర్లుగా నిర్దేశించినా.. మెయిన్‌లో అడిగే ప్రశ్నలు లోతుగా ఉండే అవకాశం ఉంది. 
  • కాబట్టి మొదటి నుంచే మెయిన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్‌ సాగించాలి. తద్వారా స్క్రీనింగ్‌ టెస్ట్‌లో సులభంగా విజయం సాధించి మెయిన్‌కు అర్హత పొందొచ్చు.
  • అభ్యర్థులు ప్రిపరేషన్‌కు ముందే ఆయా సబ్జెక్ట్‌ల సిలబస్‌లను ఆమూలాగ్రం పరిశీలించాలి. స్క్రీనింగ్, మెయిన్‌ పరీక్షల సిలబస్‌ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలి.
  • భిన్నంగా ఉన్న అంశాలను ప్రత్యేకంగా నోట్‌ చేసుకొని.. వాటి ప్రిపరేషన్‌కు ప్రత్యేక సమయం కేటాయించాలి. 
  • దేవాదాయ శాఖలోని ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు స్క్రీనింగ్, మెయిన్‌లో ఉన్న హిందూతత్వం, దేవాలయ వ్యవస్థ పేపర్‌కు సంబంధించి ప్రత్యేకంగా అధ్యయనం కొనసాగించాలి. 
  • పురాణాలు, ఇతిహాసాలు, వేద సంస్కృతి, కళలు, ఉపనిషత్తులు, కుటుంబ వ్యవస్థ, దేవాలయాలకు వచ్చే ఆదాయ మార్గాలు, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ విధులు, ఎండోమెంట్‌ భూములకు సంబంధించిన చట్టాలు, భూ రికార్డులపై అవగాహన పెంచుకోవాలి.
  • జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీకి సంబంధించి.. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలు; భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, ఆర్థికాభివృద్ధి ,ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం, పునర్విభజన సమస్యల గురించి అధ్యయనం చేయాలి.
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లక్షిత వర్గాలు, లబ్ధిదారులు, బడ్జెట్‌ కేటాయింపుల గురించి తెలుసుకోవాలి.
  • మెంటల్‌ ఎబిలిటీ విభాగంలో.. రాణించేందుకు టాబ్యులేషన్, డేటా సమీకరణ, డేటా విశ్లేషణలపై అవగాహన పెంచుకోవాలి.
  • రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లకు పేర్కొన్న జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ తెలుగు పేపర్‌ కోసం ఈ రెండు భాషలకు సంబంధించి బేసిక్‌ గ్రామర్‌ అంశాలు, యాంటానిమ్స్, సినానిమ్స్, ఫ్రేజెస్‌లపై పట్టు సాధించాలి.

ఒకే సమయంలో రెండు పోస్ట్‌లకు

ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్‌లను పరిశీలిస్తే.. ఒకే సమయంలో రెండు శాఖల్లోని పోస్ట్‌లకు సన్నద్ధమయ్యే అవకాశం ఉంది. రెండు శాఖల్లోని పోస్ట్‌లకు జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ పేపర్‌ ఉంది. ఈ పేపర్‌కు ఉమ్మడి ప్రిపరేషన్‌ సాగిస్తూ.. రెండో పేపర్‌కు ప్రత్యేక సమయం కేటాయించుకోవాలి. ఫలితంగా ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధత లభిస్తుంది. ఇలా సిలబస్‌ పరిశీలన నుంచి ప్రిపరేషన్‌ వరకు ప్రత్యేక వ్యూహంతో.. అడుగులు వేస్తే విజయం సొంతం చేసుకునే అవకాశం ఉంది.

చ‌ద‌వండి: APPSC Recruitment: 730 ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌... ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది...

Published date : 22 Jan 2022 01:37PM

Photo Stories