Skip to main content

నేటి నుంచి ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్లు: జనవరి 1న ఆప్షన్ల మార్పునకు అవకాశం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో కీలకమైన ఎంపీసీ స్ట్రీమ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం (నేటి) నుంచి ప్రారంభం కానుంది.
ఈ మేరకు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జనవరి 1న ఆప్షన్లను సవరించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 88,667 మంది అభ్యర్థులు ఎంసెట్ కౌన్సెలింగ్‌కు రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా రిజిస్టర్ కానివారికి కూడా ధ్రువపత్రాల పరిశీలనకు వీలు కల్పిస్తున్నారు. ఇలాంటివారు ఈనెల 28 నుంచి 31 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ల పరిశీలనలో పాల్గొనవచ్చు. అభ్యర్థుల సౌకర్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హెల్ప్‌లైన్ కేంద్రాలను జనవరి 1వ తేదీవరకు కొనసాగించాలని కన్వీనర్ నిర్ణయించారు. ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన దివ్యాంగులు, సైనికోద్యోగుల పిల్లల ధ్రువపత్రాల పరిశీలనను ఈనెల 29న విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీలో చేపట్టనున్నారు. రిజిస్టర్ అయి ఉన్న వారు మొబైల్ నంబరు మార్పు, లాగిన్ ఐడీ తదితర అంశాలపై హెల్ప్‌లైన్ కేంద్రాల సహకారం తీసుకోవచ్చు.

ఇతర సమాచారం కోసం
Must check:
AP EAMCET 2020 mock counselling/college predictor

అభ్యర్థులు ‘https://apeamcet.nic.in’ను చూడవచ్చు. వెబ్ ఆప్షన్ల నమోదులో సమస్యలు ఎదురైతే వాటిని నివృత్తి చేసేందుకు కమిషనరేట్‌లో మూడు హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు వాటికి ఫోన్‌చేసి తమ సందేహాలను పరిష్కరించుకోవచ్చు.

హైల్ప్‌లైన్ నంబర్లు: 8106876345, 8106575234, 7995681678
ఈమెయిల్ ఐడీ: ‘సీఓఎన్‌వీఈఎన్‌ఈఆర్‌ఏపీఈఏఎంసీఈటీ2020ఃజీమెయిల్.కామ్’ను మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.

జనవరి3న సీట్ల కేటాయింపు
జనవరి 1వ తేదీన అభ్యర్థులు తమ ఆప్షన్లలో పొరపాట్లు సవరించుకునే అవకాశం ఉంది. అనంతరం 3వ తేదీ సాయంత్రం అభ్యర్థులకు మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. ప్రభుత్వ, ప్రయివేటుకు సంబంధించి 257 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,29,016 సీట్లు, 120 ఫార్మసీ కాలేజీల్లో 10,675 బీఫార్మసీ సీట్లు, 62 కాలేజీల్లో 1,860 డీఫార్మా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవికాకుండా ఇంజనీరింగ్‌లో 82 కాలేజీలు, బీఫార్మసీలో 19 కాలేజీలు, డీఫార్మాలో 7 కాలేజీలు యూనివర్సిటీలకు వివిధ రుసుములు బకాయి ఉండడంతో వాటిలోని 35,347 ఇంజనీరింగ్, 1,660 బీఫార్మసీ సీట్లు, 210 డీఫార్మా సీట్లను ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. ఆ కాలేజీలనుంచి అఫిడవిట్లు తీసుకుని ఆ సీట్లను కూడా విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అవికూడా జత అయితే సీట్లసంఖ్య ఆ మేరకు పెరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ వర్సిటీల పరిధిలోని 18 ఇంజనీరింగ్ కాలేజీల్లో 5,212 సీట్లు, 9 బీఫార్మసీ కాలేజీల్లో 520 సీట్లు, 1 డీఫార్మసీ కాలేజీలో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవికాక మిగిలిన సీట్లు ప్రయివేటు కాలేజీలకు సంబంధించినవి.

ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు:

1,85,936

ఎంసెట్‌కు హాజరైన వారు:

1,56,953

క్వాలిఫై అయిన వారు:

1,33,072


ఆప్షన్ల నమోదు షెడ్యూల్

తేదీ

ర్యాంకు నుంచి

ర్యాంకు వరకు

డిసెంబర్ 28, 29

1

60,000

డిసెంబర్ 30, 31

60,001

చివరి వరకు

జనవరి 1

--

ఆప్షన్లలో సవరణ

జనవరి 3

-

సీట్ల కేటాయింపు


వర్సిటీల వారీగా అందుబాటులో ఉన్న వర్సిటీ, ప్రయివేటు సీట్లు మొత్తం

యూనివర్సిటీ

ఇంజనీరింగ్

బీఫార్మసీ

డీఫార్మా

ఏఎన్‌యూ

3,420

1,840

300

జేఎన్‌టీయూఏ

38,637

3,285

780

జేఎన్‌టీయూకే

81,757

3,360

480

ఏయూ

3,190

1,750

270

కేయూ

--

260

30

ఇతర వర్సిటీలు

2,012

180

--

మొత్తం

1,29,016

10,675

1,860


జనవరి 4 లేదా 5 నుంచి తరగతులు
ఈనెల 3వ తేదీ సాయంత్రానికి సీట్ల కేటాయింపు పూర్తిచేసి 4 లేదా 5వ తేదీనుంచి తరగతుల ప్రారంభించాలని సూచిస్తున్నాం. మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యాక రెండు, మూడో విడత సీట్ల కేటాయింపు చేస్తాం. ఎంపీసీ స్ట్రీమ్ సీట్ల కేటాయింపు పూర్తయ్యాక జనవరి 9 నుంచి బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ చేపడతాం. ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాం.
- ఎం.ఎం.నాయక్, అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్
Published date : 28 Dec 2020 02:34PM

Photo Stories