Skip to main content

Rajya Sabhaకు పీటీ ఉష, ఇళయరాజా, వీరేంద్ర హెగ్గడే, విజయేంద్ర ప్రసాద్‌

P.T. Usha, Ilaiyaraaja, Veerendra Heggade, Vijayendra Prasad nominated to Rajya Sabha
P.T. Usha, Ilaiyaraaja, Veerendra Heggade, Vijayendra Prasad nominated to Rajya Sabha

బాహుబల కథా రచయిత, దర్శకులు రాజమౌళి తండ్రి.. కోడూరి విశ్వ విజయేంద్రప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయనతో పాటు సంగీత దర్శకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, భారతదేశ తొలితరం మేటి అథ్లెట్లలో ఒకరైన పీటీ ఉష, ధర్మస్థల క్షేత్ర ధర్మాధికారి - ప్రముఖ సంఘ సేవకుడు వీరేంద్ర హెగ్గడేను కూడా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్ల కేంద్ర ప్రభుత్వం జూలై 6న ప్రకటించింది. ఈ నలుగురూ దక్షిణాదికి చెందినవారే కావడం గమనార్హం. విజయేంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కాగా... పీటీ ఉష కేరళ, ఇళయరాజా తమిళనాడు, వీరేంద్ర హెగ్గడే కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు.  

Also read: GK International Quiz: ప్రపంచంలోనే అతిపెద్ద గ్లాస్ బాటమ్ బ్రిడ్జిని ఏ దేశంలో ప్రారంభించారు?

చిరుత వేగం 
ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో ప్రపంచ వేదికలపై భారత్‌ సత్తా చాటిన అథ్లెట్‌ పీటీ ఉష. చిరుత కూడా చిన్నబోయే వేగం ఉష సొంతం. ట్రాక్‌పై ఆమె అడుగు పెట్టిందంటే పందెం కోడె! అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో ఉష ప్రతిభ ఎన్నో పతకాలను తెచ్చిపెట్టింది. అమ్మాయిలకు చదువెందుకనే ఆ రోజుల్లో ఆటల పోటీల్లోకి వెళ్లడమంటే సాహసం. అలాంటి పరిస్థితుల్లో ‘పయ్యోలి’అనే పల్లెటూరులో నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. ప్రపంచవేదికపై ‘పరుగుల రాణి’గా నిలిచింది. పతకాలతో ‘గోల్డెన్‌ గర్ల్‌’గా మారింది. ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌’గా ఎదిగింది. ఆమె పరుగు ఎందరో అమ్మాయిలకు ప్రేరణ. ఊరి పేరునే.. ఇంటిపేరుగా మార్చుకున్న పయ్యోలి తెవరపరంపిల్‌ ఉష (పీటీ ఉష) 1976 నుంచి 2000 వరకు రెండున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘంగా ‘పరుగు’ప్రయాణాన్ని కొనసాగించింది. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 4X400 మీటర్ల రిలే, 400 మీటర్ల హర్డిల్స్‌లో అలుపెరగని పరుగుతో దిగ్గజ అథ్లెట్‌గా ఎదిగింది. 25 ఏళ్ల కెరీర్‌లో జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో ఉష మొత్తం 102 పతకాలను గెలుచుకుంది. లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ (1984)లో 400 మీటర్ల హర్డిల్స్‌లో త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. కానీ అంతకుముందు... ఆ తర్వాత జరిగిన ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లలో ఎదురేలేని స్ప్రింటర్‌గా ఎదిగింది. ప్రత్యేకించి 1985 నుంచి 1989 వరకు కువైట్, జకార్తా, సియోల్, సింగపూర్, న్యూఢిల్లీల్లో జరిగిన ఆసియా పోటీల్లో ఆమె 16 స్వర్ణాలు (ఓవరాల్‌గా 18 బంగారు పతకాలను) సాధించింది. కెరీర్‌ తదనంతరం అకాడమీ నెలకొల్పి.. తన జీవితాన్నే భారత అథ్లెటిక్స్‌కి అంకితం చేసింది. ఆమె సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1984లో ‘అర్జున అవార్డు’తో పాటు ‘పద్మశ్రీ’పురస్కారాన్ని అందజేసింది. 58 ఏళ్ల ఉష తాజాగా రాజ్యసభకు నామినేట్‌ అయ్యింది. 

Also read: Army Recruitment: ఏఏ దేశాల్లో సైనిక నియామకాలు ఎలా ఉన్నాయంటే..?

సమాజ సేవే శ్వాసగా.. 
కర్ణాటకలోని ప్రఖ్యాత ధర్మస్థల ఆలయ ధర్మాధికారిగా సేవలందిస్తూ సామాజిక సేవా రంగంలోనూ విశేషమైన పేరు ప్రఖ్యాతలు ఆర్జించిన డాక్టర్‌ వీరేంద్ర హెగ్గడేను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. ఆయన 1948 నవంబర్‌ 25న దక్షిణ కన్నడ జిల్లాలోని బంట్వల్ లో జన్మించారు. తల్లిదండ్రులు రత్నమ్మ, రత్నవర్మ హెగ్గడే. వీరేంద్ర హెగ్గడేకు భార్య హేమావతి హెగ్గడే, కుమార్తె శ్రద్ధ హెగ్గడే ఉన్నారు. విద్యాభ్యాసం అనంతరం కేవలం 20 ఏళ్ల వయసులో 1968 అక్టోబర్‌ 24న ధర్మస్థల ఆలయ ధర్మాధికారిగా(పాలకుడు) బాధ్యతలు స్వీకరించారు. గత ఐదు దశాబ్దాలుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. గ్రామీణాభివృద్ధి, ప్రజల స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలు ప్రారంభించారు. రూరల్‌ డెవలప్‌మెంట్, సెల్ఫ్‌–ఎంప్లాయ్‌మెంట్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఆర్‌డీఎస్‌ఈటీఐ)ని నెలకొల్పారు. ఈ సంస్థ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పిస్తున్నారు. వారికి తగిన శిక్షణ అందిస్తున్నారు. అలాగే కర్ణాటకలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా శ్రీక్షేత్ర ధర్మస్థల రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింద 6 లక్షలకుపైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తున్నాయి. 49 లక్షల మందికిపైగా సభ్యులు ఉన్నారు. అంతేకాకుండా శ్రీధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్‌ ట్రస్టును డాక్టర్‌ హెగ్గడే నెలకొల్పారు. 25కు పైగా పాఠశాలలు, కళాశాలల ద్వారా నాణ్యమైన విద్యనందిస్తున్నారు. హెగ్గడేకు ధర్మరత్న, ధర్మభూషణ అనే పేర్లు కూడా ఉన్నాయి. లక్షలాది మందికి ఆరాధ్యుడిగా కొనసాగుతున్నారు.    

Also read: GK Sports Quiz: 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రంలో జరగనున్నాయి?

పాటల ‘పెద్ద’రాజా
‘పచ్చని చేల పావడ గట్టి...కొండమల్లెలే కొప్పున బెట్టి.. వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని..’వంటి అత్యద్భుత గీతానికి అంతే అద్భుతంగా బాణీలు సమకూర్చి పాటకు అమృతత్వాన్ని సాధించిపెట్టారు ఇళయరాజా. ఇలాంటి పాటలెన్నో ఆయన పాటల పూదోటలో అలా వినిపిస్తూనేఉంటాయి. అయితే ఈ పాటలోని ‘పచ్చని చేల’కు ఇళయరాజా జీవితానికి మధ్య సంబంధం ఎంతో బలమైంది. ఇళయరాజాకు పాటపై మక్కువ ఏర్పడింది, ఆయన్ను సంగీతం వైపు అడుగులేయించింది ఈ పచ్చని చేలల్లో రైతులు, కూలీలు పాడే పాటలే. 1943 జూన్‌ 3న తమిళనాడులోని మధురైలో గల పన్నైపురమ్‌లో రామస్వామి, చిన్నతాయమ్మాళ్‌ దంపతులకు మూడవ సంతానంగా జ్ఞాన దేశిగన్‌ (ఇళయరాజా) జన్మించారు. స్కూల్లో చేర్చేటప్పుడు ‘రాసయ్యా’అని మార్చారు. 14వ ఏటనే ఇళయరాజాకి సంగీతం పట్ల మక్కువ ఏర్పడింది. దాంతో సోదరుడు పావలార్‌ వరదరాజన్‌ నిర్వహించే సంగీత బృందంతో ఊరూరూ తిరుగుతూ కచేరీలు ఇచ్చేవారు. ఆ సమయంలోనే భారతదేశపు తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు నివాళిగా తమిళ కవి కన్నదాసన్‌ రాసిన పాటకు బాణీ కట్టారు. తీవ్ర వేదనతో సాగే ఈ పాట ఎంతోమంది మనసుల్ని కదిలించింది. 1968లో మద్రాసులో ధన్‌రాజ్‌ మాస్టర్‌ వద్ద సంగీతం అభ్యసించారు. ధన్‌రాజ్‌ మాస్టర్‌ రాసయ్యా పేరుని ‘రాజా’గా మార్చారు. సంగీత కచేరీల్లో పాల్గొంటూ మరోవైపు పశ్చిమ బెంగాల్‌కి చెందిన సలీల్‌ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా, కీ బోర్డు కళాకారుడిగా చేశారు ఇళయరాజా. కన్నడ సంగీత దర్శకుడు జీకే వెంకటేష్‌ దగ్గర దాదాపు 200 సినిమాలకు (చాలావరకు కన్నడ చిత్రాలే) సహాయకుడిగా చేశారు. ఇక తమిళ చిత్రం ‘అన్నక్కిళి’తో (1976)తో పూర్తిస్థాయి సంగీతదర్శకుడిగా మారారు. ‘అన్నక్కిళి’నిర్మాత పంజు అరుణాచలం రాజాకి ‘ఇళయ’(యంగ్‌ అని అర్థం) అని చేర్చి ‘ఇళయరాజా’గా మార్చారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, మరాఠీ, ఇంగ్లిష్‌ భాషల్లో దాదాపు 1,500 చిత్రాలకు 7 వేల పాటలకు పైగా స్వరపరిచారు ఇళయరాజా. 2010లో భారత ప్రభుత్వం ఇళయరాజాను ‘పద్మభూషణ్‌‘, 2018లో ‘పద్మ విభూషణ్‌‘పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వాలు సత్కరించాయి. ‘సాగర సంగమం’, ‘రుద్రవీణ’, తమిళ చిత్రం ‘సింధుభైరవి’, మలయాళ ‘పళసి రాజా’చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్నారు.   

Also read: Indian Economy Notes for Group 1&2: ఆర్థిక సర్వే 2021–22

‘కథ’ల బాహుబలి
రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ ఎంపీగా నామినేట్‌ అయిన ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు వి.విజయేంద్ర ప్రసాద్‌ ఆంధ్రప్రదేశ్ లోని  తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరులో 1942 మే 27న జన్మించారు. ఆయన పూర్తిపేరు కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్‌. కొవ్వూరు, ఏలూరు, విశాఖపట్ణణంలో చదువుకున్న విజయేంద్ర ప్రసాద్‌ తన అన్నయ్యతో కలసి విశాఖపట్టణంలో కాంట్రాక్ట్‌ పనులు చేసేవారు. అక్కడే రాజనందినిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత చెన్నైలో ఉన్న తన దగ్గరి బంధువు, అన్నయ్య అయిన పాటల రచయిత శివశక్తి దత్తా (సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి) వద్దకు చేరారు. దర్శకుడు రాఘవేంద్రరావు వద్ద విజయేంద్ర ప్రసాద్‌ని అసిస్టెంట్‌ రైటర్‌గా చేర్పించారు శివశక్తి దత్తా. మూడేళ్లు అసిస్టెంట్‌ రైటర్‌గా చేసిన ఆయన శివశక్తి దత్తాతో కలిసి ‘జానకి రాముడు’సినిమాకి తొలిసారి కథ రాశారు. ‘బంగారు కుటుంబం’, ‘బొబ్బిలి సింహం’సినిమాలకు కథలు రాశారు. ‘బొబ్బిలి సింహం’చిత్రం తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాలకు కథలు అందించారు. ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌’చిత్రాలకు కథలు అందించారు. 1996లో అన్నయ్య శివశక్తి దత్తాతో కలిసి ‘అర్ధాంగి’, ‘శ్రీకృష్ణ 2006, రాజన్న, శ్రీవల్లీ’చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘రాజన్న’చిత్రానికి బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో నంది అవార్డు అందుకున్నారు. హిందీ ‘బజరంగీ భాయీజాన్‌’సినిమాకి బెస్ట్‌ స్టోరీ విభాగంలో ‘ఫిల్‌్మఫేర్‌’తో పాటు, ‘ది ఐకానిక్‌ ట్రేడ్‌ అచీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2015’, ‘సోనీ గిల్డ్‌ 2016’అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ సతీమణి రాజనందిని 2012 అక్టోబర్‌ 21న మరణించారు. ఆయనకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు.

Also read: రాష్ట్రంలోని గ్రామాలలో 58 వేలకు పైగా ప్రదేశాలలో ఉచిత Wi-Fi సౌకర్యాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది?

Published date : 08 Jul 2022 06:34PM

Photo Stories