National Education Policy (NEP): జాతీయ విద్యా విధానంలో అన్ని భాషలకు ప్రోత్సాహం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
![National Education Policy Implementation Review 2022](/sites/default/files/images/2022/05/27/modichennai-1653644874.jpg)
సాక్షి, చెన్నై: అన్ని భారతీయ భాషలకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా జాతీయ విద్యా విధానంలో వాటికి ప్రాధాన్యత పెంచామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రధాన నగరాల్లో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో రూ.31,530 కోట్లతో పూర్తిచేసిన కొన్ని ప్రాజెక్టులు, చేపట్టనున్న మరికొన్ని ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. తాంబరం–చెంగల్పట్టు మధ్య పూర్తయిన 3వ రైలుమార్గం, మధురై–తేని మధ్య రైలుమార్గం, ప్రత్యేక రైలు సేవల్ని సైతం ప్రారంభించారు. ఎన్నూర్–చెంగల్పట్టు, తిరువళ్లూరు– బెంగళూరు మధ్య నేచురల్ గ్యాస్ పైప్లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రసంగించారు.
నవ భారత్ను నిర్మించుకుందాం..
జాతీయ విద్యా విధానం ప్రకారం సాంకేతిక, వైద్య విద్యలను స్థానిక భాషల్లో చదువుకునే అవకాశం కల్పించామని ప్రధాని మోదీ చెప్పారు. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రగతికి దోహదపడతాయని వివరించారు. చెన్నైలో ఏర్పాటు చేస్తున్నట్లుగానే ఇతర నగరాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పిల్లలకు గొప్ప జీవితాన్ని అందించాలని తల్లిదండ్రులు ఆశ పడతారని చెప్పారు. ఆ దిశగానే జాతీయ విద్యా విధానం తీసుకొచ్చామని ఉద్ఘాటించారు.
ప్రతి గ్రామానికి వేగవంతమైన ఇంటర్నెట్ తమ విజన్గా పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను ఆదుకునేందుకు సహకారం అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, సీఎం స్టాలిన్తోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, కేంద్ర రహదారుల శాఖ మంత్రి గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
- Limassol International: హర్డిల్స్లో సరికొత్త రికార్డు నెలకొల్పిన క్రీడాకారిణి?