Skip to main content

Acharya Vinoba Bhave: వినోబా భావేకు నామ‌క‌ర‌ణం చేసిన గాంధీజీ

వినోబా భావే పాత్ర భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. వినోబా భావే స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితుడని చెబుతారు.
Acharya Vinoba Bhave, Mahatma Gandhi
Acharya Vinoba Bhave

అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూనే, దేశానికి సేవ చేయాలనే తన సంకల్పాన్ని నిరంతరం కొనసాగించారు. గాంధీజీని కలిసిన తర్వాత తన జీవిత లక్ష్యాలను వినోబా భావే అంకితభావంతో ఎలా సాగించాడో అతని జీవిత ప్రయాణం చెబుతుంది. గాంధీజీ మరణానంతరం మహాత్ముని జీవన విధానాలను సజీవంగా నిలిపివుంచి, దేశ సేవను కొనసాగించిన వారిలో ఆయన ఒకరు.

భగవంతునిపై నమ్మకం, ఆధ్యాత్మికతపై ప్రేమ 

వినోబా భావే 1895 సెప్టెంబర్ 11న మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలోని గగోడా గ్రామంలో జన్మించారు. చిత్పావ్ బ్రాహ్మణ నరహరి భావే, రుక్మణి బాయిల ఐదుగురు పిల్లలలో వినోబా పెద్దవాడు. వినోబా చిన్నప్పటి నుంచి తెలివైన పిల్లాడిగా గుర్తింపు పొందారు. తల్లి సాంగత్యంలో ఆయనకు మొదటి నుంచీ భగవంతునిపై నమ్మకం, ఆధ్యాత్మికతపై ప్రేమ ఏ‍ర్పడింది. తార్కిక ఆలోచనలు కలిగిన వినోబా తన తండ్రి నుండి గణితం, సైన్స్ నేర్చుకున్నారు.

తండ్రి చెప్పారని ఫ్రెంచ్‌, తల్లి కోరిక మేరకు సంస్కృతం.. 

వినోబా హైస్కూల్‌కు చేరుకున్న తర్వాత అతని తండ్రి వినాయక్ ఫ్రెంచ్ నేర్చుకోవాలని కోరగా, అతని తల్లి సంస్కృతం నేర్చుకోవాలని కోరింది. వినాయక్ హైస్కూల్‌లో ఫ్రెంచ్‌ను ఎంచుకున్నారు. తల్లి కోరిక మేరకు ఇంట్లో సంస్కృతం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. వినాయక్‌కు చదువుపై ఉన్న ఆసక్తి కారణంగా మతపరమైన పుస్తకాలు చదివేవారు. ఫ్రెంచ్ సాహిత్యంతో పాటు వేదాలు, ఉపనిషత్తులు కూడా శ్రద్ధగా చదివారు. ఈ నేపధ్యంలో వినోబా ఆధ్యాత్మిక ఆకలి పెరుగుతూ వచ్చింది. అతను తన జీవిత లక్ష్యాలపై మరింత లోతుగా ఆలోచించేవారు.

కాశీలో రైలు దిగిపోయి..

ఆ రోజుల్లో వినోబా చదువుకోసం ముంబై వెళ్లాల్సి వచ్చింది. 1916 మార్చి 25న ముంబై వెళ్లేందుకు రైలు ఎక్కారు. అయితే అక్కడ చదువు పూర్తయ్యాక ఏం చేయాలి? తన జీవిత లక్ష్యం ఏమిటి? ఏం చేయాలి అనే ప్రశ్నలు మనసులో కలకలం రేపాయి. ఇంతలో వినోబా ‍ప్రయాణిస్తున్న రైలు సూరత్ చేరుకుంది. ఆయన అక్కడ రైలు దిగి, హిమాలయాలవైపు పయనమయ్యేందుకు తూర్పు వైపునకు వెళ్లే రైలులో కూర్చున్నారు. అయితే కాశీలో రైలు దిగిపోయాడు. శివుని నివాసమైన కాశీలో తనకు సరైన మార్గాన్ని చూపించగల ఋషులు, సాధువులను కలుసుకోవచ్చని భావించారు. గంగా తీరంలో చాలా కాలం పాటు తిరిగారు. అ‍క్కడ తాను ఆశించినది దొరకకపోవడంతో హిమాలయాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

వినోబా స్వయంగా గాంధీజీకి లేఖ రాయగా...

ఆ సమయంలో యాదృచ్ఛికంగా హిందూ విశ్వవిద్యాలయంలో ఒక సదస్సు జరుగుతోంది. దీనిలో గాంధీజీ ధనవంతులకు ఒక విజ్ఞప్తి చేశారు. వారు తమ సంపదను పేదల సేవకు వినియోగించాలని కోరారు. అ అంశంపై జరిగిన చర్చ మరుసటి రోజు దినపత్రికల్లో ప్రచురితమైంది. వినోబాకు ఈ వార్తాపత్రిక కనిపించింది. అందులో గాంధీజీ గురించి చదివిన తర్వాత, గాంధీజీ మాత్రమే తనకు సరైన మార్గాన్ని చూపగలరని వినోబా  భావించారు. దీంతో వినోబా స్వయంగా గాంధీజీకి లేఖ రాయగా, గాంధీజీ దానికి సమాధానమిస్తూ ఆహ్వానం పంపారు. ఈ మేరకు వినోబా.. గాంధీజీ ఆశ్రమం ఉన్న అహ్మదాబాద్‌కు బయలుదేరారు. వారిద్దరూ 1916 జూన్ 7న తొలిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరికొకరు సన్నిహితులయ్యారు. గాంధీజీ అతనికి వినోబా అని పేరు పెట్టారు. అంతకు ముందు అతని పేరు(వినాయక్ నరహరి భావే). గాంధీజీని కలిసినది మొదలు వినోబా గాంధేయవాదిగా మారారు. అదే బాటలో జీవితాన్ని కొనసాగించారు. 

Published date : 13 Sep 2023 01:20PM

Photo Stories