Skip to main content

Cyber Weapon: పెగసస్‌ స్పైవేర్‌పై కథనం ప్రచురించిన అమెరికన్‌ పత్రిక?

Pegasus

భారత్‌లో 2021 ఏడాది ప్రకంపనలు సృష్టించిన పెగసస్‌ స్పైవేర్‌ను 2017లో ఇజ్రాయెల్‌ నుంచి స్వయంగా భారత ప్రభుత్వమే కొనుగోలు చేసిందని అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. రక్షణ ఒప్పందంలో భాగంగా అత్యంత ఆధునిక ఆయుధాలు, క్షిపణి వ్యవస్థతో పాటు పెగసస్‌ స్పైవేర్‌ని భారత్‌ కొనుగోలు చేసిందని ‘‘ది బ్యాటిల్‌ ఫర్‌ ది వరల్డ్స్‌ మోస్ట్‌ పవర్‌ఫుల్‌ సైబర్‌వెపన్‌’’ పేరుతో ప్రచురించిన ఆ కథనం ఆరోపించింది. 200 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందంలో (రూ.15 వేల కోట్లు) భాగంగా పెగసస్‌ను కూడా కొనుగోలు చేసినట్టు పేర్కొంది. ఏడాది పాటు పరిశోధన చేసి, ఎన్నో దేశాలకు చెందిన ప్రభుత్వ, ఇంటెలిజెన్స్‌ అధికారుల, సైబర్‌ నిపుణుల్ని ఇంటర్వ్యూలు చేసి ఈ విషయాన్ని రూఢి చేసుకున్నామని వెల్లడించింది.

కథనంలోని ముఖ్యాంశాలు..

  • ఇజ్రాయెల్‌కు చెందిన భద్రతా సంస్థ ఎన్‌ఎస్‌ఒఓ గ్రూప్‌ గత దశాబ్దాకాలంగా పెగసస్‌ స్పైవేర్‌ నిఘా వ్యవస్థని ప్రపంచ దేశాలకు విక్రయిస్తోంది.
  • భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2017 జులైలో ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లినప్పుడు పెగసస్‌ స్పైవేర్‌పై ఒప్పందం కుదిరింది. ఒక భారత ప్రధాని ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లడం అదే తొలిసారి.
  • అమెరికాకు చెందిన ఎఫ్‌బిఐ కూడా పెగసస్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేసినప్పటికీ దానిని ఎవరి మీద వినియోగించకూడదని నిర్ణయించింది. 
  • 2011లో ఇజ్రాయెల్‌ ప్రపంచ మార్కెట్‌లో పెగసస్‌ని ప్రవేశపెట్టిన తర్వాత పలు యూరప్‌ దేశాలు ఉగ్రవాదుల ఉనికి కనిపెట్టడానికి దీనిని వినియోగించాయి.
  • ఉగ్రవాదులు, కరడుగట్టిన నేరస్తులు దగ్గర అత్యంత ఆధునికమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ఉన్నాయి. వాటిని డీక్రిప్ట్‌ (డీకోడ్‌) చేయగలిగే సామర్థ్యం పెగసస్‌కి ఉండటంతో విధ్వంసకారుల గుట్లు తెలిసేవి. కానీ దీనిని కొనుగోలు చేసిన దేశాలు హక్కుల సంఘాలపై కూడా ప్రయోగించాయి.

వివాదం ఇదే..

భారత్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ సహా  విపక్ష నాయకులు, ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, మానవ హక్కుల సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్‌ చేయడానికి ఈ పెగసస్‌ స్పైవేర్‌ని కేంద్ర ప్రభుత్వం ప్రయోగించినట్టుగా 2021, జులైలో ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. భారత్‌తో పాటు మరికొన్ని దేశ ప్రభుత్వాలు ఈ నిఘా వ్యవస్థని వాడినట్టుగా ఆరోపణలు రావడంతో సమాజంలో వివిధ వర్గాల గోప్యత ప్రశ్నార్థకంగా మారింది.
చ‌ద‌వండి: అత్యంత వయసైన అక్వేరియం చేప పేరు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
పెగసస్‌ స్పైవేర్‌పై ‘‘ది బ్యాటిల్‌ ఫర్‌ ది వరల్డ్స్‌ మోస్ట్‌ పవర్‌ఫుల్‌ సైబర్‌వెపన్‌’’ పేరుతో కథనం ప్రచురించిన అమెరికన్‌ పత్రిక? 
ఎప్పుడు : జనవరి 29
ఎవరు    : న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక
ఎందుకు : పెగసస్‌ స్పైవేర్‌కు సంబంధించి పలు కీలక అంశాలను వెలుగులోకి తెచ్చేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 31 Jan 2022 12:21PM

Photo Stories