Ukrainian girl: పుస్తకంగా 12 ఏళ్ల ఉక్రెయిన్ బాలిక వలస గాథ
యుద్ధంతో శిథిలావస్థకు చేరిన ఉక్రెయిన్ నుంచి ఇప్పటికే 70 లక్షలకు పైగా పౌరులు వలస బాట పట్టడం తెలిసిందే. అలా కుటుంబంతో పాటు ఖర్కీవ్ నుంచి డబ్లిన్ వలస వెళ్లిన యెవా స్కలెట్స్కా అనే 12 ఏళ్ల బాలిక తన భయానక అనుభవాలను గ్రంథస్థం చేయనుంది. వాటిని ‘యూ డోంట్ నో వాట్ వార్ ఈజ్: ద డైరీ ఆఫ్ అ యంగ్ గాళ్ ఫ్రం ఉక్రెయిన్’ పేరిట పుస్తకంగా ప్రచురించేందుకు హారీపోటర్ సిరీస్ ప్రచురణకర్త బ్లూమ్స్బరీ ముందుకొచ్చింది. అక్టోబర్ కల్లా పుస్తకాన్ని విడుదల చేస్తామని ప్రకటించింది. యెవా ఖర్కీవ్ లో తన నానమ్మతో కలిసి ఉండేది. ఫిబ్రవరి 24న భారీ బాంబుల మోతతో మేల్కొన్నది మొదలు ఆమె జీవితం మారిపోయింది. బాంబులు, క్షిపణుల దాడి నుంచి తప్పించుకునేందుకు వారు షెల్టర్లలో తలదాచుకున్నారు. పరిస్థితి విషమిస్తుండటంతో వారిద్దరూ వలస బాట పట్టారు. అక్కడ ఇంగ్లండ్ జర్నలిస్టుల బృందాన్ని యెవా కలిసింది. తన అనుభవాలతో ఏ రోజుకా రోజు ఆమె రాసుకున్న డైరీ చూసి ఆ రాతల్లో లోతు, వయసుకు మించిన పరిపక్వతకు వాళ్లు ఆశ్చర్యపోయారు. ఇదంతా ఇప్పుడు పుస్తక రూపంలో రానుంది. పుస్తక ప్రచురణ హక్కులు 12 భాషల్లో అమ్ముడయ్యాయట.
Also read: BRICS: సార్వభౌమత్వాన్ని గౌరవించుకుందాం - బ్రిక్స్ శిఖరాగ్ర భేటీ తీర్మానం