ADMP: తెలంగాణ వ్యవసాయ డేటా నిర్వహణ విధానం - 2022
రాష్ట్రంలోని రైతుల హక్కులను పరిరక్షిస్తూనే వ్యవసాయ రంగం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ డేటా నిర్వహణ విధానం –2022 (ADMP –2022) ముసాయిదాను జూలై 8న విడుదల చేసింది. రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది రైతులు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. జీఎస్డీపీలో సుమారు 15 శాతం మేర వ్యవసాయ రంగం నుంచే సమకూరుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని (డేటా) సమర్ధవంతంగా వినిగించుకునేందుకు ప్రపంచ ఆర్థిక వేదిక భాగస్వామ్యంతో రాష్ట్ర ఐటీ శాఖ అనుబంధ విభాగం ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఈ పాలసీని రూపొందించింది. ముసాయిదాలోని అంశాలపై వ్యక్తులు లేదా సంస్థలు తమ సూచనలు, ఆక్షేపణలు ఈ నెల 6వ తేదీలోగా నిర్ణీత ఫార్మాట్లో సమర్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచించింది.
also read: AWS Learning Plan
డేటా వనరులే అత్యంత కీలకం
సాగునీటి వసతుల కల్పన, రైతులకు ఇన్పుట్ సబ్సిటీ, కొత్త రకాల పంటల సాగును ప్రోత్సహించడం వంటి బహుముఖ విధానాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా కృత్రిమ మేథస్సు (ఏఐ), మెషీన్ లెర్నింగ్, డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు వంటి ఆధునిక టెక్నాలజీ ద్వారా డిజిటల్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. వ్యవసాయ రంగంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగి రైతులకు వ్యవసాయం లాభదాయకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త టెక్నాలజీ వినియోగంలో వ్యవసాయంతో పాటు అనుబంధ విభాగాలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం కీలకం. ఈ నేపథ్యంలో వివిధ విభాగాల నుంచి సమాచారాన్ని సేకరించడం, క్రోడీకరించడం, ఇతరులకు పంపిణీ చేయడం, డేటాను వినియోగానికి వీలుగా మార్చడం తదితరాల కోసం ఏడీఎంపీ 2022 దోహద పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
also read: 9 Habits of Profoundly Influential...
వ్యవసాయ శాఖ కమిషనర్ నేతృత్వంలో కమిటీ
వ్యవసాయ, అనుబంధ రంగాల సమాచారం సేకరణ, క్రోడీకరణ, పంపిణీ తదితరాల కోసం అధికారుల అంతర్గత కమిటీ (ఐడీసీ) ఏర్పాటు చేస్తారు. వ్యవసాయ శాఖ కమిషనర్ అధ్యక్షుడిగా వ్యవహరించే ఈ కమిటీలో నీటిపారుదల, ప్రణాళిక, వ్యవసాయ, సహకారం, భూ పరిపాలన, స్టేట్ రిమోట్ అప్లికేషన్ సెంటర్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు.
also read: Top 10 Indian Colleges in The World 2023
సమాచారం..సేవలు
ఈ పాలసీ ద్వారా వ్యవసాయ పరపతి, బీమా, వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు, నీటి నిర్వహణ, తెగుళ్లు, వాటి నివారణ, పంట దిగుబడి, భూ రికార్డులు, భూమి హద్దులు, భూసారం, వాతావరణం, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, మార్కెటింగ్కు సంబంధించిన సమాచారం అందరికీ అందుబాటులోకి వస్తుంది. రైతులకు రుణాలు అందేలా చూడటం, పంటలు, వ్యవసాయ యంత్రాలకు బీమా వర్తింపు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, కోల్డ్ స్టోరేజీ వసతులు, డిజిటల్ మార్కెట్ల ద్వారా విక్రయాలు, ఎలక్ట్రానిక్ లావాదేవీలు వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. వ్యవసాయ పరిశోధనలు, ఆధునిక టెక్నాలజీ ద్వారా కొత్త ఆవిష్కరణలు, వ్యవసాయ విద్యకు అవసరమైన డేటా తదితరాలు ఈ పాలసీ ద్వారా సాధ్యమవుతాయి.
Also read: Telangana History Important Bitbank