Skip to main content

Good News: పీఆర్సీపై సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ప్రకటన..గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల‌కు మాత్రం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు శుభవార్త చెప్పారు.
AP CM YS Jagan
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఫిట్‌మెంట్‌ని 23శాతంగా ప్రకటించారు. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ సీఎం జగన్ కీల‌క నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లించనున్నారు. పీఆర్సీ జూలై 1, 2018 నుంచి అమలు కానుంది. మానిటరీ బెనిఫిట్‌ ఏప్రిల్‌ 1, 2020 నుంచి అమలు కానుంది. సీపీఎస్‌పై జూన్‌ 30లోగా నిర్ణయం తీసుకోనున్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.10,247కోట్ల అదనపు భారం పడనుంది. 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల‌కు మాత్రం..
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్‌ 30లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్‌ ప్రక్రియను పూర్తిచేసి, సవరించిన విధంగా రెగ్యులర్‌ జీతాలను (న్యూ పేస్కేలు) ఈ ఏడాది జులై జీతం నుంచి ఇవ్వనున్నారు. సొంతిల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేస్తున్న జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌లో – ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10శాతం ప్లాట్లను రిజర్వ్‌చేయడమే కాకుండా 20శాతం రిబేటును ఇవ్వాలని నిర్ణయించాం. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటాం. ఉద్యోగులు ఎవ్వరికీ కూడా ఇంటిస్థలం లేదనే మాట లేకుండా చూస్తాం. ఆ రిబేటును కూడా ప్రభుత్వం భరిస్తుంది.

ముఖ్యాంశాలు..
►నిన్నటి సమావేశం తర్వాత నా కుటుంబ సభ్యులైన ఉద్యోగుల ప్రతినిధులుగా మీరు చెప్పిన అన్ని అంశాలపైనా నిన్ననే సుదీర్ఘంగా కూర్చొని అధికారులతో చర్చించాను. ఈ రోజు ఉదయం కూడా మరోవిడత అధికారులతో మాట్లాడాను. నిన్న నేను 2–3 రోజుల్లో ప్రకటిస్తానని చెప్పాను. కానీ నిర్ణయాన్ని ఎంత వీలైతే అంత త్వరగా చెప్తే మంచిదని భావించి ఈ మేరకు ఉదయం కూడా సమావేశం పెట్టాను. 
►రాష్ట్ర విభజన వల్ల ఏర్పడ్డ సంక్లిష్ట సమస్యలు, కోవిడ్‌ కారణంగా తలెత్తిన ప్రతికూల పరిస్థితులు, దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఒమిక్రాన్‌ ఎలాంటి ప్రభావం చూపబోతుందనే పరిస్థితుల మధ్య మనం ఉన్నామని, నిన్ననే చెప్పడం జరిగింది. పలు దఫాలుగా చర్చలు జరిపాను. నిన్న ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు.
►చీఫ్‌ సెక్రటరీ గారి కమిటీ ఇచ్చిన నివేదికలో పేర్కొన్న ప్రకారం కంటే,  14.29 కంటే ఎంత మాత్రం కూడా ఇచ్చే పరిస్థితిలేదనే విషయాన్ని పదేపదే ఆర్థికశాఖ అధికారులు పలుదఫాలుగా చెప్పారు. మన ఆకాంక్షలు కూడా కాస్త తగ్గాలని కోరాను. అదే సమయంలో ఉద్యోగుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకోవాలని సీఎస్‌కి, ఆర్థికశాఖ కార్యదర్శికి చాలా సుదీర్ఘంగా చెప్పాను. 
►నేను వారికి ఒకటే చెప్పాను. ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు ఒక భాగం, సంక్షేమం, అభివృద్ధి సంతృప్తికరంగా అందాలంటే.. ఉద్యోగుల సహాయ సహకారాలతోనే సాధ్యం. అది లేకపోతే సాధ్యంకాదు. మా కుటుంబ సభ్యులుగానే మిమ్మల్ని అందర్నీ భావిస్తాను. ఇది మీ ప్రభుత్వం. ఈ భరోసా ఎప్పటికీ ఉండాలన్నదే నా భావనకూడా. 
►నిన్న పీఆర్సీతో కూడా కొన్ని కొన్ని అంశాలు మీరు లేవనెత్తారు. వాటిని కూడా పరిష్కరించే దిశగా సీఎస్‌తో, ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడాను. స్పష్టమైన టైమ్‌లైన్స్‌పైన కూడా మాట్లాడాను. 
►కోవిడ్‌ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నాం. జూన్‌ 30 లోగా ఈనియామకాలన్నీ పూర్తి చేయాలని అధికారులకు తక్షణ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ అందరి సమక్షంలో సీఎస్‌గారికి మళ్లీ చెప్తున్నాను.
►ఈహెచ్‌ఎస్‌ – ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీంకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి చీఫ్‌ సెక్రటరీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. 2 వారాల్లో సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చాను. ఈ కమిటీ ఉద్యోగుల ప్రతినిధులతో మాట్లాడి, వారి సూచనలు, సలహాల ప్రకారం మంచి పాలసీ వస్తుంది. 
►సొంత ఇల్లులేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధిచేస్తున్న జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌లో ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10శాతం ప్లాట్లను రిజర్వ్‌చేయడమే కాకుండా 20శాతం రిబేటును ఇవ్వాలని నిర్ణయించాం. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటాం. ఉద్యోగులు ఎవ్వరికీ కూడా ఇంటిస్థలం లేదనే మాట లేకుండా చూస్తాం. ఆ రిబేటును కూడా ప్రభుత్వం భరిస్తుంది.
►ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ బకాయిలు, పీఎఫ్,  జీఎల్‌ఐ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ తదితరాలన్నీ కూడా ఏప్రిల్‌నాటికి పూర్తిగా చెల్లించాలని ఆదేశించాను. 
►నిన్నమీతో చెప్పిన విధంగా, పీఆర్సీ అమలు చేసేనాటికి పెండింగ్‌ డీఏలు ఉండకూడదని స్పష్టంగా చెప్పినమీదట, పెండింగులో ఉన్న అన్ని డీఏలను ఒకేసారి జనవరి జీతంతో కలిపి ఇవ్వాలని ఆదేశించాను. 
►సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబరు నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ఉద్యోగుల ఆకాంక్షల మేరకు 10 నెలల ముందే, అంటే జనవరి 1, 2022 నుంచే, అంటే ఈనెల నుంచే పీఆర్సీని అమలు చేసి, దాని ప్రకారం జీతాలు ఈనెలనుంచే ఇవ్వాలని ఆదేశించాను. 
►కొత్త స్కేల్స్‌ను, రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకూడా మేలు చేయాలనే ఉద్దేశంతో వారికి కూడా 2022 జనవరి 1 నుంచే, జనవరి జీతాలతోనే అమలు చేయాలని నిర్ణయించాం. 
►సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబరు నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం మానిటరీ బెనిఫిట్స్‌ ఇవ్వాలని చెప్పినప్పటికీ, మీ అందరి ప్రభుత్వంగా, 2020 ఏప్రిల్‌ నుంచే, అంటే 21 నెలల ముందునుంచే మానిటరీ బెనిఫిట్స్‌ ఇవ్వాలని నిర్ణయించాం.
►కేంద్రం ప్రభుత్వం విస్తృత ప్రాతిపదికను తీసుకుని, డైవర్స్‌ క్రైటీరియా తీసుకుని సైంటిఫిక్‌ పద్ధతుల్లో ఒక వ్యక్తికాకుండా, ఏకంగా కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా సెంట్రల్‌ పే రివిజన్‌ కమిషన్‌ ప్రతిపాదనలనే యథాతథంగా తీసుకుని ఇప్పటికే అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇక నుంచి ఈ పద్ధతిలోనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పయనించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
►ఇక ఫిట్‌మెంట్‌ విషయానికొస్తే.. సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 14.29శాతం మించి ఫిట్‌మెంట్‌ ఇవ్వలేమని. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను, సమస్యలను అన్నికోణాల్లో క్షుణ్నంగా అధ్యయనం చేసి ఒక వాస్తవికమైన ఫిగర్‌ను వారు చెప్పినప్పటికీ అటు ఉద్యోగుల ఆకాంక్షలను, ఇటు రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని, ఉద్యోగులకు వీలైనంత మంచి చేయాలన్న తపన, తాపత్రయంతో ఫిట్‌మెంట్‌ను 23శాతంగా నిర్ణయించాం. అధికారుల కమిటీ చెప్పిన 14.29శాతం కన్నా దాదాపు 9శాతం పెంచి ఫిట్‌మెంట్‌ ఇస్తున్నామని ఉద్యోగ సోదరులకు సవినయంగా అర్థం చేసుకోవాలని  మనవి చేసుకుంటున్నాను.
►ఈ పీఆర్సీ అమలు 01–07–2018 నుంచి, మానిటరీ బెనిఫిట్‌ అమలు 01–04–2020 నుంచి, కొత్త జీతాలు 01–01–2022 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయాల వల్ల సంవత్సరానికి రూ. 10,247 కోట్లు రాష్ట్ర ప్రభుతానికి అదనపు భారం పడుతున్నప్పటికీ ఉద్యోగులకు మంచి చేయాలని, ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను.
►చివరగా మరో ముఖ్యమైన కీలక నిర్ణయం కూడా ప్రకటిస్తున్నాను. ప్రభుత్వోద్యోగులు అనే కన్నా మంచి చేయడానికి ఎల్లవేలలా ఉద్యోగులకు తోడుగా ఉంటూ, మీ అందరికీ భరోసా ఇస్తూ...మీరంతా సుదీర్ఘ కాలం ప్రజా సేవలో జీవితం గడపిన వ్యక్తులు. మీకు ఇంకా మంచి చేయడానికి, మీ అనుభవాన్ని ఈ రాష్ట్రానికి ఆస్తిగా భావించి, అన్నిరకాలుగా మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో, మీ సేవలన్ని మనం మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలన్న నిర్ణయంతో... వారి రిటైర్‌మెంట్‌ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతున్నాం అని... 1.1.2022 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని తెలియజేస్తున్నాను. 
►సీపీఎస్‌కు కూడా సంబంధించి టైంలైన్‌ పెట్టుకోవాలి. ఇప్పటికే కేబినెట్‌సబ్‌కెమిటీ వేశాం. జూన్‌ 30లోగా ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఉద్యోగులకు మేలు చేసే విషయంలో మనసుతో, గుండెతో స్పందించే ఈ నిర్ణయాలు ప్రకటిస్తున్నాను. దేవుడి ఆశీస్సులు, ప్రజలందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం మంచి పాలన అందించటంలో ఉద్యోగుల సహాయ సహకారాలు మరింత మెరుగ్గా ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఉద్యోగ సంఘాల హర్షం..

Andhra Pradesh Employees

ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రిటైర్మెంట్‌ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం సంతోషకరమైన నిర్ణయమని ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు. తాము అనుకున్న దానికంటే ఎక్కువే చేసినందున సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జనవరి జీతం నుంచే పెంచిన పీఆర్సీ, ఐదు డీఏలు ఇస్తామడం మంచి బెనిఫిట్‌ అనిపేర్కొన్నారు.
ఏప్రిల్ లోపు పెండింగ్‌ బిల్లులన్నీ క్లియర్ చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, ఇది ఉద్యోగులకు మంచి పరిణామమన్నారు. కరోనా వల్ల రెండు సంవత్సరాలు ఆర్దిక సమస్యలు తలెత్తాయని, తాము కూడా అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరిస్తామని పేర్కొన్నారు.

Published date : 07 Jan 2022 06:51PM

Photo Stories