Skip to main content

విజయవంతంగా గ్రూప్‌ –1 మెయిన్స్ డిజిటల్‌ మూల్యాంకనం.. జూన్‌ 17 నుంచి ఇంటర్వ్యూలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చరిత్రలో తొలిసారిగా గ్రూప్‌ –1 మెయిన్స్ లో డిజిటల్‌ మూల్యాంకనం (డిజిటల్‌ ఇవాల్యుయేషన్‌) అమలు చేయడం ద్వారా పారదర్శకత, భద్రత, నిగూఢత, నిష్పాక్షికతకు పెద్దపీట వేసింది.
దాదాపు 48 వేల స్కాన్డ్‌ జవాబు పత్రాలను ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా డిజిటల్‌ మూల్యాంకనం చేసింది.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ –1 ఇంటర్వ్యూ టిప్స్, గైడెన్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

గతంలో మెయిన్స్ మూల్యాంకనంలో పలు లోపాలు చోటుచేసుకోవడం, అనుమానాలకు తావివ్వడంతో పాటు ఆరోపణలు వెల్లువెత్తేవి. అనేకమంది అభ్యర్థులు నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అలాంటి వాటికి తావులేకుండా అభ్యర్థుల సమాధాన పత్రాలను స్కాన్‌ చేసి డిజిటల్‌ ఇవాల్యుయేషన్‌ చేశారు. అత్యున్నత పోస్టుల భర్తీలో వినూత్న విధానాన్ని విజయవంతంగా అమలు చేశారు. మూడు అంచెల్లో చెక్స్‌ అండ్‌ బ్యాలెన్స్ విధానంలో సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి పారదర్శక విధానంలో మార్కులు కేటాయించారు. ప్రతి సమాధాన పత్రం వేర్వేరు సబ్జెక్టు నిపుణుల ద్వారా రెండు సార్లు మూల్యాంకనం జరిగింది. ఇలా వచ్చిన మార్కుల్లో యావరేజ్‌ స్కోరును పరిగణనలోకి తీసుకున్నారు. ఇద్దరు సబ్జెక్టు నిపుణుల మూల్యాంకనంలో మార్కుల మధ్య 15 శాతం మేర వ్యత్యాసం ఉంటే మూడోదశ మూల్యాంకనం చేయాలని నిర్ణయించారు. ఈసారి అలాంటి అవసరం ఏర్పడ లేదు. ప్రతి ప్రశ్నపై నిపుణులతో చర్చించి మూల్యాంకన ప్రమాణాలను కమిషన్‌ నిర్ధారించింది. చీఫ్‌ ఎగ్జామినర్లతో పరిశీలించిన అనంతరం మార్కులను మాస్టర్‌ రికార్డుల్లో నమోదు చేశారు. మాస్టర్‌ రికార్డును చీఫ్‌ ఎగ్జామినర్‌ మరోసారి పరిశీలించి ర్యాండమ్‌ తనిఖీల తరువాత నిర్దేశిత ఫార్మాట్‌లో ఏపీపీఎస్సీకి సమర్పించారు. నాలుగు నెలల వ్యవధిలో ఎక్కడా లోటుపాట్లకు అవకాశం లేకుండా నిగూఢంగా ఈ ప్రక్రియను కమిషన్‌ పూర్తి చేసింది.

ట్యాబ్‌ ఆధారిత ప్రశ్నపత్రాలతో..
165 పోస్టుల భర్తీకి 2018 గ్రూప్‌ – 1 నోటిఫికేషన్‌ జారీ కాగా మెయిన్స్కు 9,679 మంది అర్హత సాధించారు. గత డిసెంబర్‌లో నిర్వహించిన పరీక్షలో 6,782 మంది మెయిన్స్కు సంబంధించి ఏడు పేపర్లను రాశారు. ఈ పరీక్షలను తొలిసారి ట్యాబ్‌ ఆధారిత ప్రశ్నపత్రాలతో నిర్వహించారు. వీరిలో 326 మంది రెగ్యులర్‌గా, 75 మంది స్పోర్ట్స్‌ కోటాలో ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. 1 : 2 నిష్పత్తిలో ఎంపికచేశారు. వీరిలో 42 శాతం మంది తెలుగు మాధ్యమం అభ్యర్థులు కాగా మిగతా వారు ఇంగ్లి‹ష్‌లో మీడియంలో చదివిన వారున్నారు. గతంలో మెయిన్స్ పరీక్షకు 1 : 15 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసేవారు. దీనివల్ల పలువురు అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి 1 : 50 నిష్పత్తిలో మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేసేలా చర్యలు తీసుకుంది. తద్వారా అర్హులైన ఇతర అభ్యర్థులకు అవకాశం దక్కేలా చేసింది.
Published date : 04 Jun 2021 04:13PM

Photo Stories