Skip to main content

టెన్త్ ఫిజికల్ సైన్స్... పది గ్రేడు పాయింట్లకు పదునైన వ్యూహం

మారిన సిలబస్ నేపథ్యంలో పదో తరగతి భౌతిక, రసాయనశాస్త్రంలో ఏయే అంశాలను కొత్తగా చేర్చారు?
Tenth Class Guidance పరీక్ష విధానంలో ఏవైనా మార్పులు చోటుచేసుకొన్నాయా? ఈ సబ్జెక్టులో పది గ్రేడు పాయింట్లు సాధించాలంటే ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి? తదితర అంశాలపై విశ్లేషణ..

నూతన సిలబస్ ప్రకారం భౌతిక, రసాయన శాస్త్రాల్లో మొత్తం 14 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో ఉష్ణం, రసాయన చర్యలు- సమీకరణాలు, కాంతి పరావర్తనం, ఆమ్లాలు-క్షారాలు- లవణాలు, సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం, వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం, మానవుడి కన్ను- రంగుల ప్రపంచం, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ- ఆవర్తన పట్టిక, రసాయన బంధం, విద్యుత్ ప్రవాహం, విద్యుదయస్కాంతత్వం, లోహ సంగ్రహణ శాస్త్రం, కార్బన్-దాని సమ్మేళనాలు అనే అధ్యాయాలకు చోటు కల్పించారు. గతంతో పోల్చితే ఉష్ణం, రసాయన చర్యలు- సమీకరణాలు, మానవుడి కన్ను- రంగుల ప్రపంచం, లోహ సంగ్రహణ శాస్త్రం అనే అధ్యాయాలు కొత్తవి.

సిలబస్‌లోనే కాకుండా, ప్రశ్నపత్రం రూపకల్పనలో కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారం ప్రశ్నించే విధానం ఉంటుంది. ప్రశ్నల రకాలు- మార్కులు మాత్రం పాత విధానం లోనే ఉంటాయి. ప్రశ్నపత్రంలో విద్యా ప్రమాణాల భారత్వం (వెయిటేజ్) అంతర్లీనంగా ఉంటుంది.

విద్యాప్రమాణాల వారీగా భారత్వం

విద్యా ప్రమాణాలు

భారత్వం

1. విషయావగాహన

40%

2. ప్రశ్నించడం -పరికల్పన చేయడం

10%

3. ప్రయోగాలు -క్షేత్ర పరిశీలనలు

15%

4. సమాచార నైపుణ్యాలు - ప్రాజెక్టు పనులు

15%

5. బొమ్మలు గీయడం ద్వారా భావ ప్రసారం

10%

6. ప్రశంస, జీవ వైవిధ్యం, నిజజీవిత వినియోగం

10%



పై విద్యా ప్రమాణాల వారీగా సబ్జెక్టును అధ్యయనం చేయాలి. కొత్త విధానంలో చెప్పు కోవాల్సిన కీలక అంశం.. గతంలో మాదిరిగా ఏ చాప్టర్‌కూ ఇంత వెయిటేజి అంటూ ఏమీలేదు. కాబట్టి ఏ అధ్యాయంలో నుంచైనా ఎన్ని ప్రశ్నలైనా ఇచ్చే అవకాశం ఉంది. వాటిని ఏ రూపంలోనైనా అడగవచ్చు. అందువల్ల విద్యా ప్రమాణాల వారీగా ప్రశ్నల విధానం ఆధారంగా విస్తృతంగా అధ్యయనం చేయాలి. ప్రతి అధ్యాయాన్ని క్షుణ్నంగా నేర్చుకోవాలి. పాఠ్యపుస్తకం చివర ఉన్న ‘అభ్యసనాన్ని మెరుగుపరచుకొందాం’లోని ప్రశ్నలను కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రశ్నలకు సమాధానాలు ఒకేరకంగా రాసేలా కాకుండా బహుళ సమాధానాలు వచ్చేలా ప్రశ్నలను ఇచ్చే అవకాశం ఉంది. పరీక్షల్లో జ్ఞాపకం (లేదా) బట్టీ పట్టి రాసినట్లు సమాధానాలు ఉండకూడదు. ఆలోచించి, విశ్లేషించి రాయాలి.

పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించాలంటే సామాన్య శాస్త్రంలో పూర్తిస్థాయిలో మార్కులు సాధించాలి. ఇందులో ఫిజికల్ సైన్‌‌స 50 మార్కులకు, బయోలాజికల్ సైన్‌‌స 50 మార్కులకు ఉంటాయి. ఫిజికల్ సైన్‌‌స 50 మార్కుల్లో పార్‌‌ట-ఎ నుంచి 35 మార్కులు, పార్‌‌ట-బి (బిట్ పేపర్) నుంచి 15 మార్కులు ఉంటాయి. సమయం 3 గంటలు.

Part-A
పార్‌‌ట-ఎలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో రెండు మార్కుల ప్రశ్నలు, రెండో సెక్షన్‌లో ఒక మార్కు ప్రశ్నలు, మూడో సెక్షన్‌లో నాలుగు మార్కుల ప్రశ్నలు, నాలుగో సెక్షన్‌లో ఐదు మార్కుల ప్రశ్నలు ఉంటాయి.

ప్రతి సెక్షన్‌లో గ్రూప్-ఎ, గ్రూప్-బి అనే రెండు విభాగాలుంటాయి. గ్రూప్-ఎ కింద భౌతికశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు, గ్రూప్ -బి కింద రసాయన శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

గ్రూప్-ఎలో భౌతిక శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు.. ఉష్ణం, కాంతి పరావర్తనం, సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం, వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం, మానవుడి కన్ను- రంగుల ప్రపంచం, విద్యుత్ ప్రవాహం, విద్యుదయస్కాంతత్వం యూనిట్ల నుంచి వస్తా యి. ఈ ప్రశ్నల్లో ఎక్కువగా భేదాలు రాయడం, ఉదాహరణల ద్వారా వివరించడం, గణన, కారణ సంబంధ ఫలితాలు తెలపడం మొదలైన వి ఉంటాయి.

గ్రూప్-బిలో రసాయనశాస్త్రంలో.. రసాయన చర్యలు- సమీకరణాలు, ఆమ్లాలు- క్షారాలు-లవణాలు, పరమాణు నిర్మాణం, రసాయనబంధం, మూలకాల వర్గీకరణ- ఆవర్తన పట్టిక, లోహ సంగ్రహణ శాస్త్రం, కార్బన్ - సమ్మేళనాలు యూనిట్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.

  • సెక్షన్-Iలో ప్రతి విభాగం నుంచి 2 ప్రశ్నల కు తక్కువ కాకుండా మొత్తం 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. వీటికి మొత్తం పది మార్కులు ఉంటాయి. సెక్షన్-Iలో ప్రశ్నలను ఇన్‌డెరైక్ట్‌గా అడిగే అవకాశం ఉంది. ముందు బాగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాస్తే ఆత్మస్థైర్యం పెరిగి మిగిలిన ప్రశ్నలను కూడా సులువుగా రాయొచ్చు.
  • రెండు మార్కుల ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో జవాబులు రాయాలి. ప్రతి వాక్యానికి 1/2 మార్కు చొప్పున కేటాయిస్తారు. రెండు చిన్న ప్రశ్నలు కలిపి ఒక ప్రశ్నగా ఇచ్చినప్పుడు ఆ ప్రశ్నకు జవాబు రాయగలిగితే పూర్తి స్థాయిలో మార్కులు వచ్చే అవకాశం ఉంది. అవసరమైన చోట మాత్రమే పటాలను గీయాలి.
  • సెక్షన్-IIలో ఆరు ప్రశ్నల్లో ఏవైనా నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయాలి. భౌతిక శాస్త్రం నుంచి మూడు ప్రశ్నలు, రసాయనశాస్త్రం నుంచి మూడు ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున నాలుగు మార్కులుంటాయి. ఈ ప్రశ్నలకు ఒకటి నుంచి రెండు వాక్యాల్లో జవాబులు రాయాలి.ప్రశ్నల్లో నిర్వచనాలు, విలువలు, ఉదాహరణలు మొదలైనవి ఉంటాయి.
  • సెక్షన్-IIIలో ప్రతి విభాగం నుంచి నాలుగు ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగంలో రెండేసి ప్రశ్నల చొప్పున మొత్తం నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఈ ప్రశ్నలకు ఎనిమిది వాక్యాల నుంచి 12 వాక్యాల వరకు రాయాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున నాలుగు ప్రశ్నలకు 16 మార్కులు కేటాయిస్తారు. ఈ ప్రశ్నల్లో వీలైనంత వరకు బేధాలు, గణనలు, ఉపయోగాలు, ఉత్పాదనలకు సంబంధించిన ప్రశ్నలు రాస్తే పూర్తి మార్కులు సాధించొచ్చు.
  • సెక్షన్-IVలో 23వ ప్రశ్న (భౌతిక శాస్త్రం), 24వ ప్రశ్న (రసాయన శాస్త్రం)లు పటాలకు సంబంధించినవి. వీటిల్లో ఏదో ఒక పటం గీయాలి. ఐదు మార్కులు ఉంటాయి.
  • పటం గీసినందుకు మూడు మార్కులు, ముఖ్యభాగాల్ని గుర్తించినందుకు రెండు మార్కులు కేటాయిస్తారు.
  • పటాలను గీసేటప్పుడు భాగాలను నంబర్ల లో, అక్షరాల్లో గుర్తించి, పటం కింద భాగాలు రాస్తే చూడటానికి అనువుగా, సులువుగా ఉంటుంది.
Part-B
  • మార్కుల సాధనలో కీలకపాత్ర వహించేది పార్‌‌ట-బి (బిట్ పేపర్)
  • బిట్ పేపర్‌లో బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఖాళీలను పూరించడం, జతపరచడం వంటివాటిపై మొత్తం 30 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు చొప్పున 15 మార్కులు ఇస్తారు.
  • బిట్ పేపర్‌కు 30 నిమిషాల సమయం కేటాయిస్తారు.
  • దిద్దిన, చెరిపేసి రాసిన సమాధానాలకు మార్కులు ఇవ్వరు.
  • బహుళైచ్ఛిక ప్రశ్నలు: సమాధానాలు సూచించిన విధంగా పెద్ద అక్షరాల్లో మాత్రమే రాయాలి.
  • బహుళైచ్ఛిక ప్రశ్నల్లో మొత్తం 20 ప్రశ్నల్లో మొదటి 10 ప్రశ్నలు భౌతికశాస్త్రం నుంచి, మిగిలిన 10 ప్రశ్నలు రసాయనశాస్త్రం నుంచి ఇస్తారు.
ఖాళీలను పూరించడం:
ఖాళీలను పూరించడానికి సంబంధించిన ప్రశ్నలు భౌతికశాస్త్రం లేదా రసాయనశాస్త్రాల నుంచి ఇస్తారు. ఇందులో ఐదు ప్రశ్నలు ఉంటాయి.
జతపరచడానికి సంబంధించిన ప్రశ్నలు భౌతికశాస్త్రం లేదా రసాయనశాస్త్రాల నుంచి ఇస్తారు. మొత్తం ఐదు జతలుంటాయి.
నోట్: ఖాళీలను పూరించడం భౌతికశాస్త్రంలో ఇస్తే జతపరచడం రసాయన శాస్త్రంలో ఇస్తారు. ఖాళీలను పూరించడం రసాయనశాస్త్రంలో ఇస్తే జతపరచండి భౌతిక శాస్త్రంలో ఇస్తారు. ఇది కచ్చితంగా చెప్పలేని అంశం.

ముఖ్యమైనవి, గుర్తుంచుకోవాల్సినవి
ప్రస్తుత సిలబస్ ప్రకారం చూస్తే అత్యంత కీలక అంశాలు.. పరమాణు నిర్మాణం, రసాయన బంధం, కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్ ప్రవాహం, కార్బన్ - సమ్మేళనాలు, విద్యుదయస్కాంతత్వం. వీటిపై విద్యార్థులు ఎక్కువ దృష్టి సారించాలి. మానవుడి కన్ను- రంగుల ప్రపంచం అనే అధ్యాయాన్ని జీవశాస్త్ర పాఠ్యపుస్తకానికి అన్వయిస్తూ నేర్చుకోవాలి. ఈ చాప్టర్‌ను పూర్తిస్థాయిలో అవగాహన చేసుకోవాలంటే విద్యార్థులు దగ్గరలోని కంటి వైద్యుడిని (లేదా) ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్‌ను కలిసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.

ఉష్ణం, కాంతికి సంబంధించిన అధ్యాయాలపై పూర్తిస్థాయి పట్టు సాధించాలంటే గణితంలోని మౌలిక భావనలు కచ్చితంగా తెలిసి ఉండాలి. మూలకాల వర్గీకరణ, గ్రూపులు, పీరియడ్‌లోని మూలకాలను గుర్తుంచుకోవాలి. రసాయన చర్యలు - సమీకరణాలు అనే పాఠంలో సమీకరణాల తుల్యంకనం చేయడం అనేది ముఖ్యం. దీన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. రసాయన చర్యలు- రకాలు అనే అంశాన్ని పూర్తి స్థాయిలో నేర్చుకోవాలంటే ప్రయోగ కృత్యాలను తప్పనిసరిగా చేయాలి. మూలకాల వర్గీకరణ, లోహ సంగ్రహణ శాస్త్రం, కార్బన్ దాని సమ్మేళనాలు అనే అంశంలో మరింత సమాచారం కోసం ఇంటర్నెట్ లేదా వివిధ మాధ్యమాలను ఉపయోగించుకోవాలి. ఆమ్లాలు- క్షారాలు-లవణాలు అనే పాఠ్యాంశాలపై పట్టు సాధించాలంటే ఆయా విషయాలను నిజ జీవిత అంశాలకు అన్వయించుకోవాలి.

పది గ్రేడ్ పాయింట్లు సాధించాలంటే..
కొత్త సిలబస్‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలంటే ప్రయోగ కృత్యాలు, సాధారణ కృత్యాలను నిర్వహించాలి. ఉష్ణం, కాంతి, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, రసాయన బంధం, విద్యుత్ ప్రవాహం, కార్బన్ దాని సమ్మేళనాలు అనే అధ్యాయాలు క్షుణ్నంగా చదవాలి. పాఠ్యపుస్తకాల్లోని ‘అభ్యసనాలను మెరుగుపరచుకొందాం’ అనే భాగంలోని ప్రశ్నలన్నింటిపైనా పూర్తి స్థాయిలో అవగాహన పొందితే సులువుగా సమాధానాలు రాయొచ్చు.

సాధారణ విద్యార్థులకు ఉష్ణం, లోహ సంగ్రహణ శాస్త్రం, కార్బన్ దాని సమ్మేళనాలు, కాంతి, విద్యుత్ ప్రవాహం తదితర చాప్టర్‌లలోని అంశాలు సులువుగా అర్థమవుతాయి. కాబట్టి వీటిలోని అన్ని భావనలను క్షుణ్నంగా చదవాలి. విషయావగాహన ప్రశ్నలకు ఎక్కువ సమయం కేటాయించాలి.

ప్రతి అధ్యాయంలోని నిర్వచనాలు, సూత్రాలు, ప్రాథమిక భావనలను నేర్చుకుంటే 2 మార్కులు, 1 మార్కు ప్రశ్నలు, బిట్స్‌కు సులువుగా సమాధానాలు రాయొచ్చు.

ప్రశ్నపత్రం మొత్తం 79 మార్కులకు ఉంటుంది. వీటిలో 29 మార్కులు చాయిస్ పోతే 50 మార్కులకు ప్రశ్నలు రాయాలి.
Published date : 10 Jan 2015 05:11PM

Photo Stories