Skip to main content

Tenth Class Exam 2024:పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ అధికారులు చకాచకా ఏర్పాట్లు....

పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ అధికారులు చకాచకా ఏర్పాట్లు....
పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ అధికారులు చకాచకా ఏర్పాట్లు....
పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ అధికారులు చకాచకా ఏర్పాట్లు....

అనంతపురం : పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ అధికారులు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చేరిన ప్రశ్నపత్రాలను ఆయా పోలీసుస్టేషన్లలో భద్రపరుస్తున్నారు. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై డీఈఓ మీనాక్షి ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
సాక్షి : ఈ ఏడాది ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు?
డీఈఓ: జిల్లా వ్యాప్తంగా 40,063 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ సంఖ్య రాష్ట్రంలోనే అత్యధికం. ఏ జిల్లాలోనూ ఇంత భారీ స్థాయిలో రాయడం లేదు.
సాక్షి : ఎందుకు విద్యార్థుల సంఖ్య పెరిగింది?
డీఈఓ: పరీక్షలకు హాజరుకానున్న వారిలో రెగ్యులర్‌ విద్యార్థులు 31,330 మంది కాగా ప్రైవేట్‌ విద్యార్థులు 8,733 మంది ఉన్నారు. ప్రభుత్వం ఫెయిల్‌ అయిన విద్యార్థులందరినీ పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో అందుకనుగుణంగానే వారందరితో ఫీజు కట్టించాం. ఈ కారణంగా విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది.
సాక్షి : ఫెయిల్‌ అయిన విద్యార్థులందరూ పరీక్షలకు వస్తారా?
డీఈఓ: వారిపై ప్రత్యేక దృష్టి సారించాం. హెచ్‌ఎంలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. పేరెంట్స్‌ కమిటీల సహకారం తీసుకుంటున్నాం. అలాగే వచ్చే సంవత్సరం నుంచి సిలబస్‌ మారుతోంది. వారిద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. పదో తరగతి పాసైతే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందనే అంశాలను వివరిస్తున్నాం. వీలైనంతమంది పరీక్షలు రాస్తారనే ఆశిస్తున్నాం.
సాక్షి : సిబ్బంది నియామకం పూర్తయిందా?
డీఈఓ: చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారుల నియామకాలు పూర్తయ్యాయి. వారు చేపట్టే విధులపై శిక్షణ కూడా ఇచ్చాం. ఇన్విజిలేటర్ల నియామకాలపై కసరత్తు జరుగుతోంది.
సాక్షి : సిబ్బందికి ఏ కారణంగా మినహాయింపు ఇస్తారు?
డీఈఓ: చీఫ్‌ సూపరింటెండెట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, ఇన్విజిలేటర్లుగా నియమితులైన వారికి ఎలాంటి పరిస్థితుల్లోనూ మినహాయింపు ఉండదు. మినహాయింపు ఇవ్వాలన్నా.. అందుకు బలమైన కారణాలు ఉండాలి, వాటికి సంబంధించి ఆధారాలూ ఉండాలి. అదికూడా డిప్యూటీ డీఈఓలు రెకమెండ్‌ చేస్తేనే మినహాయింపు ఇస్తాం తప్ప డీఈఓ నేరుగా ఏ ఒక్కరికీ మినహాయింపు ఇవ్వరు.
సాక్షి : ఇన్విజిలేటర్లుగా ఎవరిని నియమిస్తారు?
డీఈఓ: దాదాపు 1,800 మంది వరకు ఇన్విజిలేటర్లు అవసరం ఉండొచ్చు. ఎస్జీటీలకు తొలి ప్రాధాన్యత ఉంటుంది. అక్కడికి తక్కువ వస్తే పండిట్లు, స్కూల్‌ అసిస్టెంట్లను తీసుకుంటాం. సబ్జెక్టు టీచర్లను తీసుకున్నా, ఆ సబ్జెక్టు పరీక్ష రోజున విధుల నుంచి తప్పిస్తాం.
సాక్షి : మూల్యాంకనం ఎప్పటి నుంచి
ప్రారంభిస్తారు?
డీఈఓ: పరీక్షలు 30న ముగుస్తాయి. ఆ మరుసటి రోజు నుంచే మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 8 వరకు ఉంటుంది. కలెక్టర్‌, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నాం.
సాక్షి : పేపర్‌ లీకు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డీఈఓ: గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రశ్నపత్రాల తయారీలో ప్రభుత్వం సరికొత్త సాంకేతిక విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఎక్కడైనా పేపరు లీకై బయటకు వెళ్తే అది ఏ సెంటర్‌, ఏ గది నుంచి ఏ విద్యార్థికి కేటాయించిందో ఇట్టే తెలిసిపోతుంది. ఈ విషయంపై విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే తెలియజేశాం. ఏ మాత్రం ఇలాంటి చర్యలకు పాల్పడినా అడ్డంగా దొరికిపోయి జైలుపాలవుతారు.

Published date : 06 Mar 2024 01:14PM

Photo Stories