UPSC Rankers: ఈ ఆశతోనే సివిల్స్లో సత్తా చాటారు విద్యార్థులు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(సివిల్స్) పరీక్షల్లో రాష్ట్ర వాసులు సత్తా చాటారు. విడుదలైన ఫలితాల్లో రాష్ట్ర అభ్యర్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు.
స్థానిక పెరంబూరుకు చెందిన జీజీ మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులవ్వడం విశేషం. గత ఏడాది జూన్లో యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలు, డిసెంబరులో మెయిన్స్ నిర్వహించారు. అనంతరం ఈ ఏడాది మే 18న మౌఖిక పరీక్షలు నిర్వహించి, ఈ మూడింటి మార్కులతో మొత్తం ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. 180 ఐఏఎస్, 200 ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా సివిల్ సర్వీసెస్లో 1,022 స్థానాలకు నిర్వహించిన పరీక్షల్లో 933 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షల్లో మొదటి పది స్థానాల్లో ఆరుగురు మహిళలే ఉండగా, అందులో తొలి ర్యాంకు కూడా వారికే దక్కింది. ఇక, రాష్ట్రానికి సంబంధించి స్థానిక పెరంబూర్కు చెందిన జీజీ అనే విద్యార్థిని జాతీయ స్థాయిలో 107 స్థానం, రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించారు. స్టెల్లా మేరీస్ కళాశాలలో చదివిన జీజీ తొలి ప్రయత్నంలో విజయం సాధించారు. ఆమె తండ్రి ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నారు.
నాల్గో ప్రయత్నంలో...
తెన్కాశి జిల్లాకు చెందిన ఆర్.రామకృష్ణన్ తన నాలుగో ప్రయత్నంలో రాష్ట్రస్థాయిలో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. తిరువేంగడం గ్రామానికి చెందిన రంగనాథన్, ధనలక్ష్మి దంపతుల కుమారుడు రామకృష్ణన్(28) మద్రాసు విశ్వవిద్యాలయంలో 2016లో బీఈ మెకానికల్ పూర్తి చేశాడు. అనంతరం తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులై 2019లో నామక్కల్ జిల్లా పారిశ్రామిక కేంద్రంలో అసిస్టెంట్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. ఐఏఎస్ కావాలనే ఆశతో 2019-22 వరకు నాలుగుసార్లు యూపీఎస్సీ పరీక్షలు రాశారు. మొదటి మూడు ప్రయత్నాలు ఫలించకపోగా, పట్టువదలకుండా 2022లో నాలుగో సారి కూడా పరీక్షలు రాశాడు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో జాతీయస్థాయిలో 117వ ర్యాంక్, రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంక్ను రామకృష్ణన్ కైవసం చేసుకున్నారు. కాగా, రిజర్వ్ బ్యాంక్లో పనిచేస్తున్న చెన్నైకి చెందిన మదివదిని రావణన్ జాతీయస్థాయిలో 447వ ర్యాంక్ సాధించింది.
యూపీఎస్సీ తమిళంలో పరీక్ష
యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షల్లో తమిళంలో పరీక్ష రాసిన తెన్కాశి జిల్లాకు చెందిన సుబ్బురాజ్ జాతీయస్థాయిలో 621వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం డెహ్రాడూన్లో ఐఎ్ఫఎస్ అధికారిగా పనిచేస్తున్న సుబ్బురాజ్, 2022లో నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షల్లో తమిళంలో పరీక్షలు రాశారు. కాగా, ఈ పరీక్షల్లో తిరునల్వేలికి చెందిన సుభాష్ కార్తీక్ 118వ స్థానం సాధించారు.