ASP Success Story : తినడానికి సరైన తిండి లేక.. యూనివర్సిటీలో చేరా.. కానీ అక్కడ..
అయితే ఉన్న ఈ పరిస్థితికి.. యూనివర్సిటీలో చేరితే.. రూమ్కి.. బోజనంకు ఇబ్బంది ఉండదని.. కాకతీయ యూనివర్సిటీలో చేరాడు. అలాగే ఉద్యోగం వచ్చే వరకు యూనివర్సిటీని వదలొద్దనుకున్నారు. ఎంతో కష్టపడి చదివి.. అనుకున్న పోలీసు ఉద్యోగం సాధించాడు. ఇప్పుడు సిరిసిల్ల అడిషనల్ ఎస్పీగా పని చేస్తున్నారు. ఈయనే అడిషనల్ ఎస్పీ చంద్రయ్య. ఈ నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
మా అమ్మనాన్న రాజయ్య–మల్లమ్మ. మాది గన్నేరువరం. నాన్న రైల్వేలో చిరుద్యోగి. నాకు నలుగురు అన్నలు, నలుగురు అక్కలు. అందరిలో నేనే చిన్నవాడిని. అన్న ఆర్మీలో పనిచేయగా, ఇద్దరు గల్ఫ్ వెళ్లి వచ్చారు. మరొకరు వ్యవసాయం చేస్తున్నారు.
ఎడ్యుకేషన్ :
ఉద్యోగరీత్య మా నాన్న మహారాష్ట్రలో ఉండగా అక్కడే రెండో తరగతి వరకు చదువుకున్నాను. అక్కడి నుంచి మా సొంతూరిలోని ఓ పంతులు వద్ద నన్ను చేర్చి నెలకు రూ.100 ఇచ్చేవారు. ఐదో తరగతిలో పరీక్ష రాస్తే తెలుగు ఫెయిల్ అయ్యాను. తర్వాత ప్రతి తరగతిలో మెరిట్ రావడంతో ఏడాదికి రూ.100 స్కాలర్షిప్ వచ్చింది. గన్నేరువరం జెడ్పీహెచ్ఎస్లో 64 మంది పదోతరగతి పరీక్ష రాస్తే ఒక్కడినే పాసయ్యాను. అనంతరం కరీంనగర్ బిషప్ సాలమన్ కళాశాలలో ఇంటర్ చదివాను. వరంగల్లోని సీకేఎం కళాశాలలో బీఎస్సీ ఫిషరీస్ కోర్సు చదివాను.
నాన్న పడుతున్న కష్టాలను గమనించి..
ఈ సమయంలో నేను అద్దెకు ఉండే కాలనీలో నక్సలైట్ల కోసం పోలీసులు తరచూ తనిఖీలు చేస్తుండడంతో భయంగా ఉండేది. దీనికితోడు మాది పెద్ద కుటుంబం కావడంతో చదివించడం ఇబ్బందిగా మారింది. నాన్న పడుతున్న కష్టాలను గమనించి కాకతీయ యూనివర్సిటీలో చేరాలని ప్రవేశ పరీక్ష రాయడంతో సీటు వచ్చింది. రెండేళ్లలో పీజీ పూర్తి చేశాను. కానీ జాబ్ రాలేదు. టీచింగ్ వైపు వెళ్లాలని ఇంగ్లిష్ కోర్సులో చేరాను.
అప్పుడు ఆ జీతంతోనే హ్యాపీగా ఉన్నాం..
ఇలా భోజనానికి ఇబ్బంది ఉండదని యూనివర్సిటీలోనే ఉంటూ చదువుకున్నాను. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాగానే పరీక్ష రాసి 1991లో ఆర్ఎస్సైగా విధుల్లో చేరాను. నాకు ఆ సమయంలో రూ.1,280 జీతం వచ్చేది. అప్పుడు ఆ జీతంతోనే హ్యాపీగా ఉన్నాం.
నాపై నక్సలైట్లు మూడు సార్లు అటాక్ చేసినా ప్రాణాలతో..
కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతే కావడంతో అద్దె గదుల్లో ఉండలేక ఫుడ్ కోసమే కేయూలో ప్రవేశాల కోసం పరీక్షలు రాశాను. పోలీస్ ఉద్యోగంలో చేరి సమాజ శాంతి కోసం లాఠీ పట్టాను. అదే సమాజ సేవ కోసం మనసుతో పనిచేశాను. నక్సలైట్లు మూడు సార్లు అటాక్ చేసినా ప్రాణాలతో బయటపడ్డాను. విధుల్లో అకుంఠిత దీక్ష.. నిబద్ధతే తనకు గుర్తింపు తెచ్చిందన్నారు. ప్రస్తుతం సిరిసిల్ల అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నాను. ఇటీవలే ప్రెసిడెంట్ పోలీస్ మెడల్కు ఎంపికైయ్యాను. నా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చేశాను.
పోలీస్గా చాలా గర్వంగా..
పోలీస్ కొలువుకు కావాలనుకుని రాలేదు. ఫుడ్ కోసమే కాకతీయ యూనివర్సిటీలో చేరిన. అక్కడ చదువుతుండగానే పోలీస్ నోటిఫిషన్ రావడంతో పరీక్ష రాసి ఎంపికయ్యాను. పోలీస్గా చాలా గర్వంగా పనిచేసిన. ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో నక్సలైట్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పనిచేయడం సంతృప్తినిచ్చింది. నన్ను చంపేందుకు నక్సలైట్లు మూడుసార్లు అటాక్ చేశారు. ప్రతీసారి మాదే పైచేయి అయ్యింది. నిత్యం శాంతిస్థాపన కోసం పనిచేశాం. నక్సలైట్ల కంటే రౌడీల ఆగడాలు విపరీతంగా ఉన్నాయని తెలిసి వారిపై ఉక్కుపిడికిలి బిగించాను. విధుల్లో నేను చూపిన తెగువ.. ఇన్నాళ్ల నా పనితనమే ఈ గుర్తింపును తెచ్చింది.. అని అంటున్నారు ఇటీవల ప్రెసిడెంట్ పోలీస్ మెడల్కు ఎంపికై న రాజన్నసిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య.