Teacher Appointments: 8,600 మంది కొత్త టీచర్లు

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యాసంస్థలు కొత్త టీచర్లతో కళకళలాడనున్నాయి. వచ్చేవారంలో ఏకంగా 8,600 మంది విధుల్లో చేరనున్నారు.

ఇప్పటికే వీరంతా నియామక పత్రాలు అందుకుని దాదాపు 4 నెలలు కావొస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టింగ్‌ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగినా,  ప్రస్తుతం ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను అన్ని గురుకుల సొసైటీలు పూర్తి చేశాయి. 2,3రోజుల్లో వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఆ తర్వాత పోస్టింగ్‌ ఇచ్చేలా గురుకుల సొసైటీలు కార్యాచరణ రూపొందించాయి.
ప్రస్తుతం ఎస్సీ గురుకుల సొసైటీ మినహా మిగతా సొసైటీల్లో బదిలీల ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. జూలై 20వ తేదీనాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డెడ్‌లైన్‌ విధించగా, ఆలోపు అన్ని కేటగిరీల్లో బదిలీల పూర్తికి చర్యలు వేగవంతం చేశాయి. 

చదవండి: DSC 2024: నేటి నుంచే డీఎస్సీ.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంఖ్య, పరీక్షా కేంద్రాలు వివ‌రాలు ఇలా..

బదిలీలు పూర్తి కాగానే... 

కొత్తగా రాబోయే గురుకుల టీచర్లకు వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని గురుకుల సొసైటీలు ఇప్పటికే నిర్ణయించాయి. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసి ఖాళీల జాబితాను సిద్ధం చేశాయి. ప్రస్తుతం అన్ని సొసైటీల్లో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఎస్టీ, మైనారిటీ, జనరల్‌ గురుకుల సొసైటీల్లో రెండ్రోజుల్లో బదిలీలు పూర్తవుతాయి. బీసీ గురుకుల సొసైటీలో జూలై 20‌ నాటికి పూర్తయ్యే అవకాశముంది. 
ఎస్సీ గురుకుల సొసైటీలో పలు కేటగిరీలు పెండింగ్‌లో ఉండడంతో నిర్దేశించిన తేదీల్లోగా పూర్తయ్యే అవకాశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఎస్సీ గురుకుల సొసైటీలోరాత్రింబవళ్లు బదిలీల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇవి పూర్తయిన వెంటనే కొత్త టీచర్లకు వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తున్నాయి.
ఇప్పటికే ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. వెబ్‌కౌన్సెలింగ్‌ ప్రారంభమైన వెంటనే వారికి లాగిన్‌ ద్వారా ఆప్షన్లు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. అన్ని కేటగిరీల టీచర్లకు వెబ్‌ఆప్షన్లుకు గరిష్టంగా రెండ్రోజుల సమయం ఇవ్వాలని సొసైటీలు భావిస్తున్నాయి.
ఆ తర్వాత ఆప్షన్ల ఫ్రీజింగ్‌ అనంతరం పోస్టింగ్‌ ఉత్తర్వులు కూడా ఆన్‌లైన్‌ ద్వారానే జారీ చేసేలా సాంకేతికను సిద్ధం చేశారు. పోస్టింగ్‌ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని, పూర్తిగా మెరిట్‌ ఆధారంగానే ప్రాధాన్యం ఇవ్వాలని సొసైటీలు నిర్ణయించి వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానాన్ని ఎంపిక చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.  

#Tags