Health and Family Welfare: మెడికల్‌ కళాశాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి

నారాయణపేట: నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నిబంధనల ప్రకారం నారాయణపేట మెడికల్‌ కళాశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ క్రిస్టినా అధికారులను ఆదేశించారు.

బుధవారం స్థానిక మెడికల్‌ కళాశాలను కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపల్‌, టీజీ ఎమ్‌ఐడిసి అధికారులు, కళాశాల వైద్య నిపుణులతో ఆమె మెడికల్‌ కళాశాల నిర్వహణపై సమీక్షించారు.

మెడికల్‌ కళాశాలలో కేవలం ఒక సంవత్సరం తరగతులకు కావాల్సిన వసతులే కాకుండా ద్వితీయ సంవత్సర తరగతుల నిర్వహించేందుకు అవసరమైన వసతి సౌకర్యం సమకూర్చాలని సూచించారు. ఒకసారి కళాశాల తరగతులు ప్రారంభించిన తర్వాత మళ్లీ ఎలాంటి సమస్య ఉత్పన్నం కాకూడదన్నారు.

చదవండి: MBBS 2024 Seats: కొత్త మెడికల్‌ కాలేజీ ..... 150 ఎంబీబీఎస్‌ సీట్లు

తరగతులకు సరిపడా ఫర్నిచర్‌ వచ్చిందా? ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఇండెంట్‌ పంపించాలని చెప్పారు. ప్రాక్టికల్స్‌ తరగతులను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మెడికల్‌ కళాశాల 3వ అంతస్తులో బ్లడ్‌ బ్యాంక్‌, డయాలసిస్‌, ఇతర ల్యాబ్‌ లను ఏర్పాటు చేయాలని, వెనుకబడిన ఈ ప్రాంతంలో వైద్యపరంగా పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని, అందుకోసం సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆమె సూచించారు.

జిల్లా ఆస్పత్రి పరిశీలన

అంతకుముందు కలెక్టర్‌ అధికారుల బృందంతో కలిసి ఆమె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని, చిన్నపిల్లల ఆస్పత్రిని పరిశీలించారు. చిన్నపిల్లలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని వైద్యులను ఆదేశించారు. జిల్లా ఆస్పత్రి వార్డులలో చికిత్స పొందుతున్న రోగులను వైద్య సేవలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. అలాగే, ఫార్మసీలో ఏయే మందుల కొరత ఉందని తెలుసుకుని వాటి ఇండెంట్‌ ను పంపించాలని ఆదేశించారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

అనంతరం అధికారుల బృందంతో కలిసి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ సముదాయాన్ని ఎంసిహెచ్‌ (మదర్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌) విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు పరిశీలించారు. కార్యక్రమంలో టీజీ ఎమ్‌ఐడిసి ఎండీ హేమంత్‌, ట్రైనీ కలెక్టర్‌ గరిమానరుల, అకాడమిక్‌ డీఎంఈ శివరాం ప్రసాద్‌, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాంకిషన్‌, పాలమూరు మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌, టీజీ ఎమ్‌ ఐడిసి చీఫ్‌ ఇంజనీర్‌ దేవేందర్‌ కుమార్‌, ఈఈ జైపాల్‌ రెడ్డి, డీఎంహెచ్‌ఓ సౌభాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

హెల్త్‌ మెడికల్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ప్రిన్సిపల్‌ సెక్రటరీ క్రిస్టినా
 

#Tags