JEE Main 2024: జేఈఈ–2024కి ఎన్నికల గండం!

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ)–2024కి పలు రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల రూపంలో ఆటంకాలు తప్పేలా లేవు. జేఈఈ మెయిన్‌ పరీక్షలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏటా రెండుసార్లు జనవరి, ఏప్రిల్‌ల్లో నిర్వహిస్తోంది.
జేఈఈ–2024కి ఎన్నికల గండం!

అనంతరం జూన్‌/జూలై నాటికి అడ్వాన్స్‌డ్‌ను కూడా నిర్వహించి ఆయా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలను చేపడుతోంది. అయితే వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి నిర్వహించాల్సిన జేఈఈకి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల రూపంలో అడ్డంకులు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. దీనివల్ల పరీక్షలు ఆలస్యమై ప్రవేశాల్లో కూడా జాప్యం జరగొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నం..

దేశంలో ఎన్నికల హడావుడి డిసెంబర్‌కన్నా ముందే ఆరంభం కానుంది. ఆ నెలలో మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్ల­లో ఆయా రాష్ట్రాల అధికార యంత్రాంగం మొత్తం నిమగ్నమై ఉంటుంది.

ఈ రాష్ట్రాల్లో ఎన్నికల తంతు ముగిశాక 2024 మార్చి, ఏప్రిల్‌ల్లో ఆంధ్ర­ప్రదేశ్, ఒడిశా సహా కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో­పాటు లోక్‌సభకు సాధారణ ఎన్నికలు జరగను­న్నాయి. ఈ ఎన్నికల ఏర్పాట్లలోనూ అధి­కార యంత్రాంగం మొత్తం తలమునకలై ఉంటుంది. ఈ ఎన్ని­కల ప్రభావం జేఈఈపై పడుతుందని.. ఎన్నికల సమయంలో పరీక్షల నిర్వహణ కష్ట­సాధ్యం కాబట్టి వాయిదా వేసే అవకాశాలే ఎక్కు­వగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. 

గతేడాది ఇదే పరిస్థితి..

జేఈఈ మెయిన్‌ 2022కు కూడా ఇలాగే ఆటంకాలు ఏర్పడ్డాయి. అప్పట్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరా­ఖండ్, మణిపూర్, గోవా ఎన్నికలతో పరీక్షల షెడ్యూ­ల్‌ వాయిదా పడింది. ఆ విద్యా సంవత్సరా­నికి జేఈఈ పరీక్షల షెడ్యూల్‌ను ఎన్‌టీఏ ముందరి సంవ­త్సరం అంటే 2021 సెప్టెంబర్‌ నాటికే విడుదల చేయాల్సి ఉండగా 2022 ఫిబ్రవరిలో కానీ విడుదల కాలేదు. ఆ షెడ్యూల్‌ను కూడా మూడుసార్లు మార్చి విద్యార్థులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది.

చదవండి: జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) - గైడెన్స్ | వీడియోస్ | MODEL PAPERS | GUIDANCE | CUT-OFF RANKS-2023 | PREVIOUS PAPERS (JEE MAIN) | PREVIOUS PAPERS (JEE ADV.) | SYLLABUS | SYLLABUS (JEE ADV.) | VIDEOS

ఏటా జనవరి, ఏప్రిల్‌ నెలల్లో నిర్వహించేలా ఈ పరీ­క్షల సాధారణ షెడ్యూల్‌ ఉండగా జేఈఈ–­2022 మెయి­న్‌ మొదటి సెషన్‌ పరీక్షలు ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు, రెండో సెషన్‌ పరీక్షలు మే 24 నుంచి 29 వరకు ఉంటాయని ప్రకటించింది. వివిధ రాష్ట్రాల బోర్డుల పరీక్షలు అదే సమయంలో ఉండడం, సీబీఎస్‌ఈ ప్లస్‌2 తరగతుల పరీక్షల నేపథ్యంలో మళ్లీ రెండుసార్లు వేరే తేదీలను ప్రకటించినా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు ఆ ఏడాది జూన్, జూలై­కు పరీక్షలను వాయిదా వేశారు.

ఫలి­తంగా జూన్‌ 3న జరగాల్సిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీ­క్ష ఆగస్టు 28కి వాయిదా పడింది. ఈసారి అంత­కన్నా ఎక్కువగా డిసెం­బర్‌ ముందు నుంచే ఎన్నికల హడావుడి ఆరంభం కానుండడం, ముఖ్యమైన పార్లమెంటు ఎన్ని­క­లు కూడా జరగాల్సి ఉండడంతో జేఈఈ పరీక్షలు ఆల­­స్య­మయ్యే అవకాశాలే ఎక్కు­వగా ఉన్నా­యని ఆ­యా విద్యాసంస్థల నిపుణులు పే­ర్కొంటున్నారు. ఈ నేప­థ్యంలో 2024 జే­ఈఈ షెడ్యూల్‌ సెప్టెంబర్‌­లో విడు­దల చేస్తా­రో, లేదో అనుమానమేనని అంటున్నారు.

#Tags