Telangana History for Competitive Exams: జాతిరత్నాలు, నారీ జగత్తు, జీవన సామరస్యం లాంటి రచనలు చేసింది ఎవరు?

ఖండవల్లి లక్ష్మీ రంజనం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసిన సమయంలో తెలుగు భాషకు, తెలుగు ప్రజలకు విశేష సేవలందించారు. ఆయన ఆచార్య పదవిని చేపట్టాక ఎంఏలో సంస్కృతం లేదా ద్రావిడ భాషల్లో ఏదో ఒకటి తప్పక ఎంచుకునేలా ఏర్పాటు చేశారు. తెలుగును ద్వితీయ భాష చేయడం కోసం అకడమిక్‌ కౌన్సిల్‌తో పొరాడి గెలుపొందారు. విద్యార్థుల్లో తెలుగంటే మన మాతృభాష అనే భావన కలిగేలా చేశారు. విద్యార్థులతో అనేక మంది కవులపై చర్చాగోష్ఠులు నిర్వహించి, వారిలో పరిశోధనాభిరుచి పెంపొందించడానికి ప్రయత్నించారు.

తెలంగాణ వైతాళికులు ఖండవల్లి లక్ష్మీ రంజనం

మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ పరిపాలనా కాలంలో తెలుగు సాహిత్యానికి, చరిత్రకు ఖండవల్లి లక్ష్మీ రంజనం విశేష సేవ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేసిన ఆయన విద్యార్థుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. కర్తవ్య నిర్వహణలో అనునిత్యం అప్రమత్తంగా ఉండేవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు భాషకు ప్రముఖ స్థానం లభించడం వెనుక ఆయన విశేష కృషి దాగి ఉంది. ఖండవల్లి లక్ష్మీ రంజనం 1908లో తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట తాలూకాలోని బెల్లంపూడిలో జన్మించారు. బెల్లంపూడి సమీపంలోని ఊడుమూడులో ్రపాథమిక విద్య, అమలాపురంలో రెండో ఫారంను అభ్యసించారు. ఆయన తండ్రయిన సూర్యనారాయణ శాస్త్రి వరంగల్‌ మట్టెవాడలోని త్రిలింగాంధ్రాయుర్వేద కళాశాలలో సంస్కృత పండితుడిగా పని చేసేవారు. దీంతో లక్ష్మీ రంజనం కూడా వరంగల్‌ వచ్చి హన్మకొండ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్‌ పూర్తి చేశారు. 1924లో నిజాం కళాశాలలో బీఏ సంస్కృతం చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత సిటీ కాలేజీలో ఇంగ్లిష్‌ టీచర్‌గా కొంత కాలం పనిచేశారు. 1936లో ఎంఏ(తెలుగు–సంస్కృతం)లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు  లెక్చరర్‌గా చేరారు. రాయ్రపోలు సుబ్బారావు పదవీ విరమణ చేశాక ఆచార్య (్రపొఫెసర్‌) పీఠాన్ని అధిష్టించారు.
ఖండవల్లికి విద్యార్థి దశ నుంచే ఆదిరాజు వీరభద్రరావు లాంటి పరిశోధకులతో, గోలకొండ పత్రికా సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి లాంటి ప్రజా సాహిత్య సేవకులతో, లోకనంది నారాయణ లాంటి సాహిత్య పోషకులతో పరిచయం ఏర్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రెక్టార్‌ కిషన్‌ చంద్‌ లక్ష్మీ రంజనానికి సహాయ సహకారాలు అందజేశారు. కొమర్రాజు లక్ష్మణరాయ గ్రంథాలు ఖండవల్లిని విశేషంగా ప్రభావితం చేశాయి. ఖండవల్లి 1936 నుంచే సాహిత్యసేవ ్రపారంభించారు. ‘తెలుగుదుక్కి’ శీర్షికతో వ్యాసాలు ప్రచురించారు. త్రివేణి లాంటి ఆంగ్ల పత్రికల్లో ఆధునిక కవిత్వం గురించి అనేక వ్యాసాలు రాశారు.
హైదరాబాద్‌లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం కార్యదర్శిగా రెండేళ్లపాటు పనిచేశారు. పుస్తకాల సేకరణ, చందాల కోసం తెలంగాణ అంతటా పర్యటించారు. వర్థంతులు, జయంతులు ఎన్నో జరిపారు.

చ‌ద‌వండి: Asaf Jahi history: నిజాం వ్యక్తిగత సైన్యం పేరేంటి?

ఆంధ్ర సారస్వత పరిషత్‌ సభ్యులుగా పనిచేసి దాని విస్తరణకు విశేష కృషి చేశారు. ‘నిజాం రాష్ట్ర గ్రంథాలయ సంఘం’ కార్యదర్శిగా కూడా పనిచేశారు. కొమర్రాజు వదిలి పెట్టిన ‘విజ్ఞాన సర్వస్వం’ పూర్తి చేయాలనే ఉద్దేశంతో కొందరు మిత్రులతో కలిసి గ్రంథావలోకనం, విషయ సేకరణ ్రపారంభించారు. 1940ల్లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో విద్యుద్దీపాలు లేనందున ఆముదం దీపాల వెలుతురులోనే తన కృషిని కొనసాగించారు. 1944 నాటికి ‘విజ్ఞాన సర్వస్వం’ పూర్తి చేయాలని భావించారు. ఇందుకోసం ‘మహారాష్ట్ర జ్ఞాన కోశ్‌’ని ఆధారంగా తీసుకున్నారు. నాలుగైదు సంపుటాల విషయ సేకరణ చేశారు. 
ముద్రణకు సిద్ధమైన ఆ సంపుటాలు చోరికి గురికావడం వల్ల విజ్ఞాన సర్వస్వాన్ని ముద్రించడం సాధ్యపడలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృతి గురించి పాఠాలు బోధించారు. దానికోసం  చేసిన అధ్యయన ఫలితంగానే ఆంధ్రుల చరిత్ర –సంస్కృతి, ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం లాంటి గొప్ప గ్రంథాలను రచించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ‘విజ్ఞాన సర్వస్వం’ ప్రచురణ కోసం ప్రభుత్వం ద్వారా తిరిగి ప్రయత్నించారు.

ఆంధ్ర సారస్వత పరిషత్‌ వ్యవస్థాపకులు బిరుదు వెంకట శేషయ్య, లోకనంది నారాయణ  అంతకు ముందే ప్రయత్నించి విఫలమయ్యారు. మిత్రులు, అభిమానులు సహాయం చేస్తారనే నమ్మకంతో 1953లో బేతన భట్ల విశ్వనాథంతో కలిసి సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశ సమితి సంఘాన్ని స్థాపించారు. దీనికి మిమిడి పూడి వెంకట రంగయ్య చైర్మన్‌గా వ్యవహరించారు. ఈ సంఘం ద్వారా సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశం నాలుగు సంపుటాలను ప్రచురించారు.
ఖండవల్లి ఆంధ్ర రచయితల సంఘానికి అధ్యక్షులుగా పనిచేసి దాని తరఫున సిద్ధేశ్వర చరిత్ర, ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధం, సంస్కృతంలో అహోబిల పండితీయం (ఆంధ్ర వ్యాఖ్యా సహితం) ప్రచురించారు. ఓరియంటల్‌ కాలేజీని స్థాపించి 1958లో బీవోఎల్, డీవోఎల్‌ లాంటి ్రపాచ్యపట్టాలను విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు.

చ‌ద‌వండి: Telangana History Study Material: సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిందెవరు?

స్వామి వివేకానంద కమిటీ హైస్కూల్‌కు కార్యదర్శిగా పనిచేసి దాని భవనాన్ని నిర్మించారు. ఖండవల్లి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసిన సమయంలో తెలుగు భాషకు, తెలుగు ప్రజలకు విశేష సేవలందించారు. ఆయన ఆచార్య పదవిని చేపట్టాక ఎంఏలో సంస్కృతం లేదా ద్రావిడ భాషల్లో ఏదో ఒకటి తప్పకుండా ఎంచుకునేలా ఏర్పాటు చేశారు. తెలుగును ద్వితీయ భాష చేయడం కోసం అకడమిక్‌ కౌన్సిల్‌తోపోరాడి విజయం సాధించారు.

పీహెచ్‌డీని ప్రవేశపెట్టారు. విద్యార్థుల్లో తెలుగంటే మన మాతృభాష అనే భావన కలిగేలా చేశారు. విద్యార్థులతో అనేక మంది కవులపై చర్చాగోష్ఠులు నిర్వహించి, పరిశోధనాభిరుచి పెంపొందించేందుకు కృషి చేశారు. మహాభారతం, నాటకాలు, కవులపై సదస్సులు నిర్వహించి వాటిని గ్రంథ రూపంలో తెచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తరఫున ఆంధ్ర మహాభారతాన్ని పునర్ముద్రించారు. తెలంగాణ మాండలికాల అధ్యయనానికి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆంధ్రదేశ చారిత్రక భూగోళం (ది హిస్టారికల్‌ జాగ్రఫీ ఆఫ్‌ ఆంధ్ర) రచనకు ప్రయత్నం చేశారు. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఇల్లిందల సరస్వతీ దేవి

ఇల్లిందల సరస్వతీ దేవి తల్లిదండ్రులు కామరాజు వెంకట లక్ష్మమ్మ, వెంకటప్పయ్య.  ఈమె తండ్రి వెంకటప్పయ్య 1928లో నందిగామ తహసీల్దార్‌గా పని చేశారు. అదే సంవత్సరంలో ఇల్లిందల సీతారామరావుతో పన్నెండేళ్ల వయస్సులో సరస్వతీ దేవికి వివాహం చేశారు. అప్పుడు ఆమె రెండో ఫారం చదువుతున్నారు. ఆమె హైదరాబాద్‌లోని స్టాన్లీ గర్ల్స్‌ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్‌ వరకు చదివారు. చిన్న వయస్సులోనే తల్లి కావడంతో పై చదువులు చదవలేకపోయారు. తీరిక వేళల్లో ట్రూ స్టోరీ మేగజీన్‌ లాంటి కథల పత్రికలను చదివి, జిజ్ఞాసతో వాటిని అధ్యయనం చేశారు. ఆమె భర్త సీతారామరావు ఎం.సి. చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విజ్ఞానశాస్త్ర ఉపన్యాసకులుగా పని చేసేవారు. ఆయన తన భార్యను  ఎంతో ్రపోత్సహించారు. సరస్వతీ దేవి తన విజ్ఞానాన్ని మహిళలు, ప్రజల సేవకు వినియోగించింది. 

ఆంధ్రయువతీ మండలి స్థాపన

ఆ రోజుల్లో తెలంగాణలో మహిళల పరిస్థితి  దయనీయంగా ఉండేది. ముస్లింలు చాలా ముందంజలో ఉండేవారు. కానీ హిందువుల్లోని మధ్యతరగతి మహిళలు ఎంతో వెనుకబడి ఉండేవారు. ఉన్నత తరగతి స్త్రీల సంగతి చెప్పనక్కర్లేదు. సర్వసతీ దేవి విద్యార్థి దశ నుంచే ‘ఆంధ్రమహిళా సభ’ కార్యకలాపాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. మధ్యతరగతికి చెందిన హిందూ స్త్రీల కోసం, ముఖ్యంగా తెలుగువారి ప్రగతి కోసం ప్రత్యేకంగా ఒక సంస్థను నెలకొల్పాలని ఆమె భావించారు.

యల్లాప్రగడ సీతాకుమారితో కలిసి 1934లో ‘ఆంధ్రయువతీ మండలి’ని హైదరాబాద్‌లో స్థాపించారు. దీనికి రంగమ్మ ఓబుల్‌రెడ్డి అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఆంధ్రయువతీ మండలిని స్థాపించాక అందులో సభ్యులను చేర్చడం కష్టమైంది. నాటి కష్టాలను సరస్వతీ దేవి తన మాటల్లో ఇలా చె΄్పారు. ‘సభ్యులను చేర్చుకోవడానికి బయల్దేరేవాళ్లం. ఉన్నత కుటుంబాలకు చెందిన స్త్రీలు బయటకు వచ్చేవారు కాదు. సంస్థానాల రాణులు, జాగీర్దారిణీలు మాతో ముఖాముఖిగా మాట్లాడేవారు కాదు.

పరదా వెనుక లీలగా కనిపిస్తూ చెలికత్తెల ద్వారా లేదా ఆయాలతో కబురు పంపేవారు. సభ్యత్వ జాబితాలో తమ పేర్లను బిరుదులతో సహా రాయాలని పదే పదే చెప్పేవారు. యువతీ మండలికి సురవరం ప్రతాపరెడ్డి అసతోమా సద్గమయ అనే నినాదాన్ని సూచించారు. నియమావళిని బూర్గుల రామకృష్ణారావు సిద్ధం చేశారు.’ ఆంధ్రయువతీ మండలి కోసం సరస్వతీ దేవి పన్నెండేళ్ల పాటు శ్రమించారు.

యువతీ మండలిలో కార్యదర్శి, ఉపాధ్యక్ష పదవులను నిర్వహించారు. బూర్గుల రామకృష్ణారావు భార్య అనంత లక్ష్మీదేవి అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో ‘ఆంధ్రయువతీ మండలి’ కోసం బర్కత్‌పురాలో పెద్ద భవంతిని నిర్మించారు. ఇల్లిందల సరస్వతీ మండలిలో శాశ్వత సభ్యురాలు. ఈమె మండలి అభివృద్ధితోపాటు, భారత సంఘ సంక్షేమాల్లో సభ్యురాలిగా, బందిఖానాలు, ఆసుపత్రుల పర్యవేక్షకురాలిగా, శిశు 
సంక్షేమ సంఘ సభ్యురాలిగా ఎన్నో నూతన పథకాలను సూచించారు. ఆంధ్ర సారస్వత పరిషత్‌ నిర్వాహక సభ్యురాలిగా, శ్రీకృష్ణదేయరాయాంధ్ర భాషానిలయ నిర్వాహక సభ్యురాలిగా కొంత కాలం పాటు పనిచేశారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ హైదరాబాద్‌ శాఖకు నిర్వాహక సభ్యురాలిగా, ఉపాధ్యక్షులుగా కేంద్ర గ్రంథాలయ, శిశు శాఖ సభ్యురాలిగా ఆమె విశేష కృషి చేశారు.

సరస్వతీ దేవి రచనలు

ఆమె రచించిన మొదటి కథ, మొదటి వ్యాసం 1933లో ‘గోలకొండ’ పత్రికలో ప్రచురితమయ్యాయి. మహిళా, శిశు జనోద్ధరణ లక్ష్యంగా హైదరాబాద్‌లోని రేడియా కేంద్రానికి వ్యాసాలు, నాటికలు, కథలు రాశారు. జీవన సామరస్యం, నారీ జగత్తు, వెలుగు బాటలు, పండుగ బహుమతి, అక్కరకు వచ్చిన చుట్టం, ముత్యాల మనసు, పండుగ బహుమతి, జాతిరత్నాలు, బాలవీరులు మొదలైనవి ఆమె రచనలు. సరస్వతీ దేవి తల్లి వెంకట లక్ష్మమ్మ  బ్రహ్మ సమాజ నాయకులైన దేశిరాజు పెదబాపయ్య సోదరి.

కాబట్టి సరస్వతీ దేవికి చిన్నతనం నుంచే సంస్కరణ భావాలు అలవడ్డాయి. కానీ  ఆమె ఇద్దరు పిల్లలు మరణించడంతో సనాతన సంప్రదాయాల పట్ల ఆసక్తి చూపారు. 1958లో ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ఏర్పాటైనప్పుడు ఆమె చేసిన సంఘ సేవకు గుర్తుగా మండలిలో  సభ్యత్వం లభించింది. సరస్వతీ దేవి తన రచనల్లో వర్తమాన సమస్యలను ప్రధానంగా చర్చించేవారు. ‘నీలో చాలా శక్తి దాగి ఉంది. దాన్ని ఉపయోగించి ప్రకాశించడా నికి ప్రయత్నించు. మగవారిపై కోపం వద్దు, దేన్నీ యాచించవద్దు. సంపాదించుకోవాలి’ అనే సూచన లు ఆమె రచనల్లో కన్పిస్తాయి. సరస్వతీ దేవి దాదా పు మూడు దశాబ్దాల పాటు రచనలు చేశారు.

1.    ఖండవల్లి లక్ష్మీ రంజనం ఎప్పుడు జన్మించారు?
1) 1908    

2) 1925
3) 1910

4) 1945

సమాధానం: 1
2.    నిజాం రాష్ట్ర గ్రంథాలయ సంఘం  కార్యదర్శిగా పనిచేసిందెవరు?
    1) సురవరం ప్రతాపరెడ్డి
    2) ఆదిరాజు వీరభద్రరావు
    3) కొమర్రాజు లక్ష్మణరావు
    4) ఖండవల్లి లక్ష్మీ రంజనం

సమాధానం: 4
3.    ఆంధ్రుల చరిత్ర–సంస్కృతి, ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం గ్రంథాలు ఎవరు రచించారు?
    1) కొమర్రాజు లక్ష్మణరావు
    2) ఆదిరాజు వీరభద్రరావు
    3) ఖండవల్లి లక్ష్మీ రంజనం
    4) సురవరం ప్రతాపరెడ్డి

సమాధానం: 3
4.    సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కోశాన్ని ఎవరు రచించారు?
    1) ఖండవల్లి లక్ష్మీ రంజనం
    2) సురవరం ప్రతాపరెడ్డి
    3) కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
    4) విశ్వనాథ సత్యనారాయణ

సమాధానం: 1
5.    హైదరాబాద్‌లో ఆంధ్రయువతీ మండలిని ఏ సంత్సరంలో స్థాపించారు?
    1) 1942    2) 1934 
    3) 1936    4) 1952

సమాధానం: 2
6.    జాతిరత్నాలు, నారీ జగత్తు, జీవన సామరస్యం లాంటి రచనలు చేసింది ఎవరు?
    1) అనంత లక్ష్మీదేవి
    2) ఇల్లిందల సరస్వతీ దేవి
    3) ఎల్లాప్రగడ సీతాకుమారి
    4) సరోజినీ నాయుడు

సమాధానం: 2
7.    ఆంధ్రయువతీ మండలి తొలి అధ్యక్షురాలిగా పనిచేసింది ఎవరు?
    1) ఎల్లాప్రగడ సీతాకుమారి
    2) ఇల్లిందల సరస్వతీ దేవి 
    3) దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ 
    4) రంగమ్మ ఓబులరెడ్డి

సమాధానం: 4
8.    ‘తెలుగుదుక్కి’ శీర్షికతో వ్యాసాలు ప్రచురించింది ఎవరు?
    1) ఖండవల్లి లక్ష్మీ రంజనం
    2) ఇల్లిందల సరస్వతీ దేవి 
    3) కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
    4) విశ్వనాథ సత్యనారాయణ

సమాధానం: 1

#Tags