APPSC 950 Group-2 Notification 2023 : ఎనీటైమ్‌.. 950 గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌..ఈ నిబంధనల మేరకు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : నిరుద్యోగుల‌కు ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 950 గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ)కి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.
APPSC Group 2 Jobs Notification 2023 Details

 

ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన 508 గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ తాజాగా మరో 212 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీపీఎస్సీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) చిరంజీవి చౌదరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోపాటు గత నోటిఫికేషన్‌లో ఉద్యోగాలు పొంది చేరని పోస్టులు, క్యారీ ఫార్వార్డ్‌ పోస్టులు మరో 230 వరకు ఈ నోటిఫికేషన్‌లోనే భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. తద్వారా గ్రూప్‌–2 కింద దాదాపు 950 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. 

పది రోజుల్లో..

మరో పది రోజుల్లోనే నోటిఫికేషన్‌ జారీ చేసి ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించాలని సర్వీస్‌ కమిషన్‌ యోచిస్తోంది. గ్రూప్స్‌ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ పలు సందర్భాల్లో అభ్యర్థుల నుంచి వినతులు రావడంతో వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గతంలో అనుమతినిచ్చిన పోస్టులతో పాటు వీలైనంత ఎక్కువ సంఖ్యలో భర్తీ చేయాలని స్పష్టం చేయడంతో తాజాగా గ్రూప్‌ 2 విభాగంలో 212 పోస్టులకు అనుమతి ఇచ్చారు. ఆయా శాఖల నుంచి పోస్టుల ఖాళీలను నిర్దారించుకున్న వెంటనే భర్తీకి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ)కు ఉత్తర్వుల్లో సూచించారు.

నిబంధనల మేరకు ఈ పోస్టుల భర్తీకి వెంటనే..

రోస్టర్‌ పాయింట్లతో పాటు విద్యార్హతల ఆధారంగా నిబంధనల మేరకు ఈ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థికశాఖ కోరింది. గ్రూప్స్‌ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది చక్కటి అవకాశం. నోటిఫికేషన్‌ నాటికి ఆయా శాఖల్లో ఉన్న మరిన్ని ఖాళీలను సైతం కలపనున్నారు. దీంతోపాటు గత నోటిఫికేషన్‌లో ఉద్యోగాలు పొంది చేరని పోస్టులు, క్యారీ ఫార్వార్డ్‌ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్‌లోనే భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది.

గ్రూప్ 2 ప‌రీక్షావిధానం ఇలా..
గ్రూప్‌–2 పరీక్షను రెండు దశలుగా(స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామ్‌) నిర్వహిస్తారు. పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. మొదటి దశ స్క్రీనింగ్‌ టెస్ట్‌ 150 మార్కులకు ఉంటుంది. స్క్రీనింగ్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన వారికి 1:50 నిష్పత్తిలో రెండో దశ మెయిన్‌ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌లో ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటుంది.

APPSC Group 2 Jobs Notification 2023 Details :

#Tags