Ministry of Jal Shakti: ఐఐటీ హైదరాబాద్‌కు ‘గోదావరి’ బాధ్యత

సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి, కృష్ణా నది సహా ఆరు నదుల బేసిన్‌ నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసే పనిని కేంద్ర జలశక్తి శాఖ పలు విద్యా సంస్థలకు అప్పగించింది.

గోదావరి బేసిన్‌ నిర్వహణ ప్రణాళిక బాధ్యతను ఐఐటీ హైదరాబాద్, ఎన్‌ఈఈఆర్‌ఐ నాగ్‌పూర్‌కు అప్పగించింది. కృష్ణా నదీ బేసిన్‌ నిర్వహణ ప్రణాళిక బాధ్యతను ఎన్‌ఐటీ వరంగల్, ఎన్‌ఐటీ సూరత్‌కల్‌కు అప్పగించింది. ఇలా దేశంలోని 6 ప్రధాన నదులు నర్మదా, గోదావరి, కృష్ణా, కావేరి, పెరియార్, మహానది బేసిన్‌ నిర్వహణ ప్రణాళికను రూపొందించే బాధ్యతను 12 సాంకేతిక సంస్థలు తీసుకోనున్నాయి.

చదవండి: IITH: ఐఐటీహెచ్‌లో నేవీ ఇన్నోవేషన్‌ సెంటర్‌

ఈ మేరకు ఫిబ్ర‌వ‌రి 28న‌ 12 విద్యా సంస్థలు, నేషనల్‌ రివర్‌ కన్జర్వేషన్‌ డైరెక్టరేట్, జలశక్తి మంత్రిత్వ శాఖ మధ్య ఒప్పందం కుదిరింది. ఢిల్లీలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్, శాఖ సహాయ మంత్రులు రాజీవ్‌ చంద్రశేఖర్, బిశ్వేశ్వర్‌ తుడులతో పాటు 12 విద్యాసంస్థల డైరెక్టర్లు హాజరయ్యారు.

ఇప్పటికే దేశంలోని అతిపెద్ద నది అయిన గంగా బేసిన్‌ నిర్వహణ ప్రణాళికను ఐఐటీ కాన్పూర్‌ నేతృత్వంలోని ఏడు ఐఐటీల కన్సార్టియం విజయవంతంగా పూర్తి చేసిందని జలశక్తి శాఖ ప్రకటించింది. 

#Tags