AP Intermediate Results 2024 :ఇంటర్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా.... ఉత్తమ ఫలితాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు..
రాయచోటి: ఇంటర్ ఫలితాలు శుక్రవారం విడుదల య్యాయి. ఫలితాల్లో అన్నమయ్య జిల్లా 69 శాతం ఉత్తీర్ణతతో 22వ స్థానంలో నిలిచింది. అన్నమయ్య జిల్లా నుంచి మొదటి, రెండు సంవత్సరాలకు 26,638 మంది విద్యార్థులకు 25,249 మంది పరీక్షలకు హాజరయ్యారు. ప్రభుత్వ కళాశాలల నుంచి 10389 మందికి 9829 మంది పరీక్షలు రాయగా 6073 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేటు కళాశాలల నుంచి 16333 మందికి 15420 మంది హాజరవ్వగా 9173 మంది పాసయ్యారు. మొత్తం మీద జిల్లాలో 15246 మంది ఉత్తీర్ణత సాధించి 69 శాతంతో రాష్ట్రంలో 22వ స్థానాన్ని పొందారు. మార్చినెల 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో అన్నమయ్య జిల్లా నుంచి 25,249 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం 12978 మంది, రెండో సంవత్సరం 10384 మంది, ఒకేషనల్ మొదటి సంవత్సరం 1045, రెండో సంవత్సరంలో 842 మంది పరీక్షలు రాశారు. ఈ ఫలితాల్లో కూడా బాలుర కంటే బాలికలదే పైచేయిగా నిలిచింది. మొదటి సంవత్సరంలో బాలురు 43 శాతం ఉత్తీర్ణత కాగా బాలికలు 62 శాతం, రెండో సంవత్సరంలో బాలురు 62 శాతం, బాలికలు 75 శాతం, ఒకేషనల్ పరీక్షల్లో బాలురు ఫస్టీయర్ 47 శాతం, బాలికలు 66 శాతం, సెకండియర్లో బాలురు 56 శాతం, బాలికలు 79 శాతం ఉత్తీర్ణత సాధించారు.
● ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేది నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నారు.
ఉత్తమ ఫలితాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు..
శుక్రవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు.
● మదనపల్లి బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల(ఇంగ్లీష్ మీడియం)లో రెండోసంవత్సరం ఎంపీసీకి చెందిన ఎస్.తహుర సమర్ 1000 మార్కులకు 979 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది.
● మదనపల్లె బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల(ఇంగ్లీష్ మీడియం)లో బైపిసి విద్యార్థిని గీతా మాధురి 1000 మార్కులకు గాను 964 మార్కులు సాధించింది.
● మదనపల్లె బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల(ఇంగ్లీష్ మీడియం)లో సీఈసీ విద్యార్థిని ఎస్.సమీర కౌషార్ 1000 మార్కులకు గాను 951 మార్కులు రాబట్టింది.
● రాయచోటి బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల(ఇంగ్లీష్ మీడియం)లో రెండో సంవత్సరం హెచ్ఈసీ విద్యార్థిని కుష్బూర్ 1000 మార్కులకు 964 మార్కులు సాధించింది.