Andhra Pradesh: స్మార్ట్‌ చదువులకు సిద్ధం

అనంతపురం ఎడ్యుకేషన్‌: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక విద్యారంగంలో సమూల మార్పులు వచ్చాయి. ప్రభుత్వ బడుల్లో చాక్‌పీస్‌లకు గుడ్‌ బై చెప్పే రోజులు వచ్చేశాయి. చాక్‌పీస్‌, బ్లాక్‌ బోర్డులతో పని లేకుండా పూర్తిస్థాయి డిజిటల్‌ బోధన అందుబాటులోకి రానుంది.

ఇప్పటిదాకా తరగది గదిలో టీచర్లు బ్లాక్‌, గ్రీన్‌ బోర్డులను ఉపయోగిస్తూ పాఠాలు చెప్పేవారు.
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కార్పొరేట్‌ బడులకు దీటుగా, అంతకు మించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లల్లో బోధనా పద్ధతుల్లో సముల మార్పులు వస్తున్నాయి.

ఒకప్పుడు ప్రభుత్వ బడులంటే సరైన మౌలిక వసతులు ఉండవనే పరిస్థితి నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ బడులంటేనే ప్రత్యేకంగా మాట్లాడుకునే రోజులు వచ్చాయి. దీనంతటికీ కారణం ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మౌలిక వసతులు కల్పించడం, చకచకా మారుతున్న డిజిటలైజేషన్‌ విధానమే.

చదవండి: Andhra Pradesh: ఫలించిన సర్కారు చదువుల యజ్ఞం.. సత్ఫలితాలనిస్తున్న విద్యా పథకాలు
ప్రపంచస్థాయిలో పోటీ పడేందుకు ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లల్లో లేనివిధంగా రూ.కోట్లు ఖర్చుచేసి ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌, స్మార్ట్‌ టీవీలను తీసుకొచ్చింది. నిరంతరాయంగా డిజిటల్‌ బోధన అందించేందుకు, సమకాలీన ప్రపంచ పోకడలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అన్ని పాఠశాలలను డిజిటలైజేషన్‌ చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి పాఠశాలకు ప్రభుత్వం ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పిస్తోంది.

860 స్కూళ్లకు 998 స్మార్ట్‌ టీవీలు

రెండోవిడతలో జిల్లా వ్యాప్తంగా నాడు–నేడు పనులు చేపట్టిన 860 ప్రాథమిక పాఠశాలలకు 998 స్మార్ట్‌ టీవీలు రానున్నాయి. జనవరి రెండోవారానికి రెండోవిడత స్మార్ట్‌ టీవీలన్నీ జిల్లాకు చేరతాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. తొలివిడతలో 414 ప్రాథమిక పాఠశాలలకు 759 స్మార్ట్‌టీవీలు వచ్చాయి.

ఇవన్నీ ఆయా స్కూళ్లలోని తరగతి గదుల్లో ఏర్పాటు చేశారు. వీటిద్వారానే ప్రస్తుతం బోధన సాగుతోంది. రెండు విడతల్లో కలిపి మొత్తం 1,757 స్మార్ట్‌టీవీలు కేటాయించారు. రెండు విడతల్లో దాదాపు అన్ని స్కూళ్లలోనూ స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు చేసినట్లయింది.

 

#Tags