Good news for Anganwadis: అంగన్వాడీలకు గుడ్న్యూస్
సాక్షి, మచిలీపట్నం: కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లకే పరిమితమైన ఖరీదైన ఆంగ్ల విద్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వీటిలో చదివే పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించడమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నారు.
వీటిల్లో భాగంగానే అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఆంగ్ల విద్యను చేరువ చేశారు. పౌష్టికాహారం అందజేయడం, చిన్నారుల్లో మానసిక ఆనందమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా ప్రభుత్వం మార్చింది.
అన్ని ప్రాజెక్టుల చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 55 వేల ప్రీ ప్రైమరీ స్కూళ్లలో టీచర్లు చిన్నారులకు ఆంగ్లంలో ఓనమాలు దిద్దిస్తున్నారు. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రీ స్కూల్ సిలబస్ను సైతం రూపొందించింది.
8 లక్షల మందికి ఆంగ్ల బోధన
రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ స్కూల్స్ నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల్లో మూడేళ్ల నుంచి ఏడేళ్లలోపు వయసున్న 8,02,573 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. టీచర్లు.. బోర్డులు, టీవీలు, చార్ట్లపై రాస్తూ పిల్లలకు బోధిస్తున్నారు. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చిన నేపథ్యంలో వాటిలో అందుకనుగుణంగా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించింది.