Warangal CP Kishore Jha: ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు.. స్టూడెంట్స్‌ ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి

వరంగల్‌ : కాలేజీల్లో విద్యార్థులు ర్యాగింగ్‌ లాంటి చర్యల కు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు తమ భవిష్యత్‌ను నిర్మించుకోవడంలో కళాశాల క్యాంపస్‌ కీలక పాత్ర పోషి స్తుందని పేర్కొన్నారు.

భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కళాశాలలోని తోటి విద్యార్థులతో స్నేహపూరిత వాతావరణం ఉండే విధంగా చూసుకోవాలని పేర్కొన్నారు. ర్యాగింగ్‌ అనేది అత్యంత అమానుష చర్యని, తోటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించ డం, వారిని ఇబ్బందులకు గురిచేయడం మంచి విద్యార్థి లక్ష్యణం కాదని వివరించారు. ర్యాగింగ్‌ కేసుల్లో ఇరుక్కుంటే విద్యార్థులు బంగారు భవిష్యత్‌ కోల్పోతారని హెచ్చరించారు.

కళాశాల యాజమాన్యంతో పాటు అధ్యాపకులు తరచూ కొత్తగా చేరిన విద్యార్థులతో సంప్రదిస్తూ వారిలో ర్యాగింగ్‌ మహమ్మారిని వ్యతిరేకించే విధంగా ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంపొందించాలని సూచించారు. ఎవరైనా కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడినా, ర్యాగింగ్‌ గురవుతున్నట్లు అనిపించినా విద్యార్థులు మౌనంగా ఉండకుండా తక్షణమే డయల్‌ 100 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
 

#Tags