Samagra Shiksha: బంగారు ‘భవిత’.. సమగ్రశిక్ష ద్వారా సంక్షేమ పథకాల వర్తింపు

అనంతపురం ఎడ్యుకేషన్‌: ప్రత్యేక అవసరాల పిల్లల ఉజ్వల భవితకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.

వారిలో మార్పు తీసుకొచ్చి బడిబాట పట్టించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోంది. సమగ్ర శిక్ష ద్వారా ప్రత్యేకంగా భవిత కేంద్రాలు ఏర్పాటు చేసి ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రీసోర్స్‌ పర్సన్‌ (ఐఈఆర్పీ)ల ద్వారా ఆ పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అవసరమైన పిల్లలకు ఫిజియోథెరపిస్టుల ద్వారా వారం వారం ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైన తర్వాత ఈ నెల 1 నుంచి ఐఈఆర్పీలు గ్రామాల్లో సర్వే చేస్తూ ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తిస్తున్నారు. 

0–18 ఏళ్లలోపు ఉన్న పిల్లల కోసం సర్వే పక్కాగా చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో సచివాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరా తీస్తున్నారు. ఇప్పటిదాకా 639 మంది పిల్లలను గుర్తించారు. పాఠశాలల్లో చేరని పిల్లలతో పాటు మధ్యలో చదువు మానేసిన పిల్లలు, చదువుతుంటే అంగన్‌వాడీనా?, పాఠశాలనా? అనే అంశాలపై సమగ్రంగా సర్వే చేస్తున్నారు. వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు ఆన్‌లైన్‌లో పంపుతున్నారు.

తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ..
ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా కొందరు తల్లిదండ్రులు ప్రత్యేక పిల్లలను బడులకు పంపేందుకు ఆసక్తి చూపడం లేదు. అలాంటి వారికి ఐఈఆర్పీలు అవగాహన కల్పిస్తున్నారు. చదువు వల్ల కలిగే ప్రయోజనాలు, బడులకు పంపితే వారిలో కలిగే మార్పులు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సదుపాయాలను తెలియజేస్తున్నారు. అంగన్‌వాడీ స్కూళ్లు, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, భవిత కేంద్రాల్లో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.

సదుపాయాలూ ‘ప్రత్యేకం’
ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రభుత్వం నాలుగు రకాల అలవెన్సులు అందజేస్తోంది. బడికి వచ్చే మానసిక, బుద్ధిమాంద్యం పిల్లలకు, ఇంటివద్ద ఉంటున్న వారికి, బాలికలకు ప్రత్యేక అలవెన్సులు ఇస్తున్నారు. బడికొచ్చే పిల్లలకు రీడర్‌ అలవెన్స్‌ కింద నెలకు రూ. 200 చొప్పున పది నెలలకోసారి రూ.2 వేలు అందజేస్తున్నారు. అలాగే ఎస్కార్ట్‌ అలవెన్స్‌ కింద నెలకు రూ.300 చొప్పున 10 నెలలకు రూ.3 వేలు ఇస్తున్నారు. 

బాలికలకు ప్రత్యేకంగా గర్ల్‌చైల్డ్‌ అలవెన్స్‌ కింద నెలకు రూ.200 ప్రకారం పది నెలలకు రూ.2 వేలు ఇస్తున్నారు. బడికి రాలేని పిల్లలకు హోమ్‌ బేస్డ్‌ అలవెన్స్‌ కింద నెలకు రూ. 300 ప్రకారం పది నెలలకు రూ. 3 వేలు ఇస్తారు. బడికి వెళ్తున్న వారికి ఇతర విద్యార్థులతో పాటు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, షూ, టై అందజేస్తారు. ‘అమ్మ ఒడి’ పథకం వర్తింపజేస్తున్నారు. దివ్యాంగ చిన్నారుల విద్యను డిజిటలైజేషన్‌ చేసి ట్యాబ్‌లు కూడా అందజేస్తున్నారు.

Student Tracking System: ప్రతి విద్యార్థికీ ‘పెన్‌’.. విద్యార్థుల ట్రాకింగ్‌ కోసం కొత్త విధానం

ముమ్మరంగా సర్వే
జిల్లాలో 0–18 ఏళ్లలోపు ప్రత్యేక పిల్లలను గుర్తించేందుకు సర్వే ముమ్మరంగా సాగుతోంది. కలెక్టర్‌, సమగ్ర శిక్ష డీపీసీ, ఏపీసీ ఆదేశాల మేరకు ప్రతి గ్రామాన్నీ జల్లెడ పడుతున్నాం. ఐఈఆర్పీలు ఆయా గ్రామాలకు వెళ్లి ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులను కలిసి వారి పిల్లలు ఏ స్కూళ్లలో ఎన్‌రోల్‌ అయ్యారో తెలుసుకుంటారు. ఎక్కడా ఎన్‌రోల్‌ కాని పిల్లలను సమీప పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక అవసరాల పిల్లల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. – షమా, సహిత విద్య జిల్లా కోఆర్డినేటర్‌, సమగ్రశిక్ష, అనంతపురం

#Tags