Skip to main content

శ్రమ, నవకల్పనలతో జాతీయాదాయం వృద్ధి!!

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించిన సిలబస్‌లో ఎకానమీ సబ్జెక్ట్‌కు సంబంధించి ‘ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి’ అనే అంశాన్ని గ్రూప్-1, 2, 3ల్లో కామన్‌గా పొందుపర్చింది. ఈ సబ్జెక్ట్‌ను గ్రూప్ 1లో పేపర్ 4గా, గ్రూప్ 2, గ్రూప్ 3ల్లో పేపర్ 3గా 150 మార్కులకు చేర్చారు. వీటిలో సబ్ టాపిక్‌లుగా ఇండియన్ ఎకానమీ- అభివృద్ధి; తెలంగాణ ఎకానమీ; అభివృద్ధి, పర్యావరణ సమస్యలు అనే అంశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యులు, హెచ్‌సీయూ ప్రొఫెసర్ జె. మనోహర్‌రావు అందిస్తున్న ప్రత్యేక వ్యాసం!
గ్రూప్-1లో అడిగే ప్రశ్నల స్థాయి ప్రామాణికత ఎక్కువ. ఇందులో ఇండియన్ ఎకానమీ, డెవలప్‌మెంట్‌కు సంబంధించి అయిదు ఉప భాగాలున్నాయి. వీటిని వరుస క్రమంలో అధ్యయనం చేస్తే.. విషయ పరిజ్ఞానంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడానికి అనుగుణంగా ఉంటుంది. మొదటగా జాతీయ ఆదాయ సూత్రాలు, ఆదాయ గణన విలువ సృజన గురించి ఇచ్చారు. రెండో ఉపభాగంలో పేదరికం- నిరుద్యోగం; మూడో ఉప విభాగంలో ద్రవ్య చెలామణి- బ్యాంకింగ్ వ్యవస్థ; నాలుగో ఉప విభాగంలో ప్రభుత్వ విత్తం; అయిదో ఉప విభాగంలో భారత ప్రణాళికా రచన, లక్ష్యాలు, ప్రాథమ్యాలను పేర్కొన్నారు. మొదటి ఉప విభాగం ‘జాతీయ ఆదాయం, సూత్రాలు, గణన- నామమాత్రపు(నామినల్) ఆదాయం, వాస్తవ(రియల్) ఆదాయం, భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, జాతీయ ఆదాయం తీరుతెన్నులను పరిశీలిద్దాం...

జాతీయ ఆదాయం
ఒక దేశంలో నిర్దిష్ట కాలంలో(సాధారణంగా ఒక సంవత్సర కాలం) ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల విలువను ఆ దేశజాతీయ ఆదాయంగా పరిగణిస్తారు. దీన్ని జాతీయ ఉత్పాదన అని కూడా వ్యవహరిస్తారు. ఒక దేశంలోని జీవన ప్రమాణాలను, ప్రజల స్థితిగతులను; ఆ దేశం ప్రగతి పథాన నడుస్తున్న తీరును వివరించే సూచీ(ఇండికేటర్)గా జాతీయ ఆదాయాన్ని పేర్కొంటారు. దీనికి స్థూల జాతీయ ఉత్పత్తి అని మరోపేరు. మన దేశంలోని ‘కేంద్ర గణాంక వ్యవస్థ’(సీఎస్‌వో-సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్) నిర్వచనం ప్రకారం- భారతదేశంలో నివాసముంటున్న సాధారణ పౌరులు తమ కారకాల (శ్రమ, భూమి, మూలధనం, వ్యవస్థాపన) ఆదాయం ద్వారా సంపాదించుకునే వేతనాలు(జీతాలు), భాటకం(రెంట్), వడ్డీ, ఇంకా లాభాల సమగ్ర సంచయనాన్ని ఒక సంవత్సర కాలంలో సమీకృత గణన చేస్తే వచ్చేది జాతీయ ఆదాయం. ఇది అయిదు రకాలుగా ఉంటుంది. స్థూల జాతీయ ఉత్పత్తి, స్థూల దేశీయ ఉత్పత్తి, నికర జాతీయ ఉత్పత్తి, వ్యక్తిగత ఆదాయం, తక్షణ వినియోగ ఆదాయం.

స్థూల జాతీయ ఉత్పత్తి
ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన వస్తువులు, సేవలను ఆ కాలంలో అమల్లో ఉన్న మార్కెట్ ధరల ఆధారంగా నిర్ధారించినప్పుడు స్థూల దేశీయ ఉత్పత్తి అని అంటారు. ఈ స్థూల దేశీయ ఉత్పత్తికి, అదే కాలంలో వచ్చిన విదేశీ నికర కారక ఆదాయాన్ని కలిపితే అది స్థూల జాతీయ ఉత్పత్తికి సమానం.

స్థూల దేశీయ ఉత్పత్తి + విదేశీ నికర కారకాదాయం = స్థూల జాతీయ ఉత్పత్తిగా పరిగణించవచ్చు. అయితే ఇదంతా నామమాత్రపు అంటే నామినల్ ఆదాయం మాత్రమే.

ఒక సంవత్సర కాలంలో వచ్చే ధరల హెచ్చుతగ్గుల ఒరవడికి అనుగుణంగా వాస్తవ ఆదాయం విలువ మారుతూ ఉంటుంది. అంటే.. ద్రవ్యోల్బణం ఆదాయపు అసలు వాస్తవ విలువను నిర్ధారిస్తుంది.
జాతీయ ఆదాయ గణన, అంచనాలు మూడు పద్ధతుల్లో నిర్వహిస్తారు...
  1. ఆదాయ పద్ధతి,
  2. వ్యయ మదింపు పద్ధతి,
  3. వస్తూత్పత్తి పద్ధతి.

ఆదాయ పద్ధతి
ఇందులో వేతనాలు, భాటకాలు, వడ్డీలు (వివిధ రకాలు), కంపెనీల్లో సంపాదించిన డివిడెండ్లు, అవిభాజిత కార్పొరేట్ లాభాలు, మిశ్రమ ఆదాయాలు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, తరుగుదల, నికర విదేశీ ఆదాయం లాంటివి జాతీయ ఆదాయాన్ని నిర్ధారిస్తాయి. ఒక్క తరుగుదల మినహాయించి అన్నీ ధనాత్మక సంకేతాన్ని కలిగి ఉంటాయి.

వ్యయ మదింపు పద్ధతి
ఈ పద్ధతిలో రకరకాల ఖర్చులను అంచనా వేసి జాతీయ ఆదాయాన్ని గణిస్తారు. స్థూల దేశీయ ప్రైవేటు ఆదాయం, ప్రైవేటు వినిమయ ఖర్చు, నికర విదేశీ ఆదాయాలు, ప్రభుత్వ వ్యయం లేదా ప్రభుత్వ వస్తు, సేవలపై ఖర్చు, అంతా కలిపితే వచ్చే దాన్ని జాతీయ ఆదాయంగా పేర్కొనవచ్చు.

వస్తూత్పత్తి పద్ధతి
ఈ పద్ధతిలో ఒక సంవత్సరకాలంలో ఉత్పత్తి అయిన వస్తువుల, సేవల అంతిమ మార్కెట్ విలువని గణించి, ఆ సమగ్ర విలువ నుంచి ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించిన మాధ్యమిక వస్తువుల, ముడి సరుకుల విలువల మినహాయించాల్సి ఉంటుంది. ఆ వచ్చిన నికర విలువనే జాతీయాదాయంగా పేర్కొనవచ్చు. ఈ పద్ధతిలో స్థూల జాతీయ ఉత్పత్తిని గణించేప్పుడు ఈ కింది షరతులు వర్తిస్తాయి.
  1. వస్తువులు, సేవల విలువను ద్రవ్య రూపంలో మాత్రమే లెక్కించడానికి అనుగుణంగా ఉండాలి.
  2. కేవలం మార్కెట్ ధరలని మాత్రమే వర్తించాలి.
  3. ఉచిత సేవలను జాతీయాదాయ గణనలో లెక్కించరు.
  4. కేవలం వర్తమాన సంవత్సరమే పరిగణించాలి.
  5. అసాంఘిక, చట్టవ్యతిరేక, మాఫియా ఆదాయాలు పరిగణనలోకి రావు. ఈ రకంగా వచ్చిన సమగ్ర వస్తూత్పత్తి, సేవలను మార్కెట్ ధరలతో హెచ్చవేస్తే జాతీయ ఆదాయ విలువ వస్తుంది.

స్థూల జాతీయ ఆదాయం
ఇప్పటివరకు స్థూల జాతీయ ఆదాయ విలువ మార్కెట్ ధరల ప్రకారం గణించాం. మరో పద్ధతిలో స్థూల జాతీయ ఆదాయ గణన కారకాల మూల్యాంకనం ఆధారంగా చేయవచ్చు. స్థూల జాతీయ ఉత్పత్తిలో నుంచి పరోక్ష పన్నుల మొత్తాన్ని నికరంగా తీసేస్తే వచ్చే విలువనే స్థూల జాతీయ ఉత్పాదన కారకాల ఆధారంగా వచ్చిన ఆదాయంగా చెప్పవచ్చు. దీనికే స్థూల జాతీయ ఆదాయమనే పర్యాయ పదం కూడా ఉంది. సంకేతాలలో ఈ కింది విధంగా నిర్వచించవచ్చు. స్థూల జాతీయ ఉత్పత్తి కారకాల మూల్యాంకనం ఆధారంగా (జీఎన్‌పీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్) = స్థూల జాతీయ ఉత్పత్తి మార్కెట్ ధరల్లో(జీఎన్‌పీ ఎట్ ఎంపీ)- నికర పరోక్ష పన్నులు + రాయితీలు (సబ్సిడీలు). ఉత్పత్తి వ్యయాల నుంచి మార్కెట్ ధరల వ్యత్యాసాన్ని తీసివేస్తే వచ్చే గణాంకాన్ని రాయితీగా నిర్వహించవచ్చు.

నికర జాతీయ ఉత్పత్తి
ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించే రకరకాల తయారీ పరిజ్ఞానాలు, వాడే యంత్రాలు, సామగ్రి, లేదా పెట్టుబడిలో కొంతభాగం సాలీనా తరుగుదలలో పోతుంది. స్థూల జాతీయ ఉత్పత్తిలో నుంచి సాలీనా తగ్గిపోయే ఆ తరుగుదల(డిప్రిషియేషన్)ని తీసివేస్తే వచ్చే నికర ఆదాయాన్నే నికర జాతీయ ఉత్పత్తి లేదా ఆదాయంగా నిర్వచిస్తారు. స్థూల జాతీయ ఉత్పత్తి (జీఎన్‌పీ) - తరుగుదల (డిప్రీషియేషన్) = నికర జాతీయ ఉత్పత్తి (ఎన్‌ఎన్‌పీ)గా చెప్పవచ్చు.

ప్రైవేటు రంగ ఆదాయం
‘సంపూర్ణ కారకాల వినియోగం ద్వారా, ప్రపంచ ఏజెన్సీల ద్వారా కానీ, ప్రభుత్వ ఆదాయ వ్యయాల ద్వారా కానీ.. అన్ని రకాల వనరుల మూలంగా ప్రైవేటు రంగానికి సమకూరే ఆదాయాన్ని ప్రైవేటు ఆదాయంగా’ కేంద్ర గణాంక శాఖ నిర్వచించింది.

వ్యక్తిగత ఆదాయం
వ్యక్తులు వాస్తవంగా గడించే ఆదాయమే వ్యక్తిగత ఆదాయం. అన్ని వనరుల ద్వారా ప్రభుత్వ రాయితీ, తదితరాలు కూడా కలుపుకొని వ్యక్తులు ఆర్జించే ఆదాయమే వ్యక్తిగత ఆదాయం. మరోరకంగా నిర్వచించాలంటే..ఒకదేశ పౌరులు ప్రత్యక్షపన్నులు చెల్లించక ముందు కలిగివున్న సమగ్ర ఆదాయాన్నే వ్యక్తిగత ఆదాయంగా చెప్పొచ్చు.
వ్యక్తిగత ఆదాయం = ప్రైవేటు ఆదాయం + పంచకుండా ఉండిన కార్పొరేట్ లాభాలు + ప్రత్యక్షపన్నులు.

వినిమయంకాని ఆదాయం
తక్షణ వినిమయం కోసం ఉపయోగించకుండా తమవద్దే ఉంచుకున్న ఆదాయాన్ని వినిమయం కోసం ఆదాయం లేదా వినియోగించుకోకుండా తమ వద్ద మిగిలిపోయిన ఆదాయాన్ని డిస్పోజబుల్ ఆదాయంగా కూడా వ్యవహరిస్తున్నారు. వినిమయంకాని ఆదాయం = వ్యక్తిగత ఆదాయం - ప్రత్యక్ష పన్నులు - ప్రభుత్వం ద్వారా లభించే చెల్లింపులు.

ఇంకా రెండు ముఖ్య విషయాలు ఈ అంశంలో చర్చించాలి. మొదటిది యధార్థ ఆదాయం, లేదా వాస్తవ ఆదాయం. రెండోది తలసరి ఆదాయం. ఒక సంవత్సరంలో వ్యవహరించే ఆదాయాన్ని జాతీయ మార్కెట్ ధరల ఆధారంగా లెక్కించడం వల్ల రూపాయి విలువ పెరిగిందా, తగ్గిందా చెప్పడం కష్టం. ఎందుకంటే.. ముందుగా చెప్పినట్లు ద్రవ్యోల్బణ ప్రభావానికి జీవన ప్రమాణాలు ఆటుపోట్లను రుచి చూస్తాయి. అందుకే మార్కెట్ ధరల ఆధారితంగా లెక్కగట్టిన జాతీయ ఆదాయాన్ని నామమాత్రపు ఆదాయంగా పేర్కొన్నాం. ఒక సంవత్సరాన్ని మూల సంవత్సరంగా నిర్ణయించి (ఉదా: 2010=100) దాని ఆధారంగా 2015లో జాతీయ ఆదాయ విలువని గణించినప్పుడు దాన్ని యధార్థ ఆదాయంగానూ, లేదా ద్రవ్యోల్బణాన్ని సవరించి నిర్ధారించిన జాతీయాదాయంగా పరిగణిస్తాం. ఒకదేశ ప్రగతిని అంచనా వేసేటప్పుడు ఈ సూత్రాలు చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. అయితే తలసరి ఆదాయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం కూడా ఉంది. జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చిన ఫలమే తలసరి ఆదాయంగా నిర్వచించవచ్చు.
తలసరి ఆదాయం = జాతీయ ఆదాయం / దేశ జనాభా.

ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ తలసరి ఆదాయం కంటే ఎక్కువగా ఉందన్న ప్రస్తావన వస్తోంది. దేశానికి గానీ, రాష్ట్రానికి గానీ తలసరి ఆదాయం చాలా ముఖ్యమైన విషయంగా పరిగణిస్తారు. ఒక దేశంలోని లేదా రాష్ట్రంలోని సహజ వనరులు, ప్రకృతి సంపద, ఆ దేశ ప్రగతిలో ప్రముఖ పాత్ర నిర్వర్తిస్తాయి. భూమి, పెట్టుబడితోపాటు శ్రమ చాలా ప్రధానమైన భూమిక పోషిస్తుంది. ఏ సంపదకైనా శ్రమ తోడుగా లేనిదే విలువ సృజన, జాతీయ సంపద సాధ్యం కాదు. సాంకేతిక పరిజ్ఞానం, నవకల్పనలు, స్థిర ప్రభుత్వం, కల్లోలం లేని రాజకీయాలు జాతీయ ఆదాయాన్ని వృద్ధిపర్చడంలో తోడ్పడతాయి!!
Published date : 14 Oct 2015 11:50AM

Photo Stories