Skip to main content

శ్రీకృష్ణ కమిటీ నివేదిక- ఆర్థికాంశాలు

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లోని 8 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో కేంద్ర హోంమంత్రి 2010, జనవరి 5న సమావేశమయ్యారు. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై సంప్రదింపులు జరిపేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2010, ఫిబ్రవరి 3న ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అదే ఏడాది డిసెంబర్ చివర్లో నివేదిక సమర్పించింది.
కమిటీ ఛైర్‌పర్సన్: జస్టిస్ బి.ఎన్.శ్రీకృష్ణ
సభ్య కార్యదర్శి: వినోద్ కుమార్ దుగ్గల్
సభ్యులు: ప్రొ.రణబీర్‌సింగ్, డా.అబుసలే షరీఫ్, ప్రొ.రవీందర్ కౌర్
కమిటీ పరిశీలించిన అంశాలు- విధులు
  • ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు డిమాండ్, సమైక్యాంధ్రను కొనసాగించాలన్న డిమాండ్ నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులు.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో ప్రాంతాల వారీగా జరిగిన అభివృద్ధి తీరుతెన్నులు.
  • డిమాండ్ల నేపథ్యంలో రాష్ట్రంలోని పరిణామాలు వివిధ వర్గాల ప్రజలపై చూపిన ప్రభావం.
  • విపత్కర పరిస్థితుల నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కాపాడేందుకు రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలతో సంప్రదింపులు జరిపి పరిష్కార మార్గాలు, కార్యాచరణ ప్రణాళిక, దిశానిర్దేశాన్ని సిఫార్సు చేయటం.
నివేదికలోని అంశాలు- విశ్లేషణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ముఖ్య ప్రాంతాలు ఉన్నాయి. మొత్తం జనాభాలో 40.6 శాతం మంది తెలంగాణలో, 41.6 శాతం మంది కోస్తాంధ్రలో, 17.6 శాతం మంది రాయలసీమలో నివసిస్తున్నారు. తెలంగాణలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల జనాభా మొత్తం జనాభాలో 24.7 శాతం. ఇది కోస్తాంధ్రలో 22.3 శాతం కాగా రాయలసీమలో 19.5 శాతం. మైనార్టీల జనాభా కోస్తాంధ్రతో పోల్చినప్పుడు తెలంగాణలో ఎక్కువ.
వృత్తి, ఉపాధి
  • మూడు ప్రాంతాల్లోనూ 1993 నుంచి 2005 మధ్యకాలంలో వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా చేపట్టిన వారి సంఖ్యలో తగ్గుదల ఏర్పడినట్లు శ్రీకృష్ణ కమిటీ పేర్కొంది. తెలంగాణలో వ్యవసాయం ప్రధానవృత్తిగా ఉన్న వారి శాతం 39 నుంచి 25 శాతానికి; కోస్తాంధ్రలో 25 నుంచి 21 శాతానికి; రాయలసీమలో 48 నుంచి 39 శాతానికి తగ్గింది.
  • వ్యవసాయం నుంచి మరో వృత్తికి మారిన వారి సంఖ్య తెలంగాణ, రాయలసీమలో ఎక్కువ కాగా కోస్తాంధ్రలో తక్కువ. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ కూలీల సంఖ్య 38 నుంచి 44 శాతానికి పెరిగింది. వ్యవసాయ కూలీల సంఖ్య రాయలసీమలో 24 నుంచి 39 శాతానికి పెరగ్గా, కోస్తాంధ్రలో ఒక శాతం మార్పు నమోదైంది.
  • వ్యవసాయేతర కార్మికుల సంఖ్య తెలంగాణ, కోస్తాంధ్రలో స్వల్పంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర రంగాల్లో స్వయం ఉపాధి పొందుతున్న వారి సంఖ్య తెలంగాణ, రాయలసీమల్లో మారకపోగా కోస్తాంధ్రలో మాత్రం నాలుగు శాతం తగ్గింది. ఇంట్లోనే ఉంటూ నెలవారీ ఆదాయాన్ని పొందుతున్న వారి సంఖ్య తెలంగాణలో ఎక్కువ పెరగ్గా, రాయలసీమలో గణనీయంగా తగ్గింది.
ఆదాయాల్లో అసమానతలు
  • కోస్తాంధ్ర గ్రామీణ ప్రాంతాల్లో సంపన్న వర్గం మినహా అన్ని ఆదాయ వర్గాల్లోనూ తలసరి ఆదాయంలో వృద్ధి కనిపించింది. రాయలసీమలో పూర్తిగా అణగారిన, అట్టడుగు వర్గాలు, ఉన్నత వర్గాల తలసరి ఆదాయం తగ్గుతూ వచ్చింది. ఇక తెలంగాణ ప్రాంతంలో కేవలం ఉన్నత వర్గాల వారే అభివృద్ధి చెందగా పేదలు, అణగారిన వర్గాల తలసరి ఆదాయం క్రమంగా భారీస్థాయిలో తగ్గింది.
  • తెలంగాణలోని ఆదాయ మార్పుల్లో పరస్పర విరుద్ధమైన వ్యత్యాసాల కారణంగా ఈ ప్రాంతంలోని పేదల జీవితం దుర్భరంగా మారిందని నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనం (2005) ఆధారంగా కమిటీ పేర్కొంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నత, సంపన్న వర్గాలు, భూస్వామ్య వర్గాలు ఆర్థిక ప్రయోజనాలు పొందాయి. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ కార్మికుల వేతనాలు గణనీయంగా తగ్గుతుండగా, కోస్తాంధ్రలో గణనీయంగా పెరిగాయి. తెలంగాణ ప్రాంతంలో దళితులు, గిరిజనులు, మైనార్టీలకు చెందిన కుటుంబాల వార్షికాదాయం, జీవన ప్రమాణాలు ఇంకా మెరుగుపడలేదు. కోస్తాంధ్రలో ఈ వర్గాల ఆదాయాల్లో పెరుగుదల సంభవించింది. తెలంగాణలోని ఉన్నత వర్గ కుటుంబాల్లో క్రమంగా ఆదాయ అసమానతల్లో పెరుగుదల ఉండగా, కోస్తాంధ్రలోని ఉన్నత వర్గాలు, పేద వర్గాల మధ్య ఆర్థిక అసమానతల అంతరాలు అలాగే కొనసాగాయి. రాయలసీమలో అన్ని సామాజిక వర్గాల్లోనూ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నట్లు కమిటీ నివేదిక పేర్కొంది.

తలసరి ఆదాయం

  • తలసరి ఆదాయం ప్రాంతాల మధ్య అభివృద్ధికి సూచిక. 2007-08లో ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం కోస్తాంధ్రలో అధికంగా (రూ.36,496) నమోదైంది. ఇదే సంవత్సరానికి హైదరాబాద్‌తో కలిపి తెలంగాణ తలసరి ఆదాయం రూ.36,082. హైదరాబాద్‌ను మినహాయిస్తే తెలంగాణలో తలసరి ఆదాయం రూ.33,771గా నమోదైంది. ఈ రెండు ప్రాంతాలతో పోల్చితే రాయలసీమ తలసరి ఆదాయం (రూ.33,056) తక్కువగా నమోదైంది.
  • 2007-08లో తెలంగాణ జీఎస్‌డీపీలో వ్యవసాయ రంగం వాటా 22 శాతం కాగా, కోస్తాంధ్రలో 24 శాతం, రాయలసీమలో 25 శాతంగా నమోదైంది. మొత్తం పని భాగస్వామ్య రేటు రాయలసీమలో ఎక్కువ (47.5 శాతం) కాగా కోస్తాంధ్ర, తెలంగాణలో 46 శాతం. మూడు ప్రాంతాల్లో పట్టణీకరణ స్థాయి తక్కువగా ఉన్నట్లు కమిటీ అభిప్రాయపడింది. కోస్తాంధ్ర ప్రాంతంలోని మొత్తం జనాభాలో పట్టణ జనాభా 25 శాతం, రాయలసీమలో 23 శాతం, తెలంగాణలో 22 శాతం.
  • తయారీరంగ కార్యకలాపాలు ఎక్కువగా ఉండే హైదరాబాద్ తలసరి ఆదాయం ఎక్కువ. 1993-94లో 1999-2000 ధరల వద్ద కోస్తాంధ్రలో తలసరి ఆదాయం అధికంగా (రూ.12,809) నమోదైంది. హైదరాబాద్‌ను మినహాయించి తెలంగాణ తలసరి ఆదాయం రూ.11,391 కాగా, రాయలసీమ తలసరి ఆదాయం రూ.12,414గా నమోదైంది. ఇదే సంవత్సరం హైదరాబాద్‌తో కలిసి తెలంగాణ తలసరి ఆదాయం రూ.11,558. ఈ గణాంకాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో వివిధ రంగాల ప్రగతిని అంచనా వేయొచ్చు.
  • తలసరి ఆదాయం అభివృద్ధికి సూచిక అయినందువల్ల వివిధ ప్రాంతాల మధ్య అభివృద్ధిలో వ్యత్యాసాన్ని అంచనా వేయొచ్చు. 1993-94తో పోల్చితే 2007-08లో ప్రాంతాల మధ్య అభివృద్ధిలో వ్యత్యాసం కొంతమేర తగ్గినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.
  • పారిశ్రామిక కార్యకలాపాలు, సేవారంగ కార్యకలాపాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు విస్తరించటం వల్ల 1993-94తో పోల్చినప్పుడు 2007-08లో హైదరాబాద్‌ను మినహాయించగా తెలంగాణ ప్రాంత తలసరి ఆదాయంలో పెరుగుదల ఏర్పడింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2000-01, 2007-08 మధ్యకాలంలో సగటు తలసరి ఆదాయంలో 58 శాతం వృద్ధి ఏర్పడింది. ఇదే కాలానికి సంబంధించి హైదరాబాద్‌లో అత్యధికంగా 77 శాతం, హైదరాబాద్‌ను మినహాయించి తెలంగాణలో 60 శాతం, రాయలసీమలో 58 శాతం, కోస్తాంధ్రలో 54 శాతం నమోదైంది.

వ్యవసాయ రంగం - సాగునీటి వసతి అసమానతలు

సాగునీటి వసతి విషయంలో కోస్తాంధ్ర ప్రాంతం మిగిలిన రెండు ప్రాంతాల కంటే ఎక్కువ ప్రయోజనం పొందింది. తద్వారా కోస్తాంధ్ర ప్రాంతం వ్యవసాయకంగా అభివృద్ధి చెందింది. 1956-60 మధ్య కాలంలో కోస్తాంధ్ర ప్రాంతంలో మొత్తం సాగుభూమి 4.2 మిలియన్ హెక్టార్లు కాగా, 2006-09 మధ్య కాలంలో 5.3 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. ఇదే కాలానికి సంబంధించి తెలంగాణలో సాగుభూమి 4.8 మి.హెక్టార్ల నుంచి 5 మి.హెక్టార్లకు పెరగ్గా, రాయలసీమలో 3.2 మి.హెక్టార్ల నుంచి 3 మి.హెక్టార్లకు తగ్గింది. సాగూభూమి విస్తీర్ణాన్ని పరిశీలిస్తే కోస్తాంధ్రలో పెరుగుదల కనిపించగా, తెలంగాణ ప్రాంతంలో వృద్ధి స్తంభించింది. రాయలసీమలో మాత్రం సాగు భూమి విస్తీర్ణం తగ్గింది.
  • రాష్ట్రంలోని మూడుప్రాంతాల్లోనూ సాగునీటి వసతి ఉన్న నికర ప్రాంతంలో వృద్ధి కనిపిస్తోంది. 1956-60 నుంచి 2006-09 మధ్యకాలంలో సాగునీటి వసతి ఉన్న నికర ప్రాంతం తెలంగాణలో రెట్టింపు కాగా (0.8 మి.హెక్టార్ల నుంచి 1.7 మి.హెక్టార్లకు పెరిగింది). కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తగ్గింది. ఇదే కాలంలో తెలంగాణ ప్రాంతంలో సాగునీటి వసతి ఉన్న నికర ప్రాంతంలో వృద్ధి 113 శాతం కాగా, కోస్తాంధ్ర ప్రాంతంలో 30 శాతం, రాయలసీమలో 55 శాతంగా నమోదైంది.
  • ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సమయంలో (1956) కోస్తాంధ్రలో సాగునీటి లభ్యత 44.7 శాతం కాగా, తెలంగాణలో 17.2 శాతం, రాయలసీమలో 14.7 శాతం. 2008-09 నాటికి కోస్తాంధ్రలో సాగునీటి లభ్యత 60.6 శాతానికి, తెలంగాణలో 50.4 శాతానికి పెరగ్గా, రాయలసీమలో మాత్రం ఈ వృద్ధి 25.3 శాతానికి పరిమితమైంది.
  • 1956లో కోస్తాంధ్రలో మూడింట రెండొంతుల వ్యవసాయ భూమికి కాల్వల ద్వారా సాగునీటి లభ్యత ఉండగా తెలంగాణలో 16 శాతం, రాయలసీమలో 19 శాతం వ్యవసాయ భూమికి కాల్వల ద్వారా సాగునీరు లభ్యమైంది.
  • తెలంగాణలో చెరువుల ద్వారా సాగునీటి లభ్యతలో గణనీయమైన తగ్గుదల ఏర్పడింది (64 నుంచి 12 శాతానికి). రాయలసీమలోనూ చెరువుల ద్వారా నీటి లభ్యత ప్రాధాన్యం కోల్పోయింది.
  • సహజ అవకాశాల కారణంగా భూగర్భ, ఉపరితల జలాల ద్వారా సాగునీటి లభ్యతకు కోస్తాంధ్రలో అధిక అవకాశాలున్నాయి. అదే సమయంలో తెలంగాణ, రాయలసీమలో సాగునీటి లభ్యత అత్యధికంగా భూగర్భజలాలపైనే ఆధారపడి ఉంది.

విద్యుత్ వినియోగం-ఆర్థికాభివృద్ధి

విద్యుత్ వినియోగానికి, ఆయా ప్రత్యేక ప్రాంతాల్లో అభివృద్ధికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. విద్యుత్ వినియోగం ద్వారా తెలంగాణ ప్రాంతం అధిక లబ్ధిపొందినట్లు శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడించింది. 1975-76లో తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ కనెక్షన్ ఒక్కోదానికి విద్యుత్ వినియోగం 1898 కిలోవాట్లు కాగా, 2008-09 నాటికి అది 5920 కిలోవాట్లకు పెరిగింది. ఇదే కాలానికి సంబంధించి కోస్తాంధ్ర ప్రాంతంలో 3323 కిలోవాట్ల నుంచి 5797 కిలోవాట్లకు పెరగ్గా, రాయలసీమలో (2008-09)లో ఒక్కో విద్యుత్ కనెక్షన్‌కు 646 కిలోవాట్ల వినియోగం ఉంది.
  • తెలంగాణలో వ్యవసాయానికి సాగునీటిని అందించేందుకు వినియోగించిన విద్యుత్ 1974-75 నుంచి 2008-09 మధ్యకాలంలో 18 రెట్లు పెరగ్గా, కోస్తాంధ్రలో 10 రెట్లు పెరిగింది. కానీ, రాయలసీమలో సాగునీటిని అందించేందుకు వినియోగించే విద్యుత్‌లో 16 శాతం పెరుగుదల ఏర్పడింది.
Published date : 09 Oct 2015 05:07PM

Photo Stories