Skip to main content

హరిత విప్లవం - ఆర్థికవ్యవస్థపై ప్రభావం

భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో హరిత విప్లవం చెప్పుకోదగ్గ మార్పులకు కారణమైంది. బహుళ పంటలు, యాంత్రీకరణ, మేలు రకమైన వంగడాల వినియోగం, నిశ్చలమైన నీటిపారుదల వసతి, నాణ్యమైన ఎరువుల వినియోగం లాంటివి భారత్‌లో హరిత విప్లవానికి దోహదం చేశాయి. తద్వారా మన దేశం ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తుల్లో గణనీయమైన పెరుగుదల సాధించగలిగింది. దీంతో పాటు ఉత్పాదకత విషయంలోనూ మంచి ఫలితాలు సాధ్యమయ్యాయి. అంతిమంగా ఇవన్నీ భారత ఎగుమతులు, ఉద్యోగిత తదితర అంశాలపై ప్రభావం చూపి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దోహదపడ్డాయి.
మొదట్లో వ్యవసాయ కార్యకలాపాలు ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒకేవిధంగా ప్రారంభమయ్యాయి. 16వ, 17వ శతాబ్దాల మధ్యకాలంలో వ్యవ సాయంలో పెద్దగా మార్పులు సంభవించలేదు. 17వ శతాబ్దంలో రెండో వ్యవసాయ విప్లవం ఉత్పత్తి సామర్థ్యం, పంపిణీలలో ప్రగతికి దోహదమైంది. ఈ కాలంలో పారిశ్రామిక విప్లవం కారణంగా ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వెళ్లడం ప్రారంభించారు. 18వ శతాబ్దంలో యూరప్‌నకు సంబంధించిన వలస ఆర్థిక వ్యవస్థలు పారిశ్రామిక దేశాలకు వ్యవసాయ ముడిసరకులు, ఖనిజ ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాలుగా అవతరించాయి. నాడు వలస ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న మధ్య అమెరికాలోని అనేక దేశాలు ఇప్పటికీ ఒకే విధమైన వ్యవసాయ వస్తువులను ఉత్పత్తి చేసే దేశాలుగానే మిగిలిపోయాయి. 20వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ప్రపంచ జనాభాలో 45 శాతం మంది జీవనాధారం కోసం వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్న జనాభా అమెరికాలో 2 శాతం మాత్రమే కాగా ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో 80 శాతం వరకు ఉంది.

హరిత విప్లవ చరిత్ర, అభివృద్ధి
మెక్సికోలో 1940వ దశకంలో వ్యవసాయ రంగంలో పాత పద్ధతుల స్థానంలో నూతన విధానాలు ప్రవేశపెట్టారు. ఇవి వ్యవసాయ ఉత్పత్తుల్లో గణనీయమైన పెరుగుదలకు దోహదపడ్డాయి. నూతన పద్ధతులు విజయవంతమైన నేపథ్యంలో 1950, 1960వ దశకాల్లో హరిత విప్లవ సాంకేతిక విజ్ఞానం (Green Revolution Technologies) ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. మెక్సికోలోని రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్‌కు చెందిన ఆచార్యులు నార్మన్ బోర్లాగ్‌ను హరిత విప్లవ పితామహునిగా పేర్కొంటారు. 1940వ దశకంలో బోర్లాగ్ తన పరిశోధనల ద్వారా వ్యాధిని తట్టుకోగలిగే (Disease resistance) మేలు రకమైన అధిక దిగుబడినిచ్చే గోధుమ వంగడాలను అభివృద్ధి చేశారు. తద్వారా మెక్సికోలో దేశీయంగా ఉన్న డిమాండ్‌ను అధిగమించి గోధుమ ఉత్పత్తి జరిగింది. బోర్లాగ్ అభివృద్ధి చేసిన గోధుమ వంగడాలను వినియోగిస్తూ యాంత్రీకరణ ప్రవేశపెట్టడం ద్వారా మెక్సికో వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు సాధించింది. తద్వారా ఈ దేశం 1960వ దశకంలో గోధుమ ఎగుమతిదారుగా రూపొందింది. నూతన గోధుమ వంగడాలను వినియోగించడానికి ముందు మెక్సికో దేశీయ డిమాండ్‌కు తగినట్లుగా 50 శాతం గోధుమలు దిగుమతి చేసుకునేది. 1940వ దశకంలో అమెరికా దేశీయ అవసరాలకు సుమారు 50 శాతం గోధుమను దిగుమతి చేసుకునేది. హరిత విప్లవ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడం వల్ల 1950వ దశకంలో అమెరికా గోధుమ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడమే కాకుండా 1960వ దశకంలో ఎగుమతిదారుగా అవతరించింది.
1950, 1960 దశకాల్లో ప్రపంచ వ్యవసాయ చరిత్రకు సంబంధించి నూతన అధ్యాయం ప్రారంభమైంది. మెక్సికోకు చెందిన గోధుమ పంట; తైవాన్, సింహాళం (శ్రీలంక), మలేషియాలోని వరి పంట వ్యవసాయ రంగంలో దిగుబడుల చరిత్రను మార్చివేశాయి. ఈ విత్తనాల విప్లవం ఫోర్డ్ ఫౌండేషన్ వారి సూచన మేరకు భారతదేశానికి కూడా వ్యాపించింది. భారత్‌తో పాటు ఆసియాలోని అనేక దేశాలు ఈ నూతన వంగడాలను వినియోగించి వ్యవసాయ ఉత్పత్తిని పెంచుకోవడం ప్రారంభించాయి. భారత్‌లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు కూడా కొన్ని కొత్త రకం వంగడాలను, సంకరజాతి విత్తనాలను అభివృద్ధి చేశాయి. నూతన వ్యవసాయిక వ్యూహంలో భాగంగా ఈ అధిక దిగుబడినిచ్చే విత్తనాల వాడకం ద్వారా ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి కృషి చేశారు.

హరితవిప్లవం కారణంగా భారత్‌లో పరిష్కారమైన సమస్యలు
  • 1951లో శాశ్వత నీటిపారుదల ఉన్న సాగు విస్తీర్ణం 15 శాతం మాత్రమే ఉండేది. సాగువిస్తీర్ణంలో అధిక భాగం వర్షపాతంపైనే ఆధారపడి ఉండటం వల్ల వ్యవసాయ రంగం అల్ప ఉత్పత్తి, ఉత్పాదకత సమస్యలను ఎదుర్కొంది. హరితవిప్లవ సాధనకు నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ క్రమంలో ప్రభుత్వం అనేక చిన్న, మధ్య, భారీ తరహా ప్రాజెక్టులను నెలకొల్పడం ద్వారా ఎక్కువ విస్తీర్ణానికి సాగు నీటి వసతులను కల్పించడానికి సంకల్పించింది.
  • 1960వ దశకంలో వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణకు ముందుకాలంలో రైతు లు వారి వ్యవసాయ పరపతి నిమిత్తం వడ్డీ వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, భూస్వాములపై ఎక్కువగా ఆధారపడేవారు. ఇవన్నీ సంస్థాగతం కాని ఆధారాలు కావడం వల్ల గ్రామీణ రుణగ్రస్థత పెరిగింది. వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ తర్వాతి కాలంలో చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం తక్కువ వడ్డీ కింద పరపతిని సమకూర్చినందువల్ల వ్యవసాయ కార్యకలాపాలు మెరుగయ్యాయి. దీంతో వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగింది.
  • 1940 నుంచి 1970వ దశకం వరకు భారత్‌లోని అనేక ప్రాంతాల్లో కరవు కాటకాలు తీవ్రమయ్యాయి. శ్రమకు తగిన ప్రతిఫలం రాకపోవడంతో రైతులు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొనలేకపోయారు. దీంతో దేశంలో అధిక జనాభాకు సరిపోయేంత ఆహార ఉత్పత్తులను పొందలేకపోవడం వల్ల పౌష్టికాహార లోపంతో ఇబ్బందిపడే ప్రజల సంఖ్య పెరిగింది. వ్యవసాయంలో ప్రవేశపెట్టిన నూతన సాంకేతిక విజ్ఞానం క్రమంగా పౌష్టికాహార లోపంతో ఇబ్బందిపడే ప్రజల సంఖ్యను తగ్గించడానికి తోడ్పడింది.
  • వ్యవసాయంలో పంటకాలం వృథా కాకుండా బహుళ పంటల పద్ధతికి వీలు కలిగించే విధంగా ఆధునిక యంత్ర పరికరాలను ప్రవేశపెట్టారు. పంటల రక్షణ కోసం క్రిమి సంహారక రసాయనాలను వినియోగించడం, విత్తనాలను శుద్ధి చేయడం లాంటి పద్ధతులను అనుసరించారు.
  • గిట్టుబాటు ధరలు లభించకపోవడం వల్ల 1965కు ముందుకాలంలో రైతులు నష్ట భయాన్ని ఎదుర్కొన్నారు. ఆహార ధాన్యాల ధరల విషయంలో సలహాల కోసం వ్యవసాయేతర కమిషన్‌ను ఏర్పాటు చేశారు. రైతుల నుంచి ఆహార ధాన్యాలను సేకరించే ఉద్దేశంతో 1965లో ‘భారత ఆహార సంస్థ (FCI)’ను స్థాపించారు.

ప్రధాన పంటల సాగు విస్తీర్ణంపై నూతన సాంకేతిక విజ్ఞాన ప్రభావం:

హరిత విప్లవ కాలంలో ముఖ్యమైన పంటల కింద ఉన్న సాగు విస్తీర్ణంలో పెరుగుదల ఏర్పడింది. 1966-67లో మేలురకమైన వంగడాలను వినియోగించిన భూ విస్తీర్ణం 1.89 మిలియన్ హెక్టార్లు  కాగా, 1998-99 నాటికి ఇది 78.4 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. 1970- 71లో మొత్తం ఆహారధాన్యాల కింద ఉన్న భూ విస్తీర్ణం 124.3 మిలియన్ హెక్టార్ల నుంచి 2013-14లో 126.2 మిలియన్  హెక్టార్లకు చేరింది. ఈ కాలానికి సంబంధించి ప్రధానంగా గోధుమ, వరి, మొక్కజొన్న పంటల కింద ఉన్న భూ విస్తీర్ణంలో పెరుగుదలను గమనించవచ్చు. 1970-71లో గోధుమ పంట కింద ఉన్న భూ విస్తీర్ణం 18.2 మి.హె. నుంచి 31.3 మి.హె. చేరింది. ఇదే కాలంలో వరి పంట కింద ఉన్న విస్తీర్ణం 37.6 మి.హె. నుంచి 43.9 మి.హె., మొక్కజొన్న కింద ఉన్న భూ విస్తీర్ణం 5.8 మి.హె. నుంచి 9.3 మి.హె. కు, నూనెగింజల కింద ఉన్న విస్తీర్ణం 16.6 మి.హె. నుంచి 28.2 మి.హె. కు పెరిగింది. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రధాన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుదలకు దోహదమైంది.
 
ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటల ఉత్పత్తి:
హరిత విప్లవ కాలంలో అధిక దిగుబడినిచ్చే వంగడాలను వినియోగించడంతో పాటు నిశ్చితమైన నీటిపారుదల సౌకర్యాలు, మేలురకమైన ఎరువులు, క్రిమిసంహారక రసాయనాలను వినియోగించడం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 1960-61లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పతి 82 మిలియన్ టన్నులు కాగా, 2013-14 నాటికి ఇది 264.4 మిలియన్ టన్నులకు చేరింది. ప్రధాన పంటలను పరిశీలిస్తే..   గోధుమ ఉత్పత్తిలో అధిక పెరుగుదలను గమనించవచ్చు. 1960-61లో గోధుమ ఉత్పత్తి 11 మిలియన్ టన్నులు కాగా, 2013-14లో 95.8 మిలియన్ టన్నులకు పెరిగింది. ఇదేకాలంలో వరి ఉత్పత్తి 35 మిలియన్ టన్నుల నుంచి 106.3 మిలియన్ టన్నులకు పెరిగింది. గోధుమ పంటకు చెందిన భూ విస్తీర్ణం పెరగడం వల్ల కూడా గోధుమ ఉత్పత్తిలో అధిక పెరుగుదల సాధ్యమైంది. పప్పు ధాన్యాలపై హరిత విప్లవం ప్రభావం తక్కువేనని చెప్పవచ్చు. 1960-61లో పప్పు ధాన్యాల ఉత్పత్తి 13 మిలియన్ టన్నులు కాగా, 2013-14లో 19.6 మిలియన్ టన్నులకు పెరిగింది. మొత్తం ఆహార ధాన్యాల్లో తృణ ధాన్యాలు (Cereals) 2013-14లో 244.8 మిలియన్ టన్నులకు  చేరుకున్నాయి.
 నూతన వ్యవసాయిక వ్యూహం ప్రధాన లక్ష్యం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల సాధించడం. 1973-74 వరకు వాణిజ్య పంటలపై హరిత విప్లవ ప్రభావం పెద్దగా లేదని గమనించవచ్చు. తర్వాత కాలంలో వాణిజ్య పంటల ఉత్పత్తిలోనూ కొంత పెరుగుదల ఏర్పడింది. చెరకు, పత్తి, జనుము, నూనెగింజల ఉత్పత్తిలో పెరుగుదల అధికంగా  ఉంది. 1970-71లో నూనెగింజల ఉత్పత్తి 9.6 మిలియన్ టన్నులు కాగా, 2013-14లో 32.4 మిలియన్ టన్నులకు చేరుకుంది.
 
 ఉత్పాదకత పెరుగుదలపై నూతన సాంకేతిక విజ్ఞానం ప్రభావం:
 నూతన వ్యవసాయిక వ్యూహం ఫలితంగా ముఖ్యమైన పంటల ఉత్పాదకతలో పెరుగుదల సాధ్యమైంది. మొత్తం ఆహార ధాన్యాల దిగుబడి 1960-61లో హెక్టారుకు 710 కిలోగ్రాముల నుంచి 1970-71లో 872 కిలోగ్రాములకు, 2013-14లో 2095 కిలోగ్రాములకు పెరిగింది. వరి దిగుబడి హెక్టారుకు 1960-61లో 1013 కిలోగ్రాముల నుంచి 1970-71లో 1123 కిలోగ్రాములకు, 2013-14లో 2419 కిలోగ్రాములకు పెరిగింది. గోధుమ దిగుబడి హెక్టారుకు 1960-61లో 851 కిలోగ్రాముల నుంచి 1970-71లో 1307 కిలోగ్రాములకు, 2013-14లో 3059 కిలోగ్రాములకు పెరిగింది. మొక్కజొన్న, నూనెగింజల ఉత్పాదకతపై హరిత విప్లవ ప్రభావం ధనాత్మకంగా ఉంది. 1970-71లో మొక్కజొన్న దిగుబడి హెక్టారుకు 1279 కిలోగ్రాముల నుంచి 2013-14లో 2602 కిలోగ్రాములకు, నూనెగింజల దిగుబడి ఇదేకాలానికి సంబంధించి 579 కిలోగ్రాముల నుంచి 1149 కిలోగ్రాములకు పెరిగింది.
 
 కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రీకరణ:
 నీటిపారుదల సౌకర్యం సమృద్ధిగా ఉన్న కొన్ని పరిమిత ప్రాంతాలకు హరిత విప్లవం  వల్ల ప్రయోజనం కలిగింది. 2013-14లో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానం పొందగా.. పంజాబ్, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దేశంలోని మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ వాటా 19.09 శాతం. వరి ఉత్పత్తిలో 2013-14కు సంబంధించి పశ్చిమబెంగాల్ ప్రథమ స్థానం పొందగా తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. దేశంలోని మొత్తం వరి ఉత్పత్తిలో పశ్చిమబెంగాల్ వాటా 14.32 శాతం. గోధుమల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా మొదటి మూడు స్థానాలను పొందాయి. 2013-14లో దేశంలోని మొత్తం గోధుమ ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ వాటా 30.85 శాతం. మొత్తం పప్పు ధాన్యాల ఉత్పత్తిలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ మొదటి మూడు స్థానాలను పొందాయి. 2013-14లో దేశంలోని మొత్తం పప్పుధాన్యాల ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ వాటా 26.71 శాతం.
 
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం:
హరిత విప్లవం కారణంగా కొంతమేరకు వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా ఎగుమతి  చేయగలిగే అవకాశం కలిగింది. 1960 ఫిబ్రవరిలో భారత మొత్తం ఎగుమతుల్లో వ్యవసాయ ఉత్పత్తుల వాటా 44 శాతం కాగా, 1980 నాటికి 31 శాతానికి, 2011-12 నాటికి 9.08 శాతానికి తగ్గింది. భారత్ ఎగుమతుల్లో శాతం పరంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల వాటా తగ్గినప్పటికీ విలువపరంగా వ్యవసాయ ఉత్పత్తులు ప్రగతి సాధించాయి. 1970-71లో 5 కోట్ల రూపాయలు విలువ చేసే వరి ధాన్యాన్ని ఎగుమతి చేయగలిగితే 2013-14లో ఈ విలువ 7742 మిలియన్ డాలర్లకు పెరిగింది. భారత్ మొత్తం వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 1960-61లో రూ.284 కోట్లు కాగా, 2013-14లో 37.29 బిలియన్ డాలర్లకు పెరిగింది. హరిత విప్లవంతో పాటు పరిమాణా త్మక హద్దుల నియమాలను తొలగించడం, సరళీకరణ ఆర్థిక విధానాల అమలు, ఎగుమతి -దిగుమతుల విధానం, వ్యవసాయ అను బంధాలను ప్రోత్సహించడానికి తీసుకున్న అనేక రకాల చర్యలు కూడా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరగడానికి దోహదపడ్డాయి.
ఉద్యోగితపై ప్రభావం: బహుళ పంటల విధానాన్ని అవలంభించడం, వ్యవసాయ ఉత్పాదకాల వినియోగం పెరగడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా పెరిగాయి. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ కారణంగా ఉపాధి అవకాశాలు తగ్గినా.. ఎరువులు, క్రిమిసంహారక రసాయనాల పరిశ్రమల్లో, రావాణా, బ్యాంకింగ్ లాంటి సేవా రంగంలో ఉపాధి అవకాశాలు అధికమయ్యాయి. వ్యవసాయ, అనుబంధ రంగాల్లోని శ్రామిక శక్తి 2004-05తో పోల్చినప్పుడు 2011-12లో 36 మిలియన్లు తగ్గింది. 2011-12లో మొత్తం ఉపాధిలో వివిధ రంగాల వాటాను పరిశీలించినప్పుడు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా 48.9 శాతం కాగా, పారిశ్రామిక రంగం 24.3, సేవా రంగం 26.9 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.
Published date : 03 Aug 2016 01:51PM

Photo Stories