Skip to main content

ఆర్థిక వ్యవస్థ - నిరుద్యోగం - నిర్మూలనా చర్యలు

అధిక ఆర్థిక వృద్ధి సాధన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల.. ఈ రెండూ భారతదేశంలో ఆర్థిక ప్రణాళికల విధానపరమైన లక్ష్యాలు. వీటితో పాటు సమ్మిళిత వృద్ధి సాధన కోసం జీడీపీ వృద్ధిరేటుకు సమాంతరంగా ఉపాధి అవకాశాల పెరుగుదలపై దృష్టి సారించాల్సిన అవసరంఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే.. కొన్నేళ్లుగా జీడీపీ వృద్ధికి అనుగుణంగా ఉపాధి అవకాశాల్లో పెరుగుదల సంభవించలేదని గమనించవచ్చు.
భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణత, శ్రామిక శక్తులు అభిలషణీయ ఉపాధి వ్యూహానికి సవాలుగా నిలిచాయి. అనాదిగా భారత్.. వ్యవసాయం ప్రధాన కార్యకలాపంగా ఉన్న దేశం. అందువల్ల తయారీ రంగం తక్కువ స్థాయిలో ఉంది. దీంతో శ్రామిక శక్తి ఉపాధి కోసం అధికంగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉంది. స్వాతంత్య్రానంతరం కాలానుగుణంగా భారత స్థూల దేశీయోత్పత్తిలో వివిధ రంగాల వాటాలో మార్పులు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ ఉపాధికి సంబంధించి రంగాల వారీగా జరిగిన మార్పు చెప్పుకోదగిన స్థాయిలో లేదు. తయారీ రంగంలో పరిమిత వృద్ధితో పాటు సంఘటిత తయారీ రంగంలో మూలధన సాంద్రత పరిజ్ఞానానికి పెరిగిన ప్రాధాన్యం వల్ల ఉత్పాదక ఉపాధి ఒక స్థాయికి మించి పెరగలేదు.
వ్యవసాయ రంగంలో ఉపాధి విస్తరణ శూన్యంగా ఉన్నప్పటికీ పెరుగుతున్న శ్రామిక శక్తి తరతరాలుగా ఈ రంగంపైనే ఆధారపడటాన్ని గమనించవచ్చు. అందువల్ల భారతదేశంలో వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత, వ్యవసాయ శ్రామికుల ఆదాయాలు తక్కువగా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఉపాధి - నిరుద్యోగం
దేశంలోని ఉపాధి -నిరుద్యోగాన్ని దృష్టిలో ఉంచుకొని పదకొండో పంచవర్ష ప్రణాళికలో నాణ్యతతో కూడిన ఉపాధితోపాటు అధిక ఉపాధి వృద్ధిని సాధించాలనే అంశాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ ప్రణాళికా కాలంలో మొత్తం ఉపాధిలో శాశ్వత ఉపాధి వాటాను పెంచడంతోపాటు సాధారణ (క్యాజువల్) ఉపాధిని తగ్గించాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఉపాధి కల్పన వ్యూహంలో భాగంగా అల్ప ఉద్యోగిత (్ఖఛ్ఛీట ్ఛఝఞౌడఝ్ఛ్ట)ను తగ్గించడంతోపాటు వ్యవసాయ రంగంలో అల్ప వేతన స్థాయి వద్ద ఉన్న మిగులు శ్రామికులను వ్యవసాయేతర రంగంలో అధిక వేతనంతో కూడిన ఉపాధి వైపు బదిలీ చేయాలని పదకొండో ప్రణాళికలో నిర్ణయించారు. పదకొండో పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగంలో అదనపు ఉపాధి సృష్టి అసాధ్యమని భావించారు. తయారీ రంగంలో 4 శాతం; నిర్మాణ రంగంలో 8.2 శాతం; రవాణా, సమాచార రంగంలో 7.6 శాతం ఉపాధి వృద్ధి ఉంటుందని ఈ ప్రణాళికా కాలంలో అంచనా వేశారు. పదకొండో ప్రణాళికా కాలంలో శ్రామిక శక్తిలో మొత్తం పెరుగుదల 45 మిలియన్లుగా ఉంటుందని అంచనా. ఈ ప్రణాళికలో 58 మిలియన్ల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా తీసుకున్నారు. తద్వారా దేశంలో నిరుద్యోగితా రేటు 5 శాతానికి తక్కువగా పరిమితమవుతుందని అంచనా వేశారు. వివిధ స్థాయిల్లో శిక్షణ, నైపుణ్యత అభివృద్ధి ద్వారా అనేక రంగాల్లో లక్షిత వృద్ధి రేటును సాధించవచ్చని పదకొండో ప్రణాళికా కాలంలో భావించారు.

పన్నెండో పంచవర్ష ప్రణాళిక
పన్నెండో పంచవర్ష ప్రణాళిక(2012-17)లో తయారీ, సేవా రంగాల్లో 50 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నారు. 2017 నాటికి నైపుణ్యం ఉన్న శ్రామిక శక్తిలో 50 మిలియన్ల పెరుగుదల సాధించాలని, శ్రామిక శక్తిలో ఫార్మల్ ట్రైనింగ్ తీసుకుంటున్న వారి సంఖ్యను 10 శాతం నుంచి 25 శాతానికి పెంచాలని నిర్ణయించారు.
సేవా రంగంలో బీమా, ఫైనాన్‌‌స, బ్యాంకింగ్, పర్యాటక విభాగాలు పన్నెండో ప్రణాళికలో అధిక ఉపాధిని కల్పిస్తాయని అంచనా వేస్తున్నారు. శ్రామిక చట్టాల్లోని కొన్ని క్లిష్టమైన అంశాలు సంఘటిత రంగంలో ఉపాధి పెంపునకు అవరోధాలుగా ఉన్నాయి. ఉత్పాదకతలో పెరుగుదల ఆర్థిక వ్యవస్థలో వాస్తవిక ఆదాయాన్ని పెంచడానికి దోహదపడుతుంది. పన్నెండో ప్రణాళికలో ఉపాధి కల్పనకు సంబంధించి అవలంబించే వ్యూహం సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఉత్పాదక ఉపాధి అవకాశాలను పెంపొందించే విధంగా ఉండాలి. ఉత్పాదకత పెంపులో నవ కల్పనలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. నేషనల్ శాంపుల్ సర్వే గణాంకాలు.. ఇటీవల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళా ఉపాధిలో తగ్గుదల ఏర్పడినట్లు తెలుపుతున్నాయి.

గ్రామీణ నిరుద్యోగం- నిర్మూలనా చర్యలు
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ద్వారా గ్రామీణ నిరుద్యోగ సమస్యను నివారించవచ్చు. వేతన ఉపాధి, స్వయం ఉపాధి కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయాలి. పెద్ద తరహా పరిశ్రమలు తగినంత ఉపాధి అవకాశాలను కల్పించలేకపోతున్నాయి.
  • గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. దీంతోపాటు చిన్న తరహా, కుటీర పరిశ్రమల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవాలి. అసంఘటిత రంగంతో పాటు సేవారంగ కార్యకలాపాలను విస్తృతపరచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి.
  • దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టాలి. తద్వారా ఈ రంగంలో మిగులు ఏర్పడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఫలితంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. నిరుపయోగంగా ఉన్న భూముల అభివృద్ధి, వ్యవసాయ కార్యకలాపాల విస్తరణ (డైవర్సిఫికేషన్) లాంటి చర్యలు గ్రామీణ ఉపాధిని ప్రోత్సహిస్తాయి.
  • వ్యవసాయ అనుబంధ విభాగాలైన డెయిరీ, పౌల్ట్రీ, తేనెటీగల పెంపకం, ఫిషరీ, హార్టికల్చర్, సెరికల్చర్, ఆగ్రో ప్రాసెసింగ్ వంటి కార్యకలాపాలను ప్రోత్సహించాలి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కార్యకలాపాలైన గ్రామీణ పరిశ్రమలు, కుటీర, చిన్న తరహా పరిశ్రమల వికేంద్రీకరణ, ఆగ్రో-బేస్డ్ పరిశ్రమ, గ్రామీణ అసంఘటిత రంగం, సేవారంగం, గ్రామీణ అవస్థాపనా సౌకర్యాల విస్తరణ, హౌసింగ్, ఆరోగ్యం, విద్యా సర్వీసులను విస్తృతపరచాలి.
  • మహలనోబిస్ అభివృద్ధి వ్యూహం మూలధన సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చింది. నూతన ఉత్పత్తి రంగాల్లో సామర్థ్యంతో కూడిన ఉపాధి వృద్ధికి శ్రమ సాంకేతిక పరిజ్ఞానం, మూలధన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉమ్మడిగా వినియోగించి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి.
  • గ్రామీణ నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణాభివృద్ధి పథకాలను సక్రమంగా అమలు చేయడంపై దృష్టి సారించాలి. నూతన పథకాలను ప్రవేశపెట్టాలి. అభివృద్ధి ఫలాలను లక్షిత వర్గాలకు అందించడానికి ప్రయత్నించాలి.
  • స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి కార్యక్రమాలను విస్తృతం చేయాలి. స్వచ్ఛంద సంస్థల (ఎన్‌జీవో) ద్వారా స్వయం సహాయక బృందాలకు లభించే ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా గ్రామీణ నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి తోడ్పడతాయి.

పట్టణ నిరుద్యోగం- నిర్మూలనా చర్యలు
  • పారిశ్రామిక సామర్థ్యాన్ని మెరుగు పరచడం ద్వారా పట్టణ నిరుద్యోగ సమస్యను నిర్మూలించవచ్చు. తక్కువ వ్యయంతో ప్రస్తుతం ఉన్న పరిశ్రమల విస్తరణ, ఆధునికీకరణకు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు నూతన పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నించాలి.
  • ముఖ్యంగా..ఇనుము, ఉక్కు, రసాయనాలు, రక్షణ వస్తువులు, హెవీ మిషనరీ, విద్యుదుత్పాదన, అణుశక్తికి సంబంధించిన పరిశ్రమల ఆధునికీకరణ, విస్తరణపై దృష్టి సారించాలి. తద్వారా పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుత,భవిష్యత్ తరాలవారికి ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయి.
  • విద్యార్థులను సాధారణ విద్య నుంచి వృత్తి విద్య వైపు మరల్చాలి. తద్వారా యువత స్వయం ఉపాధి దిశగా దృష్టి కేంద్రీకరించగలుగుతుంది.
  • శ్రమ-సాంద్రత పరిజ్ఞానాన్ని వినియోగించే చిన్న తరహా, కుటీర పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించాలి.
  • పట్టణ అసంఘటిత రంగంలో అనేక మంది పట్టణ ప్రజలు నిమగ్నమై ఉన్నారు. అందువల్ల ఈ రంగాన్ని అభివృద్ధి పరచడం, ఆధునికీకరించడానికి తగిన చర్యలు చేపట్టాలి. తద్వారా పెరుగుతున్న పట్టణ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
  • షెడ్యూల్డ్, వాణిజ్య బ్యాంకులు ప్రత్యేకంగా రిటైల్ రంగం, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు తక్కువ వడ్డీ వద్ద పరపతిని అందించాలి. అర్బన్ అసంఘటిత రంగాన్ని అభివృద్ధి చేయడానికి సేవారంగానికి సంబంధించి అనేక యూనిట్లను అభివృద్ధి చేయాలి. ఉత్పాదక రంగాలపై పెట్టుబడులను పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తృతపరచాలి.
  • గ్రామాల‌ నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్న కారణంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం అధికమవుతోంది. దీంతో పాటు పట్టణ ప్రాంతాల్లో మురికి వాడలు కూడా పెరిగి మౌలిక సౌకర్యాల కొరత పెరుగుతోంది.
  • మురికివాడల్లో నివసించే ప్రజల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండి నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోంది. నిర్మాణ, తయారీ రంగాలు, ఇతర ట్రేడ్‌‌సకు సంబంధించి శ్రామికులు మురికివాడల్లోనే ఎక్కువగా లభ్యమవడాన్ని గమనించవచ్చు.
  • ఆయా రంగాలకు సంబంధించి వారిలో శిక్షణ పెంపొందిస్తే అధిక వేతనాలు పొందడం ద్వారా పేదరిక తీవ్రత తగ్గుతుంది. మురికివాడల్లో వివిధ అంశాలకు చెందిన శిక్షణ కేంద్రాల ఏర్పాటు ద్వారా వారిలో నైపుణ్యాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.

నూతన ఆర్థిక విధానం- నిరుద్యోగం
  • నూతన ఆర్థిక విధానం ప్రవేశపెట్టిన తర్వాత సాంకేతిక పరిజ్ఞానం.. ఆధునికీకరణ కార్యక్రమాల కారణంగా మూలధన సాంద్రత.. సాంకేతిక పరిజ్ఞాన వినియోగాలు పెరిగాయి. దీంతో 1990-91లో 11 మిలియన్లు ఉన్న నిరుద్యోగుల సంఖ్య 1991-92లో 17 మిలియన్లకు పెరిగి, 1992-93 నాటికి 13 మిలియన్లకు తగ్గింది. నిరుద్యోగితా రేటు 1990-91లో 3.1 శాతం కాగా, 1992-93లో 5.1 శాతానికి పెరిగింది.
  • నేషనల్ శాంపిల్ సర్వే గణాంకాల ప్రకారం 1993-94లో మొత్తం నిరుద్యోగుల సంఖ్య 9 మిలియన్లు కాగా, 2004-05 నాటికి ఈ సంఖ్య 13.1 మిలియన్లకు పెరిగింది. 1993-94లో 2.62 శాతంగా ఉన్న నిరుద్యోగితా రేటు 2004-05లో 3.06 శాతానికి చేరుకుంది.
  • దేశంలో అదనపు ఉత్పాదన అసంఘటిత రంగంలో నమోదు కాగా, అతి తక్కువగా సంఘటిత రంగంలో నమోదైంది. అసంఘటిత రంగంలో తక్కువ వేతన రేటు వద్ద ఉపాధి లభించింది. సంఘటిత రంగంతో పోల్చినప్పుడు అసంఘటిత రంగంలో ఉపాధి భద్రత తక్కువగా ఉంది. నిర్మాణాత్మక సర్దుబాటు కార్యక్రమం ప్రవేశపెట్టిన తర్వాత సంఘటిత రంగంలో ఉపాధి సామర్థ్యం తగ్గింది.
  • 2006-07లో భారత పారిశ్రామిక రంగ వృద్ధి 11.2 శాతంగా నమోదైతే.. ప్రపంచ ఆర్థిక సంక్షభం కారణంగా 2008-09లో దేశ పారిశ్రామిక రంగ వృద్ధి 3 శాతానికి తగ్గింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం భారతదేశంలోని ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై రుణాత్మక ప్రభావం చూపించింది.
  • శ్రామిక, ఉపాధి మంత్రిత్వ శాఖ లేబర్ బ్యూరో శాంపిల్ సర్వే నివేదిక ప్రకారం దేశంలోని 8 ప్రధాన రంగాల్లో సెప్టెంబర్-డిసెంబర్ (2008) నెలల మధ్య ఉపాధి 16.2 మిలియన్ల నుంచి 15.7 మిలియన్లకు తగ్గింది.
  • దేశంలోని మొత్తం ఉపాధిలో స్వయం ఉపాధి వాటా 52.2 శాతంగా ఉందని నేషనల్ శాంపిల్ సర్వే పేర్కొంది. మొత్తం శ్రామికుల్లో అధిక శాతం అల్ప ఆదాయ కల్పన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నట్లు ఈ సర్వే తెలిపింది.
  • నేషనల్ శాంపిల్ సర్వే (68వ రౌండు) ప్రకారం తయారీ రంగంలో వృద్ధి 2009-10లో11 శాతంగా ఉంటే 2011-12 నాటికి 12.6 శాతానికి పెరిగింది. జాతీయ తయారీ విధానం (2011) ప్రకారం 2022 నాటికి 100 మిలియన్ల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కారణంగా 2011-12లో తయారీ రంగంలో వృద్ధి నమైదైంది.
Published date : 08 Jan 2016 11:33AM

Photo Stories