Skip to main content

KTR: పేద గిరిజన వైద్య విద్యార్థి చదువుకి స‌హాయం..

సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌ నగరం బోరబండ ప్రాంతానికి చెందిన తిరుపతి అనూష కిర్గిజీస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతుంది.

అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం తాను చదువుతున్న వైద్య విద్య కోర్సులో మొదటి మూడు సంవత్సరాల్లో 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అయితే కరోనా నేపధ్యంలో చదువును కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో తన తల్లితో కలిసి కూరగాయలు అమ్మడం ప్రారంభించింది.

అవసరమైన ఆర్థిక సహాయాన్ని..
పేద గిరిజన కుటుంబానికి చెందిన అనూష తండ్రి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అనూష వైద్య విద్య కోర్సు ఫీజుల కోసం ఇబ్బందులు పడుతున్న విషయం మంత్రి కేటీఆర్‌ దృష్టికి వచ్చింది. పేదరిక పరిస్థితుల నేపథ్యంలోనూ ఎంతో ఛాలెంజింగ్గా, వైద్య విద్యపై మక్కువతో విదేశాలకు వెళ్లి చదువుకునే ప్రయత్నం చేస్తున్న అనూషకి కేటీఆర్ అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ఆమె వైద్య విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తానని అక్టోబ‌ర్ 6వ తేదీన కేటీఆర్‌ ప్రకటించారు. 

డాక్టర్‌గా తిరిగి రావాలని..
అనూష ఎంబీబీఎస్ ఫీజుల బాధ్యత తీసుకుంటానని.. కోర్సు పూర్తి చేసుకొని డాక్టర్‌గా తిరిగి రావాలని కేటీఆర్‌ కోరుకున్నారు.. ఈ సందర్భంగా అనూషకి ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి, ఆమెకు అన్నివిధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనూష వైద్య విద్యకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్‌కి ఆమె కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

Published date : 06 Oct 2021 07:14PM

Photo Stories