Skip to main content

తక్కువ ఖర్చుతో కరోనా టెస్ట్ కిట్‌ను రూపొందించిన ఢిల్లీ ఐఐటీ

సాక్షి, హైదరాబాద్: కేవలం వందల రూపాయల ఖర్చుతో తయారయ్యే ‘కోవిడ్ 19 డిటెక్షన్ కిట్’ను దేశీయ టెక్నాలజీతో ఢిల్లీ ఐఐటీ రూపొందించింది.
దీనిని వైద్య పరిశోధనలో అత్యున్నత పరిశోధన సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా ఆమోదించింది. కోవిడ్‌ను గుర్తించడంలో ఈ కిట్ వంద శాతం కచ్చితత్వంతో పనిచేస్తున్నట్లు ఐసీఎంఆర్ ధ్రువీకరించింది. పాలిమరేజ్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) ఆధారితంగా ఈ పరికరం పనిచేస్తుంది. సరైన పారిశ్రామిక భాగస్వామి దొరికితే వారం పది రోజుల్లో ఈ కిట్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఢిల్లీ ఐఐటీ సన్నాహాలు చేస్తోంది.

తక్కువ ధరలో అందుబాటులోకి..
కరోనా జన్యుక్రమంలో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో బలహీనమైన ఆర్‌ఎన్‌ఏ క్రమాలను గుర్తించారు. ఈ అంశం కోవిడ్-19ను గుర్తుపట్టడంలో కీలకంగా మారడంతో పీసీఆర్ ఆధారంగా కిట్‌ను రూపొందించారు. ఈ ఏడాది జనవరి నుంచి తక్కువ ఖర్చుతో తయారయ్యే పరికరాన్ని రూపొందించడంపై ఢిల్లీ ఐఐటీ బృందం దృష్టి సారించింది. ఈ పరికరాన్ని ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తే ధర కూడా తగ్గే అవకాశం ఉందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ ఐఐటీ నిధులతో రూపొందించిన ఈ పరికరంపై పేటెంట్ కోసం పరిశోధక బృందం దరఖాస్తు చేసింది.
Published date : 25 Apr 2020 03:05PM

Photo Stories