INSPIRE National Level: జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీలకు ఈ విద్యార్థిని ప్రాజెక్టు ఎంపిక
![Gunashree Keerthy receiving a memento from Chittoor DEO](/sites/default/files/images/2024/03/14/zp-high-school-gunasri-1710397726.jpg)
చోడవరం రూరల్: లక్ష్మీపురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని వి.గుణశ్రీ కీర్తి జాతీయ స్థాయి ఇన్స్పైర్ ఇండియా పోటీలకు ఎంపికయ్యింది. చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ నెల 11 నుంచి మూడు రోజులపాటు జరిగిన ఇన్స్పైర్ రాష్ట్ర స్థాయి పోటీల్లో గుణశ్రీ కీర్తి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఆఫ్ ఆనియన్ క్రైసిస్ ఇన్ ఇండియా (భారత్లో ఉల్లి హెచ్చు తగ్గులలో ఎదుర్కొంటున్న సమస్యలకు అధునాతన పరిష్కారాలు) అన్న అంశంపై తయారు చేసిన ప్రాజెక్టు పలువురు న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది.
Tenth Class Public Exams: ఈసారి కొత్త టెక్నాలజీతో ప్రశ్న పత్రాల తయారి
దీంతో కొద్ది రోజుల్లో జాతీయ స్థాయిలో జరగనున్న ఇన్స్పైర్ పోటీలకు ఈ ప్రాజెక్టును ఎంపిక చేశారు. ఉల్లి పంటను తక్కువ ఖర్చుతో నిల్వచేసుకునే విధానాన్ని గుణశ్రీ కీర్తి ఈ ప్రాజెక్టులో వివరించింది. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన గుణశ్రీ కీర్తికి చిత్తూరు డీఈవో, తదితర అతిథులు జ్ఞాపిక, ప్రశంసాపత్రాలను అందచేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో అనకాపల్లి జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఈ ప్రాజెక్టు ఒక్కటే ఎంపిక కావడంతో అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ, డీఎస్వో కాళిదాసు అభినందనలు తెలిపారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ.వి.జగన్నాథరావు బుధవారం వెల్లడించారు. జాతీయ పోటీకి ఎంపికైన విద్యార్థిని కీర్తిని పేరెంట్స్ కమిటీ చైర్మన్ బి.రామారావు, సర్పంచ్ శిరిసోళ్ళ గంగాభవాని ఆది గణపతి నాయుడు, ఉపాధ్యాయులు అభినందించారు.