Skip to main content

సమాచారం, సమకాలీన అంశాల సమన్వయంతో

సివిల్స్ ప్రస్థానంలో కీలకమైన ప్రిలిమ్స్ పరీక్షకు సరిగ్గా 45 రోజుల సమయం మిగిలి ఉంది.. 1291 పోస్టులు, పెరిగిన అటెంప్ట్‌ల సంఖ్య వెరసి.. ఈ సారి పోటీ తీవ్రంగానే ఉండొచ్చు.. నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకునే క్రమంలో తొలి దశను విజయవంతంగా అధిగమిస్తేనే మలి దశ మెయిన్స్‌కు అవకాశం చిక్కుతుంది.. ఇప్పటి వరకు సాగించిన ప్రిపరేషన్ ఒక ఎత్తు అయితే.. చివరి 45 రోజుల ప్రిపరేషన్ మరో ఎత్తు.. కాబట్టి ఈ చివరి దశలో ఎటువంటి వ్యూహాలు అనుసరించాలనే అంశంపై నిపుణుల సూచనలు...

సమకాలీన అంశాలతో పాలిటీ
సివిల్స్ జనరల్ స్టడీస్‌లో పాలిటీ విభాగానికి గరిష్ట ప్రాధాన్యత దక్కుతుంది. ప్రస్తుతం మిగిలి ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. మొదటి దశ సన్నాహకాలను పూర్తి చేయాలి. సాధ్యమైనంత వరకు పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం, మోడల్ టెస్ట్‌కు హాజరు కావడం చేయాలి. కొత్త అంశాలను చదవడం కంటే ఇది వరకు చదివిన అంశాలకే ప్రిపరేషన్ పరిమితం కావాలి. ఇందులో కీలకమైన అంశాలు.. ప్రకరణలు/అధికరణలు-ఇవి రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలను తెలియజేస్తాయి. కాబట్టి వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. కొన్ని సమయాల్లో ప్రధాన అధికరణలతోపాటు క్లాజులు, సబ్-క్లాజులను కూడా గుర్తు పెట్టుకోవాలి. ఈ క్రమంలో సమకాలీనంగా ప్రాధాన్యత సంతరించుకున్న ప్రకరణలు, షెడ్యూల్స్, ముఖ్య సవరణలను గుర్తు పెట్టుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పులు.. గోపాలన్, చెంపకం దొరైరాజన్, బకాజి, బాబులాల్ పరాటే, గోలక్‌నాథ్, కేశవానంద భారతి, ఇందిరాగాంధీ, మేనకాగాంధీ, మినర్వరామిల్స్, ఎస్‌పీ గుప్త, షాబానో, సరళా ముద్గల్, సుహాస్ కట్టి తదితర కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పు సారాంశాలను తెలుసుకోవాలి. పాలిటీలో అధిక శాతం ప్రశ్నలు సమకాలీన అంశాలతో (కరెంట్ అఫైర్స్) ముడిపడి ఉంటాయి. కాబట్టి సమకాలీనంగా ప్రాధాన్యత అంశాలను నిశితంగా గమనించాలి. ఉదాహరణకు న్యాయమూర్తుల నియామకం, బ్లాక్ మనీ, పార్టీ ఫిరాయింపులు, కొత్త రాష్ట్రాల డిమాండ్, మహిళా చట్టాలు, జమ్మూ-కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి, గవర్నర్ల తొలగింపు తదితరాలు. ఇందులో అడిగే ప్రశ్నల క్లిష్టత విశ్లేషణాత్మకంగా ఉంటుంది. కాబట్టి కేవలం సమాచార సేకరణకు పరిమితం కాకుండా..ఆ సమాచారాన్ని సందర్భనుసారం అన్వయించుకునే నైపుణ్యం పెంచుకోవాలి. మల్టీ కాంబినేషన్, మ్యాచింగ్స్ వంటి ప్రశ్నలు కూడా అడగొచ్చు. కాబట్టి విస్తృత స్థాయిలో ప్రిపరేషన్ సాగించాలి.

సైన్స్-పర్యావరణం నుంచి
సివిల్స్ జనరల్ స్టడీస్ విభాగంలోని జనరల్ సైన్స్, పర్యావరణం అంశాల నుంచి గత కొన్నేళ్లుగా 20-25 ప్రశ్నలు ఇస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో కొన్ని ముఖ్యమైన అంశాలపై దృష్టి సారిస్తే ప్రయోజనకరం. ఈ క్రమంలో పర్యావరణ విభాగంలో బేసిక్ ఎకాలజీ అంశాలను మఖ్యంగా ఎకోసిస్టమ్, ఇకలాజికల్ సక్సెషన్, బయోజియో కెమికల్స్, సైకిల్స్, స్పీషీస్, స్పీషియేషన్ వంటి విషయాలను సమగ్రంగా చదవాలి. 2012, 13లలో విడుదలైన ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) రెడ్ లిస్ట్‌లో భారత్‌కు చెందిన వన్య జాతుల గురించి తెలుసుకోవాలి. ప్రధాన బయోస్ఫియర్ రిజర్వులు, ఎలిఫెంట్, టైగర్ రిజర్వులతోపాటు సేక్రెడ్ లేక్స్, సేక్రెడ్ గ్రూవ్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇటీవలి కాలంలో కేంద్ర రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డులు విడుదల చేసిన నివేదికలను, వాటిలో గుర్తించిన అంశాలను సమగ్రంగా పరిశీలించాలి. వీటికి అదనంగా వాతావరణ మార్పు సదస్సులు, కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ సంబంధిత నగోయ, కార్టజీన్ ప్రోటోకాల్‌పై సమాచారాన్ని సేకరించాలి. జనరల్‌సైన్స్‌లో మానవ ధర్మశాస్త్రం, వ్యాధులు, ఆవర్తన పట్టిక, మెటలర్జీ, అప్లైడ్ కెమిస్ట్రీ, రేడియోధార్మికత, కాంతి, మెకానిక్స్, ఎలక్ట్రానిక్ పరికరాల సూత్రాలు ముఖ్యమైనవి. ఇటీవలి ఇస్రో ప్రయోగాలు, క్షిపణి పరీక్షలు, నోబెల్ పురస్కారాలు, ఐటీ, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో ఆవిష్కరణాలపై దృష్టి సారించాలి.

పాథమిక భావనలే కీలకం
గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. 15 నుంచి 20 ప్రశ్నలు వస్తున్నాయి. వీటిల్లో కరెంట్ అఫైర్స్ సంబంధిత ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రిపరేషన్‌కు రోజూ కనీసం 2 గంటల సమయం కేటాయించాలి. ప్రతి అంశాన్ని ప్రిపేరయ్యే క్రమంలో వాటికి సంబంధించిన ప్రాథమిక భావనలపై పట్టు సాధించాలి. అప్పుడే అప్లికేషన్ స్కిల్ అలవడుతుంది. ఉదాహరణకు ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు వంటి అంశాలను తీసుకుంటే.. ద్రవ్యలోటు పదంపై అవగాహన ఏర్పర్చుకోవాలి. అప్పుడే అధిక ద్రవ్యలోటుకు కారణాలు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం వంటి విషయాలపై సులభంగా పట్టు సాధించవచ్చు. ప్రస్తుతం మిగిలి ఉన్న సమయంలో ఆర్థిక వృద్ధి నిర్మాణాత్మక మార్పులు, ప్రణాళికలు, ద్రవ్యోల్బణం, పేదరికం, ఉపాధి-నిరుద్యోగిత, బ్యాంకింగ్ రంగంపై నాయక్ కమిటీ సిఫార్సులు, రిజర్వ్ బ్యాంక్ పరపతి నియంత్రణ చర్యలు, పన్నుల వ్యవస్థ-జీఎస్‌టీ, అంతర్జాతీయ వాణిజ్యం, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, జాతీయాదాయం, మానవాభివృద్ధి వంటి అంశాల ప్రిపరేషన్‌కు ప్రాధాన్యతనివ్వాలి. అదే సమయంలో కరెంట్ అఫైర్స్‌లో భాగంగా నల్ల ధనం-ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ఇరాక్ సంక్షోభం-ప్రభావం వంటి అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి.

పరిధి విస్తృతం
సివిల్స్ ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ హిస్టరీ సిలబస్‌లో ‘భారత దేశ చరిత్ర, భారతదేశ స్వాతంత్య్రోద్యమం’ అని పేర్కొన్నారు. చరిత్రలో ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర విభాగాలుంటాయి. హిస్టరీ నుంచి 15-20 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ఈ సబ్జెక్ట్ పరిధి విశాలం కాబట్టి ప్రస్తుతం ఉన్న సమయాన్ని అంశాల వారీగా ప్రాధాన్యత క్రమంలో విభజించుకోవడం ప్రయోజనకరం. ఈ క్రమంలో పూర్వచరిత్రలో బ్రహ్మగిరి, కుప్గల్, బుర్జహాం వంటి అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా రావచ్చు. సింధూనాగరికతలో అమ్రీ సంస్కృతి, కుల్, క్వెట్టా వంటి పూర్వ హరప్పా స్థావరాలు, వేద సమాజం, రుగ్వేదం వంటి అంశాలపై దృష్టి సారించాలి. తర్వాత మత ఉద్యమాలు-మౌర్య సామ్రాజ్యం, మౌర్యుల అనంతర యుగాలను ప్రిపేర్ కావాలి. గుప్తులు, వారి అనంతర రాజ్యాలు, తొలి మధ్య కాల విషయాలపై పట్టు పెంచుకోవాలి. 13వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం, మొగల్స్ యుగం అంశాలను చదవాలి. మొగల్ రాజ్య పతనం, బ్రిటిష్ రాజ్య విస్తరణ అంశాలను పునశ్చరణ చేసుకోవాలి. తర్వాత 19వ శతాబ్దంలో వచ్చిన సంఘస్కరణలు, మత రంగంలో మార్పులు, చివరగా భారత స్వాతంత్య్ర ఉద్యమం గురించి పూర్తిస్థాయిలో తెలుసుకోవాలి. ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి అడుగుతున్న కొన్ని ప్రశ్నలు పూర్తిగా ఫిలాసఫీకి సంబంధించినవి ఉంటున్నాయి. ఇండియన్ హిస్టరీ నుంచి రాజకీయ కోణం నుంచి కాక సామాజిక, సాంస్కృతిక అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయి. ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి సంఘసంస్కరణ ఉద్యమాలు, జాతీయ ఉద్యమం- ముఖ్య ఘట్టాలు, చట్టాలు- ఫలితాలు వంటి వాటిపై దృష్టిసారించాలి. ముఖ్యమైన అంశాల నుంచి కాకుండా, మారుమూల అంశాల నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల అభ్యర్థులు పూర్తిస్థాయిలో విశ్లేషణాత్మక ప్రిపరేషన్ సాగించాలి. ప్రిపరేషన్‌కు ఎన్‌సీఈఆర్‌టీ పాత పుస్తకాలు ఉపయోగపడతాయి. ప్రాచీన చరిత్రకు ఆర్.శర్మ, రొమిల్లా థాపర్; మధ్యయుగ చరిత్రకు సతీష్ చంద్ర; ఆధునిక చరిత్రకు బిపిన్ చంద్ర పుస్తకాలు ప్రయోజనకరం.

స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు
జాగ్రఫీ, ఎన్విరాన్‌మెంటల్ ఎకాలజీ నుంచి 24-30 ప్రశ్న లు వస్తున్నాయి. ప్రిలిమ్స్‌లో జాగ్రఫీ, ఎకాలజీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సిలబస్‌లో ‘భారతదేశం, ప్రపంచ భౌతిక, సామాజిక, ఆర్థిక భూగోళశాస్త్రం’ అని పేర్కొన్నారు. అభ్యర్థులు భారత్-భౌగోళిక అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి. మన దేశానికి సంబంధించి వ్యవసాయం- వ్యవసాయ సంక్షోభం, రుతువులు, నదులు, అడవులు- అటవీ భూముల ఆక్రమణ, అంతరిస్తున్న జీవజాతులు, శక్తి వనరులు తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. ఎకాలజీ బేసిక్ కాన్సెప్టులపై అవగాహన పెంపొందిచుకోవాలి. విపత్తులకు సంబంధించి భూకంపాలు, సునామీలు, తుపానులు, అగ్నిపర్వత పేలుళ్లు, వరదలు వంటి వాటికి సంబంధించిన శాస్త్రీయ పరిజ్ఞానంపై ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడు స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు వస్తున్నాయి. ఒకే ప్రశ్న ద్వారా వివిధ అంశాల్లో అభ్యర్థికున్న పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఉంటున్నాయి. అందువల్ల అభ్యర్థులు విశ్లేషణాత్మక ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. ఎన్‌సీఈఆర్‌టీ 10, 11, 12 తరగతుల పుస్తకాలు; సర్టిఫికెట్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ- గో చెంగ్ లియాంగ్; ఇండియన్ ఇయర్‌బుక్‌లోని అగ్రికల్చర్, ట్రాన్స్‌పోర్ట్, ఎన్విరాన్‌మెంట్ అంశాలు; ఎకనమిక్ సర్వే ప్రిపరేషన్‌కు తోడ్పడతాయి.

అంశాల వారీగా
పేపర్-2
ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు సంబంధించి అంశాల వారీగా సమయాన్ని విభజించుకోవాలి.
బేసిక్ న్యూమరసీ: ఈ విభాగంలో త్వరగా తప్పులు లేకుండా చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ క్రమంలో కసాగు, గసాభా, కాలం-దూరం, కాలం-పని, సరాసరి, నిష్పత్తి-అనుపాతం, శాతాలు, బారువడ్డీ-చక్రవడ్డీ, లాభం-నష్టం, భాగస్వామ్యం, క్షేత్రమితి, ప్రస్తారాలు-సంయోగగాలు, సంభావ్యత, త్రికోణమితి వంటి అంశాలను పునశ్చరణ చేసుకోవాలి. అంతేకాకుండా ప్రాథమిక సంఖ్యావాదం, 35వరకు ఘనాలు, 20వరకు ఎక్కాలు నేర్చుకోవాలి. ప్రతి అంశంలో సూత్రాలపై పట్టు సాధించాలి.

డేటా ఇంటర్‌ప్రిటేషన్: ఈ విభాగానికి 4 రోజులు కేటాయించాలి. సంఖ్యలు, చిత్రాలతో కూడిన సమాచారాన్నే డేటా అని పేర్కొనవచ్చు. ఎక్కువ సమాచారాన్ని తక్కువ పేజీలలో చూపించడానికి ఉయోగించే మార్గం డేటా ఇంటర్‌ప్రిటేషన్. ఇందులోని ప్రశ్నలన్నీ సరాసరి, నిష్పత్తి-అనుపాతం, శాతాల ఆధారంగా అడుగుతారు. కాబట్టి ఈ మూడు అంశాలను సాధన చేయాలి. వీటిలో టాబ్యులేషన్, బార్ డయాగ్రామ్స్‌ను ఒక రోజు, ్ఠడ చార్ట్స్, పైచార్ట్‌ను మరొక రోజు ఫ్రాక్టీస్ చేయాలి.

డేటా సఫీషియన్సీ: ఈ విభాగం కోసం ఒక రోజు సరిపోతుంది. ఇందులో ఒక ప్రశ్న ఇచ్చి దాని తర్వాత రెండు లేదా మూడు స్టేట్‌మెంట్స్ ఇస్తారు. కింద ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. ఇందులో ప్రశ్నలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి.. ఆప్టిట్యూడ్ బేస్డ్ కొశ్చన్స్, రీజనింగ్ బేస్డ్ కొశ్చన్స్. ఆప్టిట్యూడ్, రీజనింగ్ ప్రశ్నలు అన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత చివర్లో డేటా సఫిషియన్సీని ప్రాక్టీస్ చేయడం ఉత్తమం.

జనరల్ మెంటల్ ఎబిలిటీ: దీన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్. ఇందులో వెర్బల్ రీజనింగ్ కోసం 8 రోజులు, నాన్ వెర్బల్ కోసం 3 రోజులు కేటాయిస్తే సరిపోతుంది. వెర్బల్ రీజనింగ్‌లో సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్-డీకోడింగ్, దిక్కులు, ర్యాంకింగ్ టెస్ట్, గణిత పరిక్రియలు వంటి అంశాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. నాన్‌వెర్బల్ రీజనింగ్‌లో ప్రశ్నలు చిత్రాల ఆధారంగా ఉంటాయి. ఇందులో సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, అద్దంలో ప్రతిబింబాలు, నీటిలో ప్రతిబింబాలు వంటి వాటిని ఎక్కువగా సాధన చేయాలి. అంతేకాకుండా ఇచ్చిన చిత్రంలో త్రిభుజాల సంఖ్య లేదా చతురస్రాల సంఖ్య వాటిపై కూడా దృష్టి సారించాలి.

లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్: ఈ విభాగం కోసం 11 రోజుల సమయం కేటాయించాలి. కేవలం తార్కిక దృష్టితో ఆలోచించి సమాధానాలను గుర్తించాలి. ఇందులో బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, పజిల్స్, స్టేట్‌మెంట్ అండ్ కన్‌క్లూజన్స్, స్టేట్‌మెంట్ అండ్ అసెంప్షన్, లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్, లాజికల్ వెన్ డయాగ్రమ్స్‌ను ప్రిపేర్ కావాలి. బ్యాంక్ పీఓ పరీక్షల గత పేపర్లను ప్రాక్టీస్‌చేయాలి. చివరి 5 రోజులు గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి, మాక్ టెస్ట్‌లకు హాజరు కావాలి.

రిఫరెన్‌‌స బుక్స్:
  • CSAT Civil Services Aptitude Test 2014 Cengage Learning India.
  • A Modern Approach To Verbal & Non Verbal Reasoning R.S.Aggarwal.
Bavitha సివిల్స్ ప్రిలిమ్స్‌లో పేపర్-1 (జనరల్ స్టడీస్) విషయంలో ఇటీవల కాలంలో పర్యావరణం, క్లైమేట్ ఛేంజ్, గ్లోబల్ వార్మింగ్ వంటి అంశాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించిన అంతర్జాతీయ సదస్సులు, తీర్మానాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఐసీఎస్‌ఈ సిలబస్‌లోని 9, 10 తరగతుల్లో ఎన్విరాన్‌మెంట్ సైన్స్ విభాగాన్ని చదవడం ప్రయోజనకరం. పేపర్-1లో ప్రశ్నలను కాన్సెప్ట్యువల్ బేస్డ్‌గా అడుగుతున్నారు. కాబట్టి ఒక అంశాన్ని చదివేటప్పుడు దాని నేపథ్యం నుంచి తాజా పరిణామాల వరకు అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ చదవాలి. రెండో పేపర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అభ్యర్థులు ప్రధానంగా జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీలపై పట్టు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. బేసిక్ న్యూమరసీ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటున్నాయి. తెలుగు మీడియం విద్యార్థులు రీడింగ్ కాంప్రహెన్షన్‌పైనా దృష్టి సారించాలి. అభ్యర్థులు పేపర్-2 (ఆప్టిట్యూడ్ టెస్ట్)లో 130-140 మార్కుల లక్ష్యంగా ముందుకుసాగాలి. అటెంప్ట్‌ల విషయంలో తొలిసారి, చివరిసారి అనే తేడా లేకుండా.. లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్‌కు ఆస్కారమిచ్చినట్లు గత మూడేళ్ల ప్రశ్న పత్రాల పరిశీలన ద్వారా అవగమవుతోంది. కాబట్టి తొలిసారి హాజరయ్యే అభ్యర్థులు ఆందోళన చెందక్కర్లేదు.
Published date : 11 Jul 2014 03:52PM

Photo Stories